విద్యార్ధి దశ నుంచే నాయకత్వ లక్షణాలు అలవర్చుకున్నారు. విద్యార్థి నాయకుడినుంచి రాష్ట్ర పరిపాలనా సారధి వరకు ఎదిగారు. రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు.. దేశ రాజకీయాల్లో సైతం కొంత కాలం కీలక పాత్ర పోషించారు.. దేశ ప్రధానుల ఎంపికలో.. అలాగే రాష్ట్రపతుల ఎంపికలోనూ తన మార్క్ రాజకీయాలను ప్రదర్శించారు. ఆయనెవరో కాదు 26 ఏళ్లకే ఎమ్మెల్యేగా ఎన్నికై.. 28 ఏళ్ల చిన్న వయస్సులోనే మంత్రిగా కొనసాగి.. 46 ఏళ్లపాటు ప్రజా జీవితం కొనసాగిస్తున్నారు. ఏడు పదుల వయస్సులోనూ యువకులకు ధీటుగా కొనసాగుతున్నారు. ఆయనెవరో కాదు.. తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. నేటితరానికి ఆయన మార్గదర్శి.. సరికొత్త లక్ష్యాలతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలుగుజాతికి అందించిన దార్శనికుడు. జాతి నిర్మాణంవైపు ప్రజల్ని జాగృతం చేసిన నేత. 46 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఎన్నో అద్భుతమైన విజయాలను, మరెన్నో ఆటుపోట్లు చవిచూసినా చెక్కు చెదరని గుండె నిబ్బరం, మనోధైర్యం చంద్రబాబు సొంతం. ప్రజాజీవనంలో ఆ నాయకుడి నిర్విరామ ప్రయాణానికి నేటితో నిండా 46 ఏళ్లు నిండాయి. ఎదురు దెబ్బలు పాఠాలుగా, గాయాలు గుణపాఠాలుగా, సమస్యలు, సంక్షోభాలే సానుకూలావకాశాలుగా మార్చుకొనే అసిధారావ్రతుడు. నిరాశా నిసృహలను దరిచేరనివ్వని ఆశావాహుడు… గెలుపోటములకు స్థితప్రజ్ఞడు.. నిర్విరామయోధుడు, అలుపెరుగని ధీరుడు.
విద్యార్ధి దశనుండే నాయకత్వ లక్షణాలు పుణికి పుచ్చుకొన్న చంద్రబాబు.. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుంచి గెలుపొంది.. 1978 మార్చి 15న శాసన సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబు నాయుడు చట్టసభలోకి అడుగుపెట్టి నేటికి 46 ఏళ్లు పూర్తయింది. చంద్రబాబు రాజకీయ జీవితం వడ్డించిన విస్తరి కాదు. రాజకీయాల్లోకి వారసత్వంగా వచ్చిన వాడు అంతకంటే కాదు. సాధారణ వ్యక్తిగా వచ్చి మహోన్నత శక్తిగా ఎదిగిన చరిత్ర ఆయనది. కాంగ్రెస్ ఆదేశం మేరకు చంద్రగిరి నుండి పోటీ చేసి ప్రజల్లో గుర్తింపు పొందిన జనతా పార్టీ అభ్యర్ధి పట్టాభిరామచౌదరిని ఓడించి ఎమ్మెల్యే అయ్యారు. యువ నాయకుడిగా శాసనసభలో ప్రవేశించడమే గాకుండా.. 28 ఏళ్ల వయస్సులోనే అంజయ్య కేబినెట్లో 1980 అక్టోబర్ 11న గ్రంథాలయాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా తరువాత 1982 ఫిబ్రవరి 24న భవనం వెంకట్రామ్ కేబినెట్లో చిన్న నీటి పారుదల శాఖామంత్రిగా కొనసాగారు. 1982 సెప్టెంబర్ 20న కోట్ల విజయభాస్కర్రెడ్డి కేబినెట్లోనూ సాంకేతిక విద్యా శాఖామంత్రిగా పని చేశారు. ఆ తర్వాత 1983లో జరిగిన సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనుండి పోటీ చేసి అప్పటి తెలుగుదేశం ప్రభంజనంలో ఓటమి పాలయ్యారు. 1983లో ఎన్టీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత.. సహచరుల వత్తిడి మేరకు, ప్రజలకు మరింత సేవచేసే యోచనతో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇప్పటి వరకు పార్టీలోనే కొనసాగుతూ గత 30 ఏళ్లుగా పార్టీని నడిపిస్తున్న ధీరోదాత్తుడు చంద్రబాబు నాయుడు.
