ప్రజలు ప్రశాంతంగా ఉంటే మనకి విలువ ఉండదు. కులాల మధ్య చిచ్చు పెట్టాలి..మతాల మధ్య విధ్వేషాలు రెచ్చొగొట్టాలి. వాటికి బాధ్యులు, కర్త, కర్మ, క్రియ అన్నీ..ప్రత్యర్థి పార్టీలేనని ముద్ర వేయాలి. మనం తీరిగ్గా ఓదార్చాలి.
- 1990ల్లో వచ్చిన సినిమాల్లో ఇలాంటి సీన్లు చాలానే ఉంటాయి. అవే పద్ధతులను అనుసరిస్తూ.. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) ఏపీలో మరోసారి ఎంటరయ్యారని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది.
ఏపీలో గతంలో ఎన్నడూ లేని రీతిలో ఆలయాలపై దాడులు జరుగుతున్నాయి. మత మార్పిడులపై వివాదాలు, ఆరోపణలు తలెత్తుతున్నాయి. ఇక పంచాయతీ ఎన్నికల్లో కులాల వారీగా విభజన జరుగుతోంది. వీటి విషయంలో విష ప్రచారం చేసేందుకు కొందుకు సోషల్ మీడియాను వాడుకోవడం కూడా జరుగుతోంది. ప్రతిపక్ష పార్టీల పేరెత్తేందుకే సగటు మనిషి భయపడాల్సిన పరిస్థితులు కొన్ని చోట్ల కనిపిస్తున్నాయి. వీటన్నింటి వెనుక ఓ వ్యూహం ఉందని రాజకీయ పక్షాల్లో చర్చ జరుగుతోంది.
వైసీపీకి క్షేత్రస్థాయిలో ఆదరణ తగ్గిందనే..
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 21 నెలలు అవుతోంది. ఈ 21 నెలల్లో సంక్షేమ పథకాల రూపేణా లక్షల కోట్ల అప్పు చేయడంతోపాటు న్యాయస్థానాల్లో ఎదురు దెబ్బలు, పన్నుల విధింపు, వైసీపీకి చెందిన కొందరు నాయకుల వ్యవహార శైలి..ఇలా పలు అంశాల కారణంగా వైసీపీకి క్షేత్రస్థాయిలో ఆదరణ తగ్గిందనే అంచనాలున్నాయి. ఇదే విధానం మరికొంత కాలం కొనసాగితే సరిదిద్దుకునే అవకాశం కూడా ఉండదని, పార్టీకి తీరని నష్టం వస్తుందని గ్రహించిన వైసీపీ పెద్దలు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ను ఇటీవల పిలిపించినట్లు ప్రచారం జరుగుతోంది. 2019 ఎన్నికల్లో సామాజిక వర్గాల వారిగా వ్యాఖ్య, దుష్ప్రచారం చేసి.. ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి వైసీపీని అధికారంలోకి తేవడంలో సక్సెస్ అయిన సూత్రాన్నే ప్రశాంత్ కిషోర్.. మళ్లీ వైసీపీకి సూచించినట్టు తెలుస్తోంది. ఇటీవలి వరకు వైసీపీకి చెందిన వారిని పేటీఎం బ్యాచ్గా కొందరు నాయకులు కామెంట్లు చేస్తున్న నేపథ్యంలో అలా బయటకు తెలియకుండా ప్రచారం చేయాలని సూచించినట్లు రాజకీయవర్గాలు చెబుతున్నాయి. అందుకు గాను తమ సహకారం ఉంటుందని, ఆ ప్లాన్ ఎలా ఉంటుందనే విషయంపైనా పీకే సదరు పార్టీ ముఖ్య నేతలతో మాట్లాడారని, రూ.200 కోట్ల ప్యాకేజీకి డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. ఆ సమాచారం ప్రకారం.. ప్రతి గ్రామస్థాయి నుంచి మొదలు జిల్లా స్థాయి వరకు సోషల్ మీడియాలో ఎవరెవరు ఎలా యాక్టీవ్గా ఉండాలనే మార్గదర్శకాలు అందాయి. ఇక స్థానికంగా జరుగుతున్న భావోద్వేగాలకు సంబంధించిన ఘటనల విషయంలో ప్రతి పక్షాలను టార్గెట్ చేసే విధంగా పోస్టులు ఉండాలని సూచించినట్టు తెలుస్తోంది.
మీడియా అదనం..
ఇదే అంశంపై పీకే మరో సలహా కూడా ఇచ్చారట. మరో విడతగా భారీ మొత్తంలో తనకు అనుకూలంగా ఉండే మీడియాతో ప్యాకేజీలు మాట్లాడుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అందులో భాగంగానే నచ్చని ఛానెళ్లను ప్రజలకు అందుబాటులో లేకుండా చేయడం, అనుకూలంగా ఉండే ఛానెళ్లలో అనుకూల ప్రచారంతో పాటు ప్రతి పక్షాలను టార్గెట్ చేయడం కూడా వ్యూహంలో భాగంగానే కనిపిస్తోంది. జాతీయ స్థాయిలో ఇప్పటికే ఓ గ్రూపు ఛానెల్ కు రూ.100 కోట్లతో డీల్ కుదిరిందని, అందులో భాగంగా రూ.10 కోట్లు అధికారికంగా విడుదలయ్యాయని చెబుతున్నారు. ఆలయాలపై దాడుల్లో ప్రతి పక్షాలపైనే నిందలు వేసేలా పోస్టులు ఉండడం కూడా అందులో భాగమని చెబుతున్నారు.
