విశాఖలో విసృంఖులుగా అవినీతి..!
జగన్ నవరత్నాలను పార్టీ నేతలు, కేడర్ నానావిధాలుగా వాడేస్తోంది! అవకాశం దొరికినప్పుడల్లా.. అందినకాడికి దోచుకుంటున్నారు. విశాఖ జిల్లాలో వృద్ధులకు అందించాల్సిన పింఛన్ సొమ్ము ను గ్రామ సర్పంచ్, 9 మంది వలంటీర్స్ వాటాలు వేసుకుని పంచేసుకున్నాను. అధికారుల విచారణలో అసలు విషయం నిగ్గు తేలడంతో.. ఆ సర్పంచ్ బండారం బహిర్గతమైంది! జిల్లాలోని కోటవురట్ల మండలం చౌడువాడ పంచాయతీ పరిధిలో పింఛన్ల పంపిణీలో అవకతవకల జరిగాయని ఆరోపణలు రావడంతో జిల్లా కలెక్టర్ మల్లిఖార్జున విచారణకు ఆదేశించారు. అధికారుల విచారణలో లక్షల్లో పింఛన్ నగదు పక్కదోవ పట్టించారని తేలడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పింఛన్ నగదును పక్కదోవ పట్టించినవారిలో 9 మంది వలంటీర్స్ పాత్ర ఉందని, చేతివాటానికి సూత్రదారి సర్పంచ్ అని తెలియడంతో చర్యలు తీసుకున్నారు. ఈ వ్యవహారంలో భాగస్వాములుగా ఉన్న 9 మంది వలంటీర్స్ ను ఉద్యోగాల నుంచి తొలగించగా.. సర్పంచ్ నూ మూడు నెలలు సస్పెన్షన్ వేటు వేశారు. వీరితో పాటు గ్రామ సచివాలయ సంక్షేమ సహాయకుడిని కూడా సస్పెండ్ చేశారు. అలానే పంచాయతీ కార్యదర్శి పరమేశ్వరరావుకు సైతం షోకాజ్ నోటీలు జారీ చేశారు. పింఛన్ దారుల నగదును సొంత అవసరాలకు వాడుకున్న, జాప్యం వహించిన, డబ్బులు వసూలు చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ మల్లిఖార్జున హెచ్చరించారు.