ఏడు పదులు దాటిన వయస్సులో.. 46 ఏళ్ల ప్రజాజీవితం ఆయనది. మూడు దఫాలు మంత్రిగా ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగి.. మరో పదేళ్లు ప్రతిపక్షనేతగా ఉన్నారు. 2014లో జరిగిన ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం ఏర్పడిన నవ్యాంధ్రకు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి.. ప్రస్తుతం ఐదేళ్లుగా ప్రతిపక్ష నాయకుడుగా కొనసాగుతున్నారు. ఇంత సుదీర్ఘకాలం ప్రజా నాయకుడిగా ఆయనతో పోల్చ దగ్గ నాయకుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరు లేరు. కఠోర శ్రమ, క్రమశిక్షణ, విలువలతో కూడిన నియమబద్ధమైన జీవనశైలి ఆయనది. భావితరాల శ్రేయస్సు కోసం, నిరంతర ఆలోచనలతో, విన్నూత్న ప్రణాళికలు రూపొందించడంలో ఆయనకు ఆయనే సాటి. తన దార్శనికతతో తెలుగుజాతి భవితను తీర్చిదిద్దడమే కాకుండా సరికొత్త విధానాలతో నవ్య చరిత్రకు నాంది పలికి దేశ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందారు. చంద్రబాబు నాయుడు విద్యార్ధి నాయకుడి నుంచి రాష్ట్ర పరిపాలనా సారధి వరకు.. దేశ, రాష్ట్ర రాజకీయాలలో కీలక పాత్ర పోషించాలనుకొనే వారికి ఆయన ఒక పాఠ్యపుస్తకమని చెప్పాలి. కఠోర శ్రమ, అకుంటిత దీక్షకు చెరగని చిరునామా ఆయన. గాంధీజీ ఆశయాలను ఆలంబనగా చేసుకొని ప్రజల్లో నుంచి పుట్టుకొచ్చిన నాయకుడు. టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు తెలుగువారి ఆత్మగౌరవ చిహ్నమైతే.. చంద్రబాబు నాయుడు తెలుగువారి ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచారు.
46 ఏళ్లుగా తన జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేసిన ప్రజా నాయకుడు. అన్ని రాజకీయ పక్షాల వైఖరికి భిన్నంగా పరిపాలన చేసి.. తన విజన్తో అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్గా మారారు. ఏడు పదులు దాటిన వయస్సులోనూ నవ యువకులు కన్నా అధికంగా పని చెయ్యడం చంద్రబాబు ప్రత్యేకత. అతి చిన్న వయసులోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన కొద్దిమందిలో చంద్రబాబు ఒకరు. 1995 సెప్టెంబర్ 1న ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రాభివృద్ధే ప్రధాన లక్ష్యంగా.. అనతి కాలంలోనే ఘన విజయాలను సాధించారు. జన్మభూమి, శ్రమదానం, ప్రజలవద్దకు పాలన తదితర కార్యక్రమాలతో నిరంతరం ప్రజల్లోనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ని పాలించిన ముఖ్యమంత్రులలో చంద్రబాబుది ప్రత్యేకమైన స్థానం. రాజకీయమంటే అధికారం కోసం ప్రాకులాడటం కాదని.. రాజకీయమంటే ప్రజలకు సేవ చేసే అవకాశం పొందటమని విశ్వసించే వ్యక్తి చంద్రబాబు.
జాతీయ రాజకీయాలను కూడా చంద్రబాబు ప్రభావితం చేశారు. యునైటెడ్ ప్రంట్ ఏర్పాటు, ఆ తర్వాత ఎన్డీఏ ఏర్పాటుకు అంకురార్పణ చేసినవారిలో చంద్రబాబుది కీలక పాత్ర ఉంది. ఒకానొక దశలో ఆయన్ని ప్రధాని కావాలని పార్టీలన్నీ కోరినా.. తాను రాష్ట్రానికే అంకితమని స్పష్టం చేసిన ప్రజా నాయకుడు. దేశ ప్రధానుల నియామకంలో రెండుసార్లు ముఖ్యపాత్ర వహించారు. రాష్ట్రపతులుగా కెఆర్ నారాయణయన్, అబ్దుల్ కలాంను ప్రతిపాదించటంలో ముఖ్య భూమిక పోషించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్దికి చేపట్టిన వినూత్న కార్యక్రమాలు యావత్ భారతదేశాన్నేకాక, ప్రపంచ ఆర్థిక నిపుణులనూ ఆకర్షించాయి.
జంట నగరాలకుతోడు సైబరాబాద్ అనే నగరాన్ని సృష్టించి ఆంధ్రుల రాజధానికి ప్రపంచపటంలో గుర్తింపు తెచ్చారు. విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు వల్ల ఎంతోమంది యువతీ యువకులు విదేశాల్లో స్థిరపడి ఉన్నత స్థానాల్లో నిలబడేలా చేసింది. హైదరాబాద్లో బిజినెస్ స్కూలు, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏర్పాటు.. రోడ్ల విస్తరణవంటి కార్యక్రమాలతో రాష్ట్రాభివృద్ధిని పరుగులు పెట్టించారు. 2019 ఎన్నికల్లో ఓటమి చెంది ప్రతిపక్ష స్థానంలోకి వచ్చినప్పటికీ పట్టువదలని విక్రమార్కుడిలా గడిచిన ఐదేళ్లుగా ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజావ్యతిరేక విధానాలపై ఏడు పదులు దాటిన వయస్సులోనూ ప్రజల పక్షాన అలుపెరుగని పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిస్తూ.. ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు తన వయసును, ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా నిత్యం ప్రజల కోసం రాజీలేని పోరాటం చేస్తున్నారు. అందుకే 46 ఏళ్ల క్రితం ఎమ్మెల్యేగా ప్రమాణం చేసి చట్టసభలోకి అడుగుపెట్టి జాతికోసం, ప్రగతి కోసం నిరంతరం శ్రమిస్తున్న ప్రజా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న రాజకీయ నాయకుల్లో 1978 నుంచి రాజకీయాల్లో ఉన్న నాయకులు నిరంతరాయంగా కొనసాగుతున్న వారు ఎవరు లేరు. తనతోపాటు మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్రెడ్డి కూడా ఒకేసారి రాజకీయాల్లో వచ్చారు. కానీ ప్రస్తుతం వైఎస్ఆర్ లేరు.











