ప్రజల్లో మాత్రమే కాదు, అధికార పార్టీ కేడర్లో కూడా అసహనం పెరుగుతోంది. కులాల పేరుతో ప్రభుత్వమే ప్రజలను చీల్చాలని భావించడంపై ఆంధ్రప్రదేశ్ ప్రజలను కలవరపెడుతోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వలోని పెద్దలు ఓ సామాజిక వర్గం అంటూ పదే పదే ప్రస్తావించడం, ఆ జాతి అంటూ వ్యాఖ్యలు చేయడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నంతా ఇబ్బంది పెడుతోందని ప్రజలు అంటున్నారు. అధికారంలో ఉన్న వారు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేయాలి కానీ ప్రభుత్వమే ఇలా ప్రతీ అంశానికి కులాల ప్రస్తావన ఏమిటని అంటున్నారు.
ఎన్నికల సమయంలో, లేదూ మరో సందర్భంలోనో ఇలా కులాల గురించి మాట్లాడడం దేశవ్యాప్తంగా జరుగుతుందని, ఏపీ ప్రభుత్వం మాత్రం ఏ అంశాన్ని అయినా కులానికి అంటగట్టడం సక్రమం కాదనే చర్చ జరుగుతోంది. భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పురంధరేశ్వరిని నియమించగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి చేసిన- ‘జాతి నాయకురాలు’ వ్యాఖ్యపై పార్టీలో కూడా దుమారం రేపింది.
భారతీయ జనతా పార్టీ అంతర్గత వ్యవహారాలు, కార్యవర్గ నియామకం వంటి అంశాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెదవి విప్పడం ఎందుకని కొందరు వైసీపీ నాయకులే అంటున్నారు. అయితే, వీరెవ్వరికీ పెదవి విప్పే ధైర్యం లేకపోవడంతో బహిరంగంగా ఎవ్వరూ మాట్లాడడం లేదని సమాచారం.
వ్యతిరేకత తప్పదా….
ప్రతీ అంశానికి కులాన్ని అంటగడుతూండడం వల్ల ప్రజల్లో చులకన భావం పెరుగుతుందని, ఇది మరీ శృతి మించితే వ్యతిరేకత కూడా వచ్చే ప్రమాదముందని వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నాయకులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో ఉన్న ఆ కుల నాయకులు, ప్రజా ప్రతినిధుల పరిస్థితి అయితే మరింత దారుణంగా ఉందంటున్నారు. వారంతా పైకి కక్కలేక, లోపల మింగలేక నానా ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు. తమని కులం నుంచి వెలివేసే పరిస్థితులు వచ్చేలా ఉన్నాయని సన్నిహితుల వద్ద ఆ ప్రజాప్రతినిధులు వాపోతున్నట్లు సమాచారం.
అధికారంలో ఉన్న వారి కులానికి తప్ప రాష్ట్రంలో మిగిలిన ఇతర కులాల వారికి ఆ కులం వారితో మంచి సంబంధాలు ఉన్నాయని, వారి వ్యాపార, వాణిజ్య రంగాలలో పెద్ద హోదాల్లో ఇతర కులాలకు చెందిన ఉద్యోగులుగా ఉన్నారనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
ఎన్నికల వరకూ వదిలేద్దాం..
ఈ కుల వ్యవహారాన్ని రానున్న ఎన్నికల వరకూ వదిలేద్దామని, ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి వారి నుంచి మద్దతు పొందుదామని పార్టీ నాయకులు హితవు పలుకుతున్నట్లు సమాచారం. కులాన్ని నిందించడం, దాని ద్వారా లబ్దిపొందాలనుకోవడం ఎన్నికల ముందే అక్కరకు వస్తుంది తప్ప ఇప్పుడు ఇది అనవసరపు విషయంగానే ప్రజలు భావిస్తారని చెబుతున్నారు.
రాజధాని విషయంలో ప్రభుత్వానికి ఉత్తరాంధ్రలో మంచి పేరు వచ్చిందని, ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా ఈ అంశంలో వ్యతిరేకత లేదన్నది వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నాయకుల అంచనాగా ఉంది. దీనికి ఉదాహరణే తెలుగుదేశం పార్టీకి చెందిన వారి చేరికలని, ఇలాంటి అంశాలతో ప్రజలకు చేరువైతే మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చీటికీ మాటికీ కులాన్ని ప్రస్తావిస్తూ చులకన కావడం భావ్యం కాదన్న ఆలోచన పార్టీలో రూపుదిద్దుకుంటోంది. అప్రకటితంగానూ వ్యక్తమౌతున్న ఇలాంటి అభిప్రాయాలను పార్టీ పరిగణనలోకి తీసుకుంటుందో లేదో చూడాలి.