YCP MP Raghu Rama Raju Wrote Letter To Amit Shah :
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామరాజు లేఖల మీద లేఖలు రాస్తూనే ఉన్నారు. ఇప్పటికే పలు సమస్యలు, హామీలపై లేఖలు రాసిన రఘురామ తాజాగా మరో లేఖను సంధించారు. ఈసారి కేంద్రహోంమంత్రి అమిత్ షాకు లేఖను రాశారు. మూడు రాజధానులు, ఏపీ ఆర్థిక పరిస్థితి గురించి లేఖలో ప్రస్తావించారు. పార్లమెంటులో ఆమోదించిన విభజన చట్టానికి అసెంబ్లీలో సవరణ చేశారని రఘురామరాజు ఆరోపించారు. విభజన చట్టంలో లేని విధంగా మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. పార్లమెంటులో చట్టాన్ని సవరించినప్పుడే మూడు రాజధానులకు చట్టబద్ధత వస్తుందని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని గమనించే ఏపీ హైకోర్టు స్టే ఇచ్చిందని గుర్తుచేశారు.
రాష్ట్రం దివాళా తీసింది
ఇటీవల జలవివాదాన్ని పరిష్కరించినట్టే, 3 రాజధానుల అంశాన్ని కూడా కేంద్రమే పరిష్కరించాలని రఘురామ అమిత్ షాను కోరారు. వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. 15వ తేదీ వచ్చినా ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతున్నారని తెలిపారు. విడుతల వారీగా జీతాలు ఇస్తుండటంతో ప్రభుత్వ ఉద్యోగులు పస్తులుండే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వమే కలుగుజేసి ఈ సమస్యలను పరిష్కరించాలని రఘురామరాజు కోరారు.
మూడు రాజధానులు ఎలా కడతారు?
ఏపీకి మూడు రాజధానుల అంశంపై టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ స్పందించారు. మూడు రాజధానులతో ఆర్థిక సంక్షోభం ఏర్పడిందని, గ్రామ సచివాలయాలకు అద్దెలు చెల్లించలేని వ్యక్తి మూడు రాజధానులు ఎలా కడతారని ప్రశ్నించారు. 579 రోజులుగా రైతులు, రైతు కూలీలు అమరావతి కోసం ఉద్యమం చేస్తుంటే ముఖ్యమంత్రి పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కౌలు, పెన్షన్లు ఇవ్వకుండా రైతులను వేధిస్తున్నారని, మూడు రాజధానుల నిర్ణయం తీసుకుని రెండేళ్లు అయినా.. మూడు ప్రాంతాల్లో మూడు భవనాలుకానీ, మూడు రోడ్లుకానీ, మూడు ఉద్యోగాలుకానీ ఇవ్వలేదని వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.