కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పార్లమెంటు సమావేశాలకు హాజరు కావడంపై సందిగ్ధత నెలకొంది. ఆయన వరుసగా రెండోసారి కడప నుంచి గెలిచినప్పటికీ.. ప్రస్తుతం సభ జరుగుతుండగా.. కడప లేదా హైదరాబాద్ లోనే కనిపిస్తూ ఉన్నారు. 2014లో వైఎస్ అవినాష్రెడ్డి తొలిసారిగా కడప ఎంపీగా ఎన్నికైన సంగతి తెలిసిందే. అప్పట్లో వైసీపీ తరపున మొత్తం 8 మంది పార్లమెంటుకు ఎన్నిక కాగా, వీరిలో ముగ్గురు ఎంపీలు.. గత ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు.
2019 ఎన్నికల్లో వైసీపీ తరపున 22 మంది లోక్ సభకు ఎన్నికయ్యారు. వీరిలో రఘురామకృష్ణం రాజు పార్టీతో విభేదించి, రెబెల్ గా మాట్లాడిన సంగతి తెలిసిందే. ఎక్కువ మంది ఎంపీలు ఉండడంతో అవినాష్ రెడ్డి లోక్ సభ సమావేశాలకు హాజరు కాకపోయినప్పటికీ పెద్దగా హైలైట్ కాలేదు. కానీ, ప్రస్తుత పరిస్థితి భిన్నంగా ఉంది. తాజా ఎన్నికల్లో వైసీపీ తరపున నలుగురే ఎంపీలు ఎన్నిక కాగా, వారిలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఒకరు. ముఖ్యంగా పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సోదరుడిగా అవినాష్ రెడ్డి పార్టీ బాధ్యతల పట్ల నిబద్ధతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంటులో ప్రస్తావించాల్సిన అనేక అంశాలు ఉన్నాయి. ఈ సమస్యలపై పార్లమెంట్లో అవినాష్రెడ్డి ప్రాతినిధ్యం వహించకుండా కడపకే ఎందుకు పరిమితమవుతున్నారనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అవినాష్ రెడ్డి పార్లమెంటు సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరు కావడం.. కనీసం లోక్సభలో తన నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలను లేవనెత్తడం చాలా కీలకం అని కడప ప్రజలు భావిస్తున్నారు. పార్లమెంటు సమావేశాలకు వెళ్లకుండా ఉండడంతో అవినాష్ రెడ్డి చాలా తప్పుడు సంకేతాలను ప్రజల్లోకి పంపుతున్నారు.
అసలే కడపలో వివేకా హత్య కేసు చుట్టూనే గత ఎన్నికలు జరిగాయి. అవినాష్ గెలుస్తారా లేదా అనే అనుమానాలు చాలా మందిలో ఉండేవి. ఎందుకంటే అవినాష్ అక్క వైఎస్ షర్మిల.. ఒక హంతకుడ్ని పార్లమెంటుకు పంపుతారా అని నేరుగా నిలదీశారు. వివేకా కేసులో నిందితుడైన అవినాష్ రెడ్డి ఇలా పార్లమెంటుకు వెళ్లకుండా తప్పించుకు తిరుగుతుండడంపై చాలా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కనీసం జగన్ కూడా తన తమ్ముడికి ఈ విషయంలో ఎలా వ్యవహరించాలో చెప్పాలని కడప ప్రజలు కోరుతున్నారు.











