ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ సినిమా ఈరోజు విడుదలైంది. ఓంరౌత్ దర్శకత్వంలో ఈ సినిమాలో ప్రభాస్ రాఘవుడిగానూ, కృతిసనన్ సీతగానూ నటించారు. ఎంతో కాలంగా ఎదురుచూసిన ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే విషయాలను చూద్దాం. టీ సిరీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి.
కథలోకి వెళితే..
ఇది మనందరికీ తెలిసిన కథే. త్రేతాయుగంలో శ్రీరాముడి జీవితంలో జరిగిన ముఖ్య ఘట్టాల ఆధారంగా దీన్ని తెరకెక్కించారు. వాల్మీకి రామయణంలోని అరణ్యకాండ, కిష్కింద కాండ, యుద్ధకాండలోని అంశాలతో దర్శకుడు ఓంరౌత్ దీన్ని తెరకెక్కించారు. శ్రీరాముడి వనవాసం, సీతాదేవిని రావణుడు అపహరించడం, వానర సైన్యం సాయంతో లంకపై రాముడు దండెత్తడం లాంటి అంశాలే ఇందులో ఉంటాయి. అధర్మంపై ధర్మం ఎలా గెలిచి తీరుతుందో చూపించే ప్రయత్నం జరిగింది. అయితే మనకు తెలిసిన రామాయణం సినిమాలతో దీన్ని పోల్చి చూడటం కాకుండా ఈ సినిమాని చూస్తే సినిమాని ఆస్వాదించవచ్చు. నాటి రాముడు, రావణాసురుడి పాత్రలతో పోల్చుకుని సినిమా చూస్తే నిరాశే ఎదురవుతుంది. పూర్తి రామాయణం జోలికి పోకుండా శ్రీరాముడి వనవాసం, రావణుడి అంతంతో సినిమా ముగుస్తుంది.
ఎలా తీశారు? ఎలా చేశారు?
రాఘవుడిగా ప్రభాస్ పాత్రలో ఇమిడిపోయారు. రావణాసురుడిగా సయీఫ్ మెప్పించే ప్రయత్నం చేశారు. భజరంగ్ పాత్రను దేవ్ దత్తా పోషించినా ఆ పాత్రపై ప్రేక్షకులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ స్థాయిలో ఆ పాత్ర లేదు. జానకిగా కృతిసనన్ బాగున్నా నటనకు అవకాశం లేని విధంగా పాత్ర ఉంది. ప్రధానంగా ఎమోషన్స్ పండకపోవడం మైనస్ అని చెప్పాలి. మోషన్ క్యాప్చర్ విధానంలో సినిమా రూపొందడం వల్ల అసహజత్వంతో సినిమా ఉంటుంది. సీతాదేవి అపహరణ, శూర్పణక ముక్కు, చెవులు కోయడం, రామసేతు నిర్మాణం లాంటి అంశాలు చాలా కృతకంగా ఉన్నాయి. దశకంఠుడిగా రావణుడిలోని భక్తి కోణాన్ని కూడా దర్శకుడు సరిగా ఆవిష్కరించలేకపోయాడు. కార్టూన్ సినిమాలాగా ఉంటుందేమోనని జనం అనుకున్నారుగానీ అలా లేకుండా దర్శకుడు జాగ్రత్త పడ్డాడు. అది కొంతలో కొంత ఊరట.సన్నివేశాలను ఎస్టాబ్లిష్ చేయడంలో దర్శకుడు తడబడ్డాడు.
సినిమా చూస్తుంటే మన పురాణ కథలాగా అనిపించదు. వీఎఫ్ ఎక్స్ వల్ల హాలీవుడ్ సినిమా చూసిన భావన కలుగుతుంది. ఆంజనేయుడి పాత్ర కూడా మనం చూసిన ఆంజనేయుడిలా ఉండదు. ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్, స్టార్ వార్స్ లోని సన్నివేశాలలాగా కొన్ని కనిపిస్తాయి. ముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్ అలానే ఉంటుంది. ఆంజనేయుడు చేసిన లంకా దహనం సన్నివేశాలు కూడా చాలా పేలవంగా ఉన్నాయి. బీజీఎం ఒక్కటే ఈ సినిమాకు ప్రాణం పోసింది. సినిమా చూస్తుంటే భక్తి భావన కనిపించదు. రాముడు దేవుడనే భావన కూడా కలగదు. శ్రీరాముడిని ఓ మానవుడిలానే ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. రాముడు ఎలా ఆదర్శప్రాయుడయ్యాడు అనేది చక్కగా చూపించగలిగితే ఓంరౌత్ అనుకున్న లక్ష్యం నెరవేరేది.
ఈతరం ప్రేక్షకులకు నచ్చేలా మెచ్చేలా తీయడంలో దర్శకుడు విఫలమయ్యాడనే చెప్పాలి. వాలి, సుగ్రీవుల ఫైట్, కుంభకర్ణుడు, ఇంద్రజిత్తులతో పోరాట సన్నివేశాలు చాలా పేలవంగా ఉన్నాయి. ఆంజనేయుడి పాత్రను కూడా చక్కగా మలచలేకపోయారు. విజువల్ ఎఫక్ట్స్ చాలా పేలవంగా ఉన్నాయి. జానకిని అపరించే సందర్భంగా జటాయువు పోరాటం కూడా పేలవంగా ఉంది. మన సీతారామ కల్యాణం, లవకుశ, సంపూర్ణ రామాయణం లాంటి సినిమాలతో పోల్చి చూస్తే ఈ సినిమా నథింగ్. పాటలు, నేపథ్య సంగీతం ఈ సినిమాని కొంతవరకు నిలబెట్టగలిగాయి. సంభాషణలు పేలవంగా ఉన్నాయి.
నటీనటులు : ప్రభాస్, కృతి సనన్, సయీఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్, దేవ్ దత్త, సోనాల్ చౌహన్ తదితరులు
మాటలు : భీమ్ శ్రీనివాస్ (తెలుగులో)
పాటలు : రామజోగయ్య శాస్త్రి
కెమెరా : కార్తీక్ పళని
నేపథ్య సంగీతం : సంచిత్ – అంకిత్
స్వరాలు : అజయ్ – అతుల్, సచేత్ – పరంపర
నిర్మాతలు : భూషణ్ కుమార్, కృష్ణకుమార్, ఓం రౌత్, వంశీ, ప్రమోద్, రాజేష్ నాయర్, ప్రసాద్ సుతార్
విడుదల : పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ
దర్శకత్వం : ఓం రౌత్
విడుదల తేదీ: జూన్ 16, 2023
ఒక్క మాటలో: నేల విడిచి చేసిన సాము
రేటింగ్: 2.5/5