కరోనా కారణంగా దేశంలో లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీని వలన టాలివుడ్ లో అనేక పెద్ద సినిమాల షూటింగ్లు మధ్యలోనే ఆగిపోయాయి. అదే కోవకు చెందిన సినిమా ‘వైల్డ్ డాగ్’. మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నూతన దర్శకుడు సోల్మన్ దర్శకత్వంలో కింగ్ నాగార్జున అక్కినేని హీరోగా యాక్షన్ థ్రిల్లర్ గా ‘వైల్డ్ డాగ్’ మూవీ రూపొందుతోంది. ఈ సినిమాలో నాగ్ ఎన్ఐఏ ఆఫీసర్ గా ఒక పవర్ ఫుల్ రోల్ లో కనపడబోతున్నారు.
సుమారు 7నెలలు తర్వాత ఈ సినిమా తిరిగి షూటింగ్ మొదలుపెట్టింది. తాజాగా చిత్ర బృందం ఈ సినిమా షూటింగ్ కోసం హిమాలయాలకు పయనమయ్యారు. 20రోజులపాటు జరిగే షూటింగ్ షెడ్యూల్ లో యాక్షన్ సీన్స్, నాగార్జునపై కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తారని చిత్ర బృందం తెలిపింది. ఇప్పటికే 70శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ‘వైల్డ్ డాగ్’, ఈ షెడ్యూల్ తో దాదాపు షూటింగ్ పూర్తయిపోయినట్టేనని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ మూవీలో నాగార్జునతో పాటు దియా మీర్జా, సయామీ ఖేర్, అతుల్ కులకర్ణి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.
ఈ సినిమా తర్వాత నాగ్ ‘సోగ్గాడే చిన్ని నాయినా’ సీక్వెల్ లో నటిస్తారు. ‘వైల్డ్ డాగ్’ సినిమాపై కింగ్ అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈమధ్య నాగార్జునకు సరైన హిట్ తగల్లేదు. రీసెంట్ గా వచ్చిన ‘మన్మధుడు – 2’ సినిమా కింగ్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. అంతకుముందు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘ఆఫీసర్’ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా బోల్తా కొట్టడంతో ‘వైల్డ్ డాగ్’ పైనే వారి ఆశలు పెట్టుకున్నారు. కాని ఈసారి నాగ్ పక్కా హిట్ కొడతారని ‘వైల్డ్ డాగ్’ చిత్ర బృందం ధీమా వ్యక్తం చేసింది. ‘వైల్డ్ డాగ్’ సినిమా ద్వారా నాగ్, తన అభిమానులను ఎంతవరకు మెప్పిస్తాడో చూడాలి మరి.
#WildDog in the Himalayas!! pic.twitter.com/k1gf1fNb7E
— Nagarjuna Akkineni (@iamnagarjuna) October 23, 2020











