జగన్ హయాంలో వైసీపీ నేతలు ఇష్టారీతిన చెలరేగిపోయారు. మైనింగ్, ఇసుక, మద్యం, భూములు, రేషన్ బియ్యం ఇలా ఓ ఒక్క దాన్ని వదల్లేదు. ఐతే గడిచిన ఐదేళ్లలో భూదందాలకు పాల్పడిన మంత్రులు, వైసీపీ నేతలు, రెవెన్యూ అధికారులెవరో రెవెన్యూ శాఖ నిర్ధారించింది. జగన్ కేబినెట్లో మంత్రులుగా ఉన్న ఆరుగురు అక్రమాలకు పాల్పడ్డారని తేల్చింది. 42 మంది ప్రజాప్రతినిధులు, 120 మంది వైసీపీ నేతలు, 22 మంది డిప్యూటీ కలెక్టర్లు, 48 మంది తహశీల్దార్లు ప్రధాన పాత్ర పోషించారని స్పష్టంచేసింది. వారందరిపై క్రిమినల్ కేసులు పెట్టాలని సిఫారసు చేసింది.
నిజానికి రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుతీరిన నెలన్నరకే 2024 జూలై 22న దుండగులు ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసుకు కుట్రపూరితంగా నిప్పుపెట్టారు. కీలకమైన ల్యాండ్ రికార్డులను తగలబెట్టారు. ఈ ఘటనపై ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. మరోవైపు రెవెన్యూ శాఖ కూడా అంతర్గత విచారణ చేపట్టింది. ఓ సీనియర్ అసిస్టెంట్, ఆర్డీవో, మాజీ ఆర్డీవోను ప్రభుత్వం సస్పెం డ్ చేసింది. సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ను పోలీసులు అరెస్టు చేశారు.
ఈ కేసులో రెవెన్యూ విభాగం శాఖాపరమైన విచారణకు ఉపక్రమించింది. మదనపల్లె రెవెన్యూ డివిజన్ పరిధిలో వేలాది ఎకరాల అసైన్డ్ భూములు అక్రమంగా ఫ్రీహోల్డ్ చేశారని తేల్చారు. ఈ నేపథ్యంలో గతేడాది ఆగస్టులోనే ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్ను ప్రభుత్వం నిలిపివేసింది. డిప్యూటీ కలెక్టర్ల నేతృత్వంలో ఎక్కడికక్కడ విచారణ బృందాలు ఏర్పాటు చేసి అసైన్డ్ భూములపై విచారణ చేయించింది. భూముల రికార్డులను పునఃపరిశీలన చేయించింది. రాష్ట్రవ్యాప్తంగా 13.59 లక్షల ఎకరాలను ఫ్రీహోల్డ్ చేయగా.. అందులో 5.74 లక్షల ఎకరాలను అక్రమంగా, చట్టవ్యతిరేకంగా, జీవో 596ని ఉల్లంఘించి నిషేధ జాబితా నుంచి బయటకు తీశారని విచారణలో తేలింది.
25 వేల ఎకరాలను రిజిస్ట్రేషన్ చేయగా, అందులో 8,483 ఎకరాలు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని తేల్చారు. విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం.. నాటి వైసీపీ ప్రభుత్వంలో ఆరుగురు మంత్రులు, 42 మంది ప్రజాప్రతినిధులు, 120 మంది నేతలు, 22 మంది డిప్యూటీ కలెక్టర్లు, 48 మంది తహశీల్దార్లు, 23 మంది మండల సర్వేయర్లు.. ఈ భూదందాల్లో ప్రధాన పాత్రధారులని రెవెన్యూ శాఖ తన నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. నేతలు, అధికారులపై అసైన్డ్ భూముల చట్టం-1977లోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని సిఫారసు చేసింది.
చట్టవిరుద్ధంగా, కుట్రపూరితంగా ప్రభుత్వ, అసైన్డ్ భూములు కాజేసిన వారిపై భూముల ఆక్రమిత చట్టం-1905 కింద క్రిమినల్ కేసులు పెట్టాలని..ప్రభుత్వ భూములను చెరపట్టేందుకు కుట్రలు, కుయుక్తులు పన్నినందుకు కూడా కేసులు నమోదు చేయాలని రెవెన్యూ శాఖ ప్రతిపాదించినట్లు తెలిసింది. నాడు ఆర్డీవోలు, తహశీల్దార్లుగా పనిచేసిన రెవెన్యూ అధికారులపై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవడమే గాక ఏసీబీ లేదా విజిలెన్స్-ఎన్ఫోర్స్మెంట్తో విచారణకు ఆదేశించాలని సూచించినట్లు సమాచారం. ఇవన్నీ ప్రభుత్వ స్థాయిలో తీసుకోవలసిన నిర్ణయాలే. అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తప్పనిసరి. దీంతో ఆయా ప్రతిపాదనలను ఆయన పరిశీలనకు పంపించారు. సదరు ఫైలు ప్రస్తుతం సాధారణ పరిపాలన శాఖ పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయన ఇచ్చే ఆదేశాల కోసం రెవెన్యూ శాఖ ఎదురుచూస్తోంది.