ఖమ్మం పాత బస్టాండ్ తరలింపుపై అఖిల పక్షం ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీల నిరసన ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు, నిరసనకారుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.
పాత బస్టాండ్ తరలిస్తే ప్రత్యక్ష ఆందోళన
ఖమ్మం పాత బస్టాండ్ తరలింపు ప్రక్రియను నిలిపివేయాలంటూ అఖిల పక్షం పిలుపునిచ్చింది. ఈ క్రమంలో బస్టాండ్ వద్దకు చేరుకున్న నిరసనకారులు బస్సుల రాకపోకలను అడ్డుకున్నారు. అనంతరం అక్కడే ధర్నాకు దిగారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను అడ్డుకుని స్టేషన్కు తరలించారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ఆయా పక్షాల నాయకులు మాట్లాడుతూ.. పాత బస్టాండ్ను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రత్యక్ష ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
ప్రజా బ్యాలెట్కు భారీ స్పందన..
పాత బస్టాండ్ను లోకల్ బస్టాండ్గా కొనసాగించాలనే డిమాండ్కు మద్దతుగా 99 శాతం ప్రజలు మద్దతు పలికారు. సీపీఎం, కాంగ్రెస్, న్యూడెమోక్రసీ వివిధ పార్టీల ఆధ్వర్యంలో ప్రజా బ్యాలెట్ నిర్వహించారు. ఇటీవల వివిధ పార్టీలకు చెందిన నేతలు ప్రజల అభిప్రాయాలను సేకరించారు. ఈ ప్రజా బ్యాలెట్లో 2,773 ఓట్లు పోల్ కాగా అందులో పాత బస్టాండ్ను లోకల్ బస్టాండ్గా కొనసాగించాలని 2726 మంది ఓటర్లు మద్దతు పలికారు. 46 మంది ప్రజా బ్యాలెట్ను వ్యతిరేకించారు. పాత బస్టాండ్ను లోకల్ బస్టాండ్గా ప్రకటించే వరకు ఉద్యమాలను ఉధృతం చేస్తామని అఖిలపక్షం నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.
Must Read ;- మారని టీ కాంగ్రెస్ తీరు.. ఆపరేషన్ ఆకర్ష్కు బీజేపీ పదును