మన దేశ చరిత్రలో అతిపెద్ద ‘మేకిన్ ఇండియా’ ఒప్పందం కుదిరింది. రూ. 48 వేల కోట్లతో 83 తేజస్ యుద్ధ విమానాల కొనుగోలుకు రక్షణ శాఖ సిద్ధపడింది. ఇది రక్షణ రంగంలోనే అతి భారీ ఒప్పందంగా నిలవనుంది. దీనిపై రక్షణ శాఖ, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్) ప్రతినిధులు సంతకాలు చేశారు. బెంగళూరులోని యలహంక వాయుసేన కేంద్రంలో ఏరో ఇండియా 2021 ప్రదర్శన సందర్భంగా.. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది.
శత్రుదుర్భేద్యం మన తేజస్..
ఒప్పందం కుదిరిన సందర్భంగా రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తేజస్ యుద్ధ విమాన ప్రత్యేకతలను వివరించారు. ఇప్పటివరకు రక్షణ రంగంలో ఇదే అతిపెద్ద మేకిన్ ఇండియా ఒప్పందమన్నారు. ఒకటే ఇంజన్ తో నడిచే తేజస్.. గగనతలంలో ఎంతటి ప్రమాదకర పరిస్థితుల్లోనైనా శత్రువులపై బాంబుల వర్షం కురిపించగల సూపర్ సోనిక్ ఫైటర్ విమానమని తెలిపారు.
విమాన విన్యాసాలు..
కొవిడ్ వ్యాప్తి ఉన్నప్పటికీ.. ఆత్మనిర్భర్ భారత్, మేకిన్ ఇండియాలకు పెద్దపీట వేస్తూ.. ఏరో ఇండియా షో నిర్వహిస్తున్నామని, ఇందులో 80 విదేశీ కంపెనీలు, 55 దేశాలకు చెందిన రక్షణ మంత్రులు, ప్రతినిధులు, వివిధ బలగాల అధిపతులు, అధికారులు పాల్గొంటున్నారని వివరించారు. కాగా, మూడు రోజుల పాటు సాగే ఈ షోలో.. వివిధ యుద్ధ విమానాలు చేసిన విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. తేజస్, సూర్యకిరణ్ ఫైటర్లు, సుఖోయ్, రాఫెల్, హాక్, అమెరికన్ బీ1బీ లాన్సర్ భారీ బాంబర్ విమానాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
Must Read ;- ఎప్పుడు, ఎలా.. వ్యాక్సినేషన్ అందరికీ సాధ్యమా











