ఒకప్పుడు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఆ అధికార పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఇప్పుడు ఎడమొహం , పెడమొహం పెట్టుకుంటున్నారు. నేనెంతో నువ్వంతే అన్నటు వ్యవహరించిన ఇద్దరు నేతలు ఇప్పుడు ఒకరిపై మరొకరు చిందులేసుకుంటున్నారట. ఎదురు పడితే చాలు ఎవరికి వారు ఒళ్ళంతా కంపరమెక్కినట్లు ప్రవర్తిస్తున్నారట.ఇంతకీ ఎవరా నేతలు? పాలు నీళ్ళులా కలిసి ఉండే వారి మధ్య వివాదం ఏమిటి ?
విజయనగరం జిల్లా విశాఖ జిల్లాను కలిపుతూ ఉన్న శృంగవరపుకోట నియోజకవర్గంలోని అధికార వైసీపీలో వర్గ విబేధాలు భగ్గుమంటున్నాయి.నిన్న మొన్నటి వరకు పాలు నీళ్ళుగా కలిసున్న ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ రఘు రాజు మధ్య ఏర్పడిన అగాధమే దీనికి కారణమనే చర్చ జిల్లా రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.ఇరువురి మధ్య నెలకొన్న ఆధిపత్య పోరుతో నియోజకవర్గంలో రాజకీయం ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ గా మారి పార్టీలోనూ సెగలు పుట్టిస్తోందట.
వాస్తవానికి సీనియర్ నాయకుడైన కడుబండి శ్రీనివాసరావు స్థానికేతరుడు.2019 ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ బొత్స వర్గీయుడు అయిన రఘు రాజుని కాదని శ్రీనివాసరావుకు టికెట్ ఇచ్చారు.అధినేత ఆదేశాలతో ఎస్.కోట నుంచి పోటీ చేసిన ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించాడు.అయితే ఎన్నికల ముందు నుంచి ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగేవారట.ఎమ్మెల్యే కడుబండి ఎక్కడకు వెళ్ళినా రఘు రాజుని వెంటపెట్టుకు వెళ్ళేవారని టాక్.
ముఖ్యంగా ఎమ్మెల్యే కడుబండి ఏ కార్యాలయానికి వెళ్ళినా, ప్రారంభోత్సవాలకు ,ఆఖరికి సి.సి రోడ్ల శంకుస్థాపనకు వెళ్ళినా రఘు రాజు ఆయన వెంట ఉండాల్సిందేనట. ఏదైనా సందర్భంగా రఘు రాజు వెనుక ఉండిపోయినా ఎమ్మెల్యే కడుబండి ఒప్పుకునేవారు కాదట. తానెంతో రఘు రాజు అంతే అని బహిరంగంగానే చెప్పేవారట. అంతేకాదు నియోజకవర్గంలో ఎమ్మెల్యేతో ఏ పని జరగాలన్నా రాజు గారి అనుగ్రహం లేకపోతే పని జరిగేది కాదట.దీంతో ఒకానొక దశలో కడుబండి గెలుపు కోసం కృషి చేసిన ఆయన సామాజిక వర్గానికి చెందిన వారు సైతం ఏ పని జరగాలన్నా రఘురాజు దగ్గరకి వెళ్లాల్సి రావడం పై విముఖత వ్యక్తం చేశారట.ఈ క్రమంలోనే కడుబండికి ఆయన సామాజిక వర్గ నేతలకి మధ్య గ్యాప్ కూడా ఏర్పడిందట. అయినా ఎమ్మెల్యే మాత్రం రఘు రాజునే వెంట పెట్టుకుని ఉండేవారట.
కట్ చేస్తే ఏమయ్యిందో ఏమో గానీ నియోజకవర్గంలో సీన్ ఒక్కసారిగా మారిపోయిందనే చర్చ జోరందుకుంది.పాలు నీళ్ళులా కలిసున్న ఇద్దరు నేతలు ఇప్పుడు ఉప్పు నిప్పులా వ్యవహారస్తున్నారట.తాజాగా రఘు రాజుకి ఎమ్మెల్సీ పదవి వచ్చాక ఇద్దరి మధ్య గ్యాప్ ఏర్పడిందని, ఈ కారణంగానే ఇరువురు ఎడమొఖం.. పెడమొఖంగా ఉంటున్నారనే వాదన వైసీపీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
నిజానికి బొత్స ఆశీస్సులతో ఎమ్మెల్సీ పదవి దక్కాక రఘు రాజు వ్యవహార శైలి పూర్తిగా మారిపోయిందట.నియోజకవర్గంలో ఎమ్మెల్యే కడుబండిని కాదని అంతా తానే అన్నట్లు వ్యవహరించడం మొదలు పెట్టారట.అంతేకాదు, నియోజకవర్గంలో జరిగే ప్రతీ విషయాన్ని తనకే చెప్పాలని అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారట.అసలు ఎమ్మెల్యే లేకుండానే ప్రభుత్వ కార్యక్రమాలకు, ప్రారంభోత్సవాలకు హాజరై తానే కానిచ్చేస్తున్నారట.దీంతో నియోజకవర్గంలో అంతా తానే అన్న సంకేతాలు ఇస్తున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. రఘు రాజు యవ్వారంతో బిత్తరపోయిన ఎమ్మెల్యే శ్రీనివాసరావు చనువిస్తే చంకన కాదు ఏకంగా నెత్తినేక్కి కూర్చున్నాడని తన అనూచారుల వద్ద ఆవేదన వెళ్లగక్కుకుంటున్నారట.
మొత్తం మీద బాధపడితేగానీ బోధపడదన్ననే విషయం ఎమ్మెల్యే కడుబండకి ఇప్పుడు తెలిసొచ్చినట్లు కనిపిస్తోంది. దీంతో ఆయన మళ్లీ తన సామాజిక వర్గం నాయకులనే చేరదీసుకునే ప్రయత్నం చేస్తున్నారట.ఈ క్రమంలోనే ఎలాగైనా ఎమ్మెల్సీ పై రివెంజ్ తీర్చుకోవాలని తనదైన శైలిలో పావులు కూడా కదుపుతున్నారట.. మరి నియోజకవర్గం లో పట్టుకోసం ఎమ్మెల్యే కడుబండి చేస్తున్న ప్రయత్నం ఫలిస్తుందో లేదో వేచి చూడాలి.