తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు జగన్ మోహన్ రెడ్డికి, కేసీఆర్కు దగ్గరి పోలికలు కనిపిస్తున్నాయి. తొలుత ఓడిపోయిన కేసీఆర్ తాను అధికారంలో ఉండగా.. వ్యవహరించిన తీరునే జగన్ మోహన్ రెడ్డి కూడా ఫాలో అయినట్లు కనిపిస్తోంది. తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు ప్రగతి భవన్ కే పరిమితం అయ్యారు. కొత్త సెక్రటేరియట్ కట్టించుకున్న తర్వాత మాత్రమే అప్పుడప్పుడు సచివాలయానికి వచ్చేవారు. ఇక ప్రగతి భవన్లోకి ఎవరికీ ఎంట్రీ ఉండేది కాదు. ఎమ్మెల్యే అయినా.. ఆఖరికి మంత్రి అయినా కేసీఆర్ ను కలిసే అవకాశమే ఉండేది కాదు. చాలా అరుదుగా మాత్రమే కేసీఆర్ తన పార్టీ నేతను కలిసేవారు. ఇక సామాన్యులకైతే అస్సలు ఛాన్సే ఉండేది కాదు. ఒకరకంగా తెలంగాణలో నియంత పాలన అనే పేరును కేసీఆర్ పొందాల్సి వచ్చింది.
అటు ఆంధ్రప్రదేశ్లోనూ జగన్ మోహన్ రెడ్డి అంతకన్నా ఎక్కువే ప్రవర్తించారు. తాడేపల్లి ప్యాలెస్కు అర కిలో మీటర్ దూరం నుంచే రోడ్లను బంద్ చేశారు. ఆ తర్వాత తాడేపల్లి ఇంటిలోనికి ఇద్దరు ముగ్గురు నేతలు మినహా ఇతర పార్టీ నేతలకు కూడా ఎంట్రీ ఉండేది కాదు. పైగా అన్నీ అనాలోచిత నియంతృత్వ నిర్ణయాలే ఉండేవి. క్షేత్ర స్థాయిలో ఎంత నష్టం జరుగుతుందో అధినేతకు చెప్పుకుందామని ఎవరైనా ప్రయత్నించినా ఫలితం ఉండేది కాదు. అసలు కలిసేందుకే అవకాశం ఇచ్చేవారు కాదు. ఇక తన క్యాంప్ ఆఫీసులోనే సచివాలయంలోని రివ్యూ హాలు సెటప్ చేసుకొని అక్కడి నుంచే అన్ని సమీక్షలు చేసేవారు. పైగా తాను సచివాలయం నుంచి అన్ని పనులు చేస్తున్నట్లుగా బిల్డప్ ఇచ్చేవారు.
ఇక జగన్ రెడ్డి బయటకు వెళ్తే ఎన్ని ఆంక్షలు ఉండేవో, సామాన్యులు ఎన్ని ఇబ్బందులు పడేవారో అందరికీ తెలిసిందే. ఆయన వచ్చే దారిలో ఎన్నో చెట్లు బలయ్యేవి. రోడ్ల పక్కన ఇరువైపులా పరదాలు ప్రత్యక్షం అయ్యేవి. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై అసలు నోరు విప్పేవారు కాదు. ఇంత నియంతలా జగన్ రెడ్డి పరిపాలన సాగేది. ఇప్పుడు అధికారం కోల్పోయాక కూడా జగన్ తన ఓటమి నుంచి ఏమీ నేర్చుకోలేదు. అటు కేసీఆర్ దారుణ ఓటమి తర్వాత చాలా సైలెంట్ అయిపోయారు. ఎన్నికల ఫలితాల తర్వాత తుంటి మార్పిడి సర్జరీ తర్వాత కూడా ఎక్కువ రోజులు బయటికే రాలేదు. పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం రోడ్ షో నిర్వహించారు. సందర్భం వచ్చినప్పుడు తన ఫాంహౌస్లోనే పార్టీ కార్యకర్తలను కలుస్తూ చాలా సమయం కేటాయిస్తున్నారు. ఇక అసెంబ్లీకి కూడా రావడం మానేశారు.
ఇప్పుడు జగన్ చాలా విషయాల్లో కేసీఆర్ ను ఫాలో అవుతున్నట్లుగా తెలుస్తోంది. కానీ, ప్రభుత్వంపై విరుచుకుపడడంలో మాత్రం మరీ ఎగిరెగిరి పడుతున్నారు. జగన్ ఇలా దూకుడుగా ఉండడం వైసీపీకి ఎదురుదెబ్బ కాబోతుందనే అభిప్రాయం వినిపిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు వారాలలోపే ప్రభుత్వంపై ఎదురుదాడి చేసి జగన్ నవ్వులపాలు అవుతున్నారు. అధికారం చేపట్టిన మరుసటి రోజు నుంచి బాబు సమీక్షలు, సమావేశాలు, వివరణలు అంటూ నిత్యం ప్రజలకు జవాబుదారిగా ఉంటూనే వస్తుండగా.. జగన్ మాత్రం నానా యాగి చేస్తున్నారు.











