ఏడాది కాలంగా ఒక లక్ష్యం కోసం, ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతికోసం పోరాడుతున్న రైతులు నిర్వహించిన జనభేరి అనూహ్యమైన స్థాయిలో విజయవంతం అయింది. రాజధాని పోరాట సమితి వారు.. ఈ భారీ బహిరంగసభకు వైఎస్సార్ కాంగ్రెస్ మినహా అన్ని పార్టీలను ఆహ్వానించారు. అందరూ హాజరయ్యారు.. అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉండాలనే డిమాండ్కు అందరూ సమష్టిగా తమ సంఘీభావం తెలిపారు. ఒక్క సీపీఎం మాత్రం ఇందులో పాల్గొనలేదు. ఎందుకలా జరిగింది.
సీపీఎం అమరావతికి వ్యతిరేకమా?
సీపీఎం అమరావతి రాజధానికి వ్యతిరేకం అని ఏకపక్షంగా అనడానికి వీల్లేదు. గతంలో వారు అమరావతికి మద్దతుగానే వ్యవహరించారు. సీపీఎం నాయకుడు మధు పలుమార్లు అమరావతి రైతుల పోరాట శిబిరాలను కూడా సందర్శించారు. అమరావతినుంచి రాజధానికి తరలించడాన్ని వ్యతిరేకిస్తూ గతంలో సీపీఎం కార్యదర్శి మధు కోర్టులో అఫిడవిట్ కూడా వేశారు. తరలింపు ఆలోచన రాష్ట్రప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్లు వినిపించారు. రాజధాని వ్యవహారంతో తమకు సంబంధం లేదని కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసిన సందర్భంలో.. మధు కేంద్రం వైఖరిని తూర్పారపట్టారు కూడా. మరి ఇంతగా అమరావతి పోరాటానికి మద్దతిచ్చిన సీపీఎం.. రైతులు తమ దీక్షలు ఏడాది పూర్తయిన సందర్భంగా జరిగిన జనభేరికి మాత్రం ఎందుకు డుమ్మా కొట్టాయి. ఇది మిలియన్ డాలర్ ప్రశ్న.
చెప్పే సాకులు చాలా చిన్నవి!
ఎందుకు జనభేరికి హాజరు కాలేదనే విషయంలో సీపీఎం నాయకులు చెబుతున్న కారణాలు, సాకులు చాలా చిన్నవిగా కనిపిస్తున్నాయి. బీజేపీ తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్నామని, ఆ చట్టాలను తెచ్చిన బీజేపీ నాయకులు జనభేరి లో పాల్గొంటున్నారు గనుక, మేం జనభేరికి హాజరుకావడం లేదు అని సీపీఎం కార్యదర్శి మధు ప్రకటించారు. నిజానికి బిజెపి ఇన్నాళ్లుగా రాజధాని పోరాటానికి దూరం ఉంటూ వచ్చింది. ఇప్పుడు తొలిసారిగా క్రియాశీలంగా వారి ఉద్యమంలో పాల్గొంది. అమరావతి ఒక్కటే ఏపీకి రాజధానిగా ఉండాలనే వాదనకు తమ మద్దతుంటుందని ప్రకటించింది.
ఏ ప్రయోజనం కోసం అయితే అందరూ కలిసి పోరాడుతున్నారో.. ఆ ప్రయోజనం నెరవేరేందుకు.. ఇన్నాళ్లూ దూరంగా ఉన్నవారు కూడా పోరాటంలోకి కలిసి వస్తే.. సంతోషించాలి. నిజాయితీగా పోరాటంలో ఉన్నవారైతే అలాగే చేస్తారు. కానీ ఏదో ఊర్లలో పంచాయతీల్లాగా, చిన్న పిల్లల గొడవల్లాగా.. వాడికీ నాకూ పడదు గనుక.. వాడు వస్తే నేను రాను అని మొండికేయడం.. అమరావతి రాజధాని వంటి ఒక గొప్ప ప్రయోజనం కోసం పోరాడుతున్న వారిలో ఉంటుందని ఊహించలేం. కానీ.. ఇలాంటి సంకుచితమైన సాకు చూపి సీపీఎం జనభేరికి దూరంగా ఉండడం విమర్శల పాలవుతోంది.
వ్యవసాయ చట్టాల విషయంలో బీజేపీ వైఖరితో ఎవ్వరైనా విభేదించవచ్చు. ఆ మాటకొస్తే ప్రత్యేకహోదా ఇచ్చే విషయంలోనూ ఏపీని వంచించింది బీజేపీనే. కానీ.. రాజధాని అమరావతి పోరాటం ముందు అవన్నీ ఇతర విషయాలే అవుతాయి.
సీపీఎం తీరుపై విమర్శలేంటి?
సీపీఎం కార్యదర్శి మధు వ్యవసాయ చట్టాల సాకు చూపి.. అమరావతి పోరాటానికి దూరంగా మెలగడం అనేది రకరకాల అనుమానాలకు తావిస్తోంది. మామూలుగా వైఎస్సార్సీపీతో సన్నిహితంగా మెలగుతుంటారనే పేరున్న సీపీఎం నాయకుడు.. వారి సూచనల మేరకే ఇలా కార్యక్రమానికి రాకుండా సైలెంట్ గా ఉండిపోయారా అనే ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే.. ముందుముందు కూడా అమరావతి రాజధాని పోరాటానికి సీపీఎం దూరంగా ఉంటుందనే అనుకోవాలి. బీజేపీ పోరాటంలోకి వచ్చిందనే సాకు చూపి దూరం జరగడం అంటే.. అది.. అమరావతి ఉద్యమానికి ద్రోహం చేయడమే అని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Also Read: పొత్తు తప్పదా.. బీజేపీ ట్రాప్లో కేసీఆర్, ఎంఐఎం పడినట్టే..