కరోనా కారణంగా ఈ ఏడాది సంక్రాంతికి పెద్ద హీరోల సినిమాలు ఏమీ లేక టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద వార్ ఒన్ సైడ్ అయిపోయింది. రవితేజ క్రాక్ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక వచ్చే ఏడాది సంక్రాంతికి మాత్రం బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా ఉండదని అర్ధమవుతోంది. ఇప్పటికే ప్రిన్స్ మహేశ్ బాబు తన తాజా చిత్రం సర్కారు వారి పాట చిత్రంతో వచ్చే సంక్రాంతి బరిలో కర్చీఫ్ వేసిన సంగతి తెలిసిందే. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ఇటీవలే దుబాయ్ లో షూటింగ్ ప్రారంభించింది.
అయితే వచ్చే సంక్రాంతి బరిలో అతడితో పోటీ పడడానికి మరో స్టార్ హీరో కూడా రెడీ అయిపోయారు. ఆయన మరెవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. క్రిష్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న ఇంకా పేరు పెట్టని చిత్రం .. ప్రస్తుతం శరవేగంతో షూటింగ్ జరుపుకుంటోంది. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఫిక్షనల్ హిస్టారిక్ మూవీ లో పవన్ .. బందిపోటు నాయకుడిగా నటించబోతున్నాడని టాక్స్ వినిపిస్తున్నాయి. అలాగే.. ఈ సినిమాకి హరిహర వీరమల్లు అనే టైటిల్ కూడా ప్రచారంలో ఉంది.
మొఘలాయిల కాలంలో జరిగే ఓ ఇంటెన్స్ స్టోరీతో ఈ మూవీ ఉండబోతోందట. అలాగే.. ఈ కథకి కోహినూర్ వజ్రంతో కూడా కనెక్షన్ ఉండనుందని సమాచారం. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తున్నట్టు మేకర్స్ .. ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. అయితే ఈ రెండు సినిమాల విడుదల తేదీ మాత్రం మెన్షన్ చేయలేదు ఏ.యం.రత్నం నిర్మాణంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. పవర్ స్టార్ 27వ సినిమా గా ఇది ప్రత్యేకతను సంతరించుకుంది. మరి మహేశ్ బాబుతో పవన్ పోరు ఎలా ఉంటుందో చూడాలి.