Must Read ;- ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ.. అమిత్ షాకు టీడీపీ ఎంపీల ఫిర్యాదు

ట్రోల్లకే పరిమితం కావడంతో..
ఇటీవలి వరకు వైసీపీకి చెందిన కొందరు సోషల్ మీడియా కార్యకర్తలు ప్రతి పక్షాలను ముఖ్యంగా టీడీపీని, ఓ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసుకుని ట్రోల్స్ చేశారు. తొలినాళ్లలో కొంత ఆదరణ కనిపించినా.. అప్పట్లో ఉన్న ఆదరణ, షేరింగ్లతో పోల్చితే ఇప్పుడు మూడోవంతు కూడా లేకపోవడంతో పీకే టీం పూర్తిస్థాయి పరిశీలన చేసిందని, అందులో భాగంగానే కీలకమైన పేజీలను నిర్వహించే బాధ్యత (బ్యాక్ ఎండ్)ను పీకే టీం తీసుకుందని చెబుతున్నారు. ఇక ఇటీవల కొందరు నాయకుల ఫేస్ బుక్ పేజీలు స్పాన్సర్ అని కనిపిస్తున్నాయి. పీకే సూచన ప్రకారమే పెయిడ్ ప్రమోషన్ చేయిస్తున్నారని చెబుతున్నారు. రానున్న కాలంలో అధికార పార్టీ నాయకులకు ఫాలోవర్లు పెంచుకునే అంశంపై పార్టీ టార్గెట్ విధించే అవకాశం కనిపిస్తోంది. రాయలసీమలో కెమెరా ఆన్ చేసుకున్నాకే..ప్రజల్లోకి వెళ్తూ ప్రజల వ్యక్తిగా పేరు తెచ్చుకుంటున్న ఎమ్మెల్యే ఎంచుకున్న మార్గం కూడా మంచిదేనని పీకే టీం చెప్పిందని టాక్. ఇక ఆలయాలపై దాడులు, నాయకుల విగ్రహాల ధ్వంసం లాంటివి కూడా ప్రతి పక్షాల ఖాతాలో వేయాలని, అలా పోస్టు చేశాక ఆ పోస్టులకు పెయిడ్ ప్రమోషన్ చేయాలని సూచించినట్టు తెలుస్తోంది. మొత్తం మీద పీకే వ్యూహాలు ఎలా ఉన్నా…ఏపీలో కుల, మత వైషమ్యాలకు బాధితులుగా మారేది ప్రజలేనన్న చర్చ నడుస్తోంది.
సజ్జల వ్యాఖ్యలపైనా చర్చ..
ఇక ప్రభుత్వ సలహాదారు, వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఏపీలో రంగా, అంబేద్కర్ విగ్రహాలపై దాడులు చేయడానికి ప్రతిపక్ష టీడీపీ కుట్ర చేసిందన్న సమాచారం తమవద్ద ఉందని వ్యాఖ్యానించడం పలు అనుమానాలు తావిస్తోంది. ఇంటెలిజెన్స్ నివేదికలూ ఉన్నాయని చెప్పడం, ఇక సజ్జల మాట్లాడగానే వైసీపీ నేతలు అదే బాణీని కొనసాగించడం చర్చకు కారణం అయింది. దీనిపై టీడీపీ కూడా కౌంటర్ ఇచ్చింది. ఆ విగ్రహాలు వైసీపీనే ధ్వంసం చేయించి.. ఆ నెపం టీడీపీపై వేయాలని చూస్తోందని టీడీపీ నేత బొండ ఉమ వ్యాఖ్యానించారు.
వీరి వ్యాఖ్యల విషయం ఎలా ఉన్నా.. ప్రభుత్వానికి అంత పక్కా సమాచారం ఉన్నప్పుడు, కచ్చితమైన, నిజమైన ఆధారాలు ఉన్నప్పుడు బాధ్యులపై చర్యలు తీసుకునే అధికారం కూడా ఉంటుంది. విగ్రహాల రాజకీయం, నేరాలు, దోపిడీలు, దొమ్మీలు, దౌర్జన్యాలు, వివక్షలు, మతసామరస్యం దెబ్బతీసే కుట్రలు.. ఇలాంటివి జరగకుండా ఎప్పటికప్పుడు వ్యవస్థల ద్వారా నియంత్రించాల్సిన ప్రాథమిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. అసలు ప్రభుత్వాలను ప్రజలు ఎన్నుకోవడంలో ప్రాథమిక సిద్ధాంతమే ప్రజల మాన ప్రాణాల రక్షణ. ప్రజల, సామాజిక ఆస్తుల పరిరక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ, సంఘ విద్రోహుల కుట్రలను అడ్డుకోవడం ..ఇవి ప్రభుత్వ కనీస బాధ్యతలు. జీవించే హక్కు నుంచి రాజ్యాంగం ప్రసాదించిన మౌలిక అంశాలు. సంక్షేమ పథకాల కంటే ముఖ్యమైన పాలనాపరమైన అంశాలు కూడా. అది వదిలేసి టీడీపీపై నెపడం నెట్టడం ఏంటనే ప్రశ్న చాలా మందిలో తలెత్తుతోంది.
Also Read ;- ఒక్కటైన పీఠాధిపతులు!










