నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం 72 గంటల దీక్ష చేసిన వైఎస్ షర్మిల ఇవాళ (ఆదివారం) విరమించారు. నిరుద్యోగ, అమరవీరుల కుటుంబ సభ్యులు షర్మిలతో దీక్ష విరమింపజేశారు. రవీంద్ర నాయక్ భార్య, కొడుకు షర్మిలకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. అమరుల బలిదానాల మీద గద్దెనెక్కిన కేసీఆర్ కు, నేడు నిరుద్యోగ సమస్యలు పట్టడం లేదన్నారు. రవీంద్ర నాయక్ పిల్లలను చూస్తే ఏ ఒకరికైనా కన్నీరు రాకుండా ఉంటుందా అంటూ షర్మిల తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు.
ఆర్థిక సాయం అందజేత
నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయో తెలియని అయోమయంలో నలభై లక్షమంది నిరుద్యోగులున్నారు. మానసికంగా రోజు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీక్ష అనంతరం రవీంద్ర నాయక్ భార్య, కొప్పు రాజు తల్లి, మురళీ ముదిరాజు తల్లికి 50 వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. గత మూడు రోజులుగా లోటస్పాండ్లో దీక్ష చేస్తున్న షర్మిల ఆరోగ్యం క్రమంగా క్షీణించింది. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. షుగర్ లెవల్స్ 88 నుంచి 62కు తగ్గాయని, బరువు 2 కిలోలు తగ్గినట్లు వెల్లడించారు.
Must Read ;- షర్మిల చూపు కొండా సురేఖ దంపతుల వైపు : పార్టీ పిలుపుపై సురేఖ ఏమన్నారంటే!