ముగిసిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో వైఎస్ఆర్ సీపీ ఘోరమైన ఓటమి తర్వాత ఆ పార్టీని పట్టించుకునే వారే కరవయ్యారు. కనీసం ఇన్నాళ్లు పార్టీలో మెలిగిన నేతలు సైతం తమ అధినేతపై ఆగ్రహంతో కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. కొన్ని చోట్ల వైసీపీ కార్యాలయాలు మూసేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. అయితే, త్వరలో ఓ ఎమ్మెల్సీ ఎన్నిక రాబోతోంది. అందులో కనుక టీడీపీ విజయం సాధిస్తే.. ఇక వైసీపీ పూర్తిగా కనుమరుగు కావడం ఖాయం అనే విశ్లేషణలు వ్యక్తం అవుతున్నాయి.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు గానూ ఏకంగా 164 ఎమ్మెల్యే సీట్లును కూటమి ప్రభుత్వం కైవసం చేసుకుని చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ పార్టీ జనసేన కూడా వందశాతం గెలుపుతో అద్భుతమైన రీతిలో సత్తా చాటింది. పొత్తులో భాగంగా జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులు గెలిచారు. ఎన్నికలు ముగిశాక ఇప్పుడు అంతగా ప్రాధాన్యం లేని స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ కాస్త ప్రభావం చూపగలిగింది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు, కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైసీపీ నాయకులు కాస్త ప్రభావ చూపగలిగారు.
కానీ, ఇంకొద్ది రోజుల్లో అసలైన సమరం మొదలుకానుంది. స్థానిక సంస్థల కోటా విశాఖ ఎమ్మెల్సీ ఎన్నిక త్వరలోనే జరగనుంది. ఈ క్రమంలో విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా సీనియర్ నేత బొత్స సత్యనారాయణను జగన్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. అయితే కూటమి ప్రభుత్వం కూడా ఇప్పుడు బొత్సకు ధీటైన అభ్యర్థిని బరిలోకి దింపేందుకు ఏర్పాట్లు చేసుకుంటుంది. టీడీపీ నుంచి పీలా గోవింద్తో పాటు పెందుర్తి నేత గండి బాబ్జీ పేర్లు వినిపిస్తున్నాయి. వీరిద్దరిలో ఎవరో ఒకరు బరిలో నిలిచే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు గెలుపుపై వైసీపీ నేతలు ధీమాగా కనిపిస్తున్నారు.
స్థానిక సంస్థల్లో వైసీపీకి పూర్తి మెజార్టీ ఉండగా.. ఈ మధ్య చాలా మంది టీడీపీ, జనసేనలో చేరారు. ఈ స్థానిక సంస్థల కోటా ఎన్నికలో జీవీఎంసీ కార్పొరేటర్లు, యలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీల కౌన్సిలర్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. మొత్తం ఓట్లు 841 ఉన్నాయి. కానీ, అందులో వైసీపీ బలం 615 ఉంది.. టీడీపీ, జనసేన, బీజెపీ సభ్యులకు 215 ఓట్లు మాత్రం ఉన్నాయి. కానీ, గత కొంత కాలంగా భారీ సంఖ్యలో వైసీపీ నుంచి చేరికలు టీడీపీ, జనసేనలోకి ఉంటున్నాయి. పైగా స్థానిక టీడీపీ నేతల వ్యూహాలు కూడా బాగా పని చేస్తాయని అంటున్నారు. దీంతో టీడీపీ కూటమి విజయం సాధించే అవకాశాలు బలంగా ఉన్నాయని అంటున్నారు. అదే జరిగితే, అంత బలాన్ని కాపాడుకోలేని అసమర్థ పార్టీగా వైఎస్ఆర్ సీపీ మిగిలిపోనుంది. ఆ ప్రభావం రాష్ట్రమంతా పడి.. పార్టీ మనుగడే ప్రశ్నార్థకం అవుతుందని అంటున్నారు.











