త్వరలో ఉప ఎన్నిక జరగనున్న తిరుపతి లోక్సభ స్థానంపై నిన్నటి దాకా ఒక్కో పార్టీది ఒక్కో ఎత్తు. అయితే ఇప్పుడు స్థానిక సమరం జరుగుతున్న నేపథ్యంలో అన్ని పార్టీలూ ఒకే మంత్రాన్ని పఠిస్తున్నాయి. అదేంటంటే… స్థానిక సమరంలో సత్తా చాటగలిగితే.. లోక్సభ సీటు తమ ఖాతాలో పడినట్టేనన్నదే. ఇటు అధికార పార్టీ వైసీపీతో పాటు అటు విపక్ష టీడీపీ, బీజేపీ-జనసేన కూటమి కూడా ఇదే వైఖరితో ముందుకు సాగుతున్నాయి. వెరసి రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లో పంచాయతీ ఎన్నికలు ఎలా జరుగుతున్నా… తిరుపతి లోక్సభ పరిధిలోని పంచాయతీలను ఒడిసి పట్టేందుకు అన్ని పార్టీలు తమదైన వ్యూహాలను అమలు చేస్తున్నాయి.
అందరి కంటే ముందే టీడీపీ
మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో మిగిలిన జిల్లాల మాదిరిగానే చిత్తూరు జిల్లాలో కూడా మెజారిటీ సీట్లు వైసీపీ ఖాతాలోనే పడ్డాయి. తిరుపతి లోక్సభ బరిలో వైసీపీ అభ్యర్థిగా నిలిచిన బల్లి దుర్గాప్రసాదరావు విజయం సాధించగా… ఇటీవలే అనారోగ్య కారణాలతో ఆయన మరణించారు. దీంతో తిరుపతి పార్లమెంటుకు ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. జగన్ పాలన ప్రారంభమై రెండేళ్లు కావస్తున్న నేపథ్యంలో వైసీపీ పాలనపై పెరుగుతున్న వ్యతిరేకతను క్యాష్ చేసుకుని తిరుపతి పార్లమెంటును ఎగురవేసుకుని వెళ్లేందుకు టీడీపీ అందరి కంటే ముందే సమాయత్తమైంది. బరిలో నిలిచే అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి పేరును ఖరారు చేసిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు… పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రత్యేక కమిటీలను వేసి ఇప్పటికే రంగంలోకి దిగిపోయారు. అదే సమయంలో జనంలో తమ పాలనపై పెరుగుతున్న వ్యతిరేకత నేపథ్యంలో ఇతర పార్టీలన్నీ అభ్యర్థులను ప్రకటించాకే.. ఆచితూచీ అభ్యర్థిని ఖరారు చేసే యోచనలో వైసీపీ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక బీజేపీ-జనసేనల మధ్య అభ్యర్ధి ఎవరన్న విషయం ఇంకా తేలలేదు. ఇరు పార్టీలు తమ అభ్యర్థులనే నిలపాలన్న రీతిలో వ్యూహాలు రచిస్తున్నాయి.
అన్ని పంచాయతీలపై దృష్టి
ఇలాంటి సమయంలో ఉరుము లేని పిడుగు మాదిరిగా పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్కుమార్ పంచాయతీ ఎన్నికలకు తెర లేపారు. దీంతో ఇష్టం లేకపోయినా వైసీపీ పంచాయతీ ఎన్నికలకు సిద్దం కాక తప్పలేదు. అంతే కాకుండా పంచాయతీ ఎన్నికల్లో వీలయినన్ని ఏకగ్రీవాలు చేసుకోవాలన్న వ్యూహంతో ఆ పార్టీ ముందుకు సాగుతోంది. ఇదే అదనుగా టీడీపీ, బీజేపీ-జనసేనలు కూడా పల్లెలపై పట్టు సాధిస్తే… తిరుపతి ఉప ఎన్నికను ఈజీగానే కొట్టేయొచ్చన్న భావనకు వచ్చేశాయి. అనుకున్నదే తడవుగా అన్ని పార్టీలు కూడా ఇప్పుడు తిరుపతి పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించాయనే చెప్పాలి. ఎక్కడికక్కడ తమ భుజ బలాన్ని వినియోగించి ప్రత్యర్థుల నుంచి నామినేషన్లు పడకుండా… వైసీపీ వ్యూహాలు అమలు చేస్తుంటే… ఆ భుజ బలాన్ని ఎలాగైనా అడ్డుకుని తీరాల్సిందేనని, తిరుపతి పార్లమెంటు పరిధిలోని అన్ని గ్రామాల్లో తమ పార్టీ అభ్యర్థులను రంగంలోకి దించాల్సిందేనని టీడీపీ ప్రతి వ్యూహాలు రచిస్తోంది. ఈ రెండు పార్టీల మాదిరే జనసేన కూడా పంచాయతీ పోరులో… ఇతర ప్రాంతాల మాటెలా ఉన్న తిరుపతి పరిధిలోని పంచాయతీపై మరింతగా దృష్టి సారించింది. అందులో భాగంగానే ఇటీవల తన పార్టీ పీఏసీ సమావేశాన్ని తిరుపతిలో నిర్వహించిన జనసేనాని పవన్ కల్యాణ్ క్షేత్రస్థాయిలోని తన కేడర్కు తన వ్యూహమేమిటన్న విషయాన్ని వివరించి మరీ చెప్పారు. బీజేపీ కూడా ఇప్పుడు అదే పనిలో ఉంది.
అన్ని పార్టీలదీ ఒకే మంత్రం
మొత్తంగా తిరుపతి పార్లమెంటు పరిధిలోని పంచాయతీ పోరుపై అన్ని పార్టీలదీ ఒకే మంత్రమని చెప్పక తప్పదు. తిరుపతి పార్లమెంటు పరిధిలోని పంచాయతీలపై పట్టు సాధిస్తే… ఆ వెంటనే జరిగే లోక్సభ ఉప ఎన్నికల బరిలో ఆయా పార్టీలకు గెలుపు అవకాశాలు మెరుగైనట్టే కదా. పట్టణాల్లో పరిస్థితి ఎలా ఉన్నా గ్రామాల్లో మాత్రం పంచాయతీ ఎన్నికల వేడి తగ్గక ముందే జరిగే పార్లమెంటు ఉప ఎన్నికలో ఆయా గ్రామాల్లో గెలుపు గుర్రాల వైపే జనం కదలడం ఖాయమేనని చెప్పాలి. ఇదే భావనతో నాలుగు పార్టీలు కూడా తమదైన శైలి ప్రత్యేక వ్యూహాలను అమలు చేస్తున్నాయి. మరి పంచాయతీ బరిలో ఏ పార్టీకి మైలేజీ లభిస్తుందో, లోక్సభ ఉప ఎన్నికలో ఆ మైలేజీతో ఆయా పార్టీలు ఏ మేర సత్తా చాటుతాయో చూడాలి.