గత ప్రభుత్వ హయాంలో అన్నింటిలోనూ అక్రమాలు జరిగాయని, ఇసుక దోపిడీ జరిగిందని వైసీపీ రోజూ చేసే ఆరోపణే. చంద్రబాబు హయాంలో స్వయం సహాయక సంఘాలకు, గ్రామ పంచాయతీలకు ఇసుక రీచ్ల్లో భాగస్వామ్యం కల్పిస్తే అందులోనూ అక్రమాలు జరిగాయని వైసీపీ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం చాలా మందికి గుర్తుండే ఉంటుంది. గ్రామాల్లో పేదలకు ఇళ్ల నిర్మాణానికి కేవలం రవాణా ఖర్చులే చెల్లించాల్సి వచ్చినా.. దాన్నికూడా వైసీపీ అప్పట్లో తప్పుబట్టింది.
కొత్త ఇసుక పాలసీతో నిర్మాణ కార్మికుల ఇబ్బందులు
నిజమేనేమో..వైసీపీ అధికారంలోకి వస్తే.. ఇసుక ఉచితంగా ఇస్తారేమో.. ఇంటింటికి ఇసుక రవాణా చేస్తారేమో అన్న ఆశలూ కల్పించింది. కొత్త ఇసుక పాలసీ ప్రకటిస్తామని చెప్పింది. అయితే చెప్పినట్లుగానే కొత్త ఇసుక పాలసీ తెచ్చింది. నిబంధనలూ మార్చింది. అయితే ఆ మార్పులు..చేర్పులు ఎలా ఉన్నాయో..రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికులను అడిగితే చాలా సూటిగా..స్పష్టంగా చెబుతారు. ఒక్క మాటలో చెప్పాలంటే..అధికారంలోకి వచ్చాక వైసీపీ పూర్తిగా రివర్స్ గేర్ వేసిందని చెప్పవచ్చు. టీడీపీ హయాంలో ట్రాక్టర్ ఇసుక రూ.1500 ఉంటే.. వైసీపీ వచ్చాక రూ.4వేల మొదలు..రూ.7వేల వరకు వెళ్లింది. అంతేకాదు.. అంత పెట్టి కొన్నా..ఇసుక దొరికేది కాదు.. కొవిడ్ తరువాత పరిస్థితి మరీ దిగజారింది. ఇసుక కొరత వల్ల భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోసం నానా ఇబ్బందులూ పడ్డారు. ఓవైపు పరిస్థితి ఇలా ఉంటే.. ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఇసుకను ప్రైవేటు సంస్థకు అప్పజెప్పింది. రీచ్ల నిర్వహణను ప్రైవేటు పరం చేసింది. ఇసుక ధరను తామే నిర్ణయిస్తామని ప్రకటించింది. రీచ్ లను ప్రైవేటుకు అప్పజెప్పినా ప్రభుత్వం నిర్ణయించిన ధర ఎంత మేరకు అమల్లోకి వస్తుందనేది సందేహాస్పదంగా మారింది.

471 రీచ్లు.. ఆళ్ల రామకృష్ణారెడ్డి సంబంధీకులకే..
రాష్ట్రంలోని 471 ఇసుక రీచ్లను ప్రైవేటుకి అప్పజెప్పింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు ఎంఎస్టీసీ ద్వారా టెండర్లు పిలవగా జయప్రకాశ్ వెంచర్స్ లిమిటెడ్ మూడు ప్యాకేజీలను దక్కించుకుంది. తద్వారా రెండేళ్లకు రూ.1530కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. ఇంతకీ ఆ కంపెనీ విషయానికి వస్తే..టీడీపీ పలు ఆరోపణలు చేసింది. ఆ కంపెనీలో ఉన్న ఓ వ్యక్తి.. రాంకీ గ్రూపులో కీలకంగా ఉన్నారని, ఆ గ్రూపు ఆళ్ల రామకృష్ణారెడ్డి సోదరుడిదని టీడీపీ నేత పట్టాభిరామ్ వ్యాఖ్యానించారు. అంతేకాదు.. గతేడాది రూ.వేల కోట్లకుపైగా నష్టం చవి చూసిన కంపెనీ అని, ఈ వ్యాపారంలో అనుభవం లేని కంపెనీకి ఇచ్చారంటే..క్విడ్ ప్రొ కో లో భాగమేనని ఆరోపించారు. జనసేన, సీపీఐ కూడా ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు గుప్పించింది. కాగా ఈ టెండర్లలో 5 ప్రైవేటు సంస్థలు పాల్గొన్నాయిని, అత్యధికంగా ప్యాకేజీ-1లో రూ.477.5 కోట్లు, ప్యాకేజీ-2లో రూ.745.7 కోట్లు, ప్యాకేజీ-3లో 305.6 కోట్లు (మొత్తం రూ.1,528 కోట్లు) ఇస్తామని జయప్రకాశ్ పవర్ కోట్ చేసిందని, ఏప్రిల్ ఒకటి నుంచి ఈ కొత్త విధానం అమలు కానుందని ప్రభుత్వం ప్రకటించింది. ఇక నాణ్యత పరిశీలన, రవాణా సౌకర్యంలో సహాయం, పట్టా భూముల్లో తవ్వకాల నిలిపివేత, బుకింగ్ చేసుకోకుండానే డైరెక్ట్ కొనుగోళ్లు, అన్ని రీచ్లలో ఒకే ధర, రీచ్లు లేనిచోట్ల స్టాక్ పాయింట్ల ఏర్పాటు ఇలా పలు అంశాలను ప్రభుత్వం నిబంధనలుగా పెట్టినా..క్షేత్ర స్థాయిలో ఎంతవరకు అమలవుతాయనేది చర్చనీయాంశంగా మారింది.
మద్యం పాలసీలాగానేనా..
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చింది. కొన్ని పేరున్న బ్రాండ్లను నిలిపి వేసింది. రాష్ట్రంలో పలు కొత్త బ్రాండ్ల మద్యం మార్కెట్లోకి వచ్చింది. ఆ పేర్ల ద్వారా ప్రతిష్ట దెబ్బ తింటుందని కొన్ని పేర్లను ప్రభుత్వం మార్చాల్సిందిగా సూచించినట్టు సమాచారం. ఇక కొత్త మద్యం పాలసీలో భాగంగా ధరలు విపరీతంగా పెంచారు. ధర పెరిగితే మద్యం తాగడం తగ్గుతుందని, క్రమేణా మద్యపాన నిషేధం సాధ్యం అవుతుందని చెప్పింది. దీంతో ఏపీలో మద్యం ధరలు పెరిగాయి. చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి అక్రమ తరలింపు భారీగా పెరిగింది. అదే సమయంలో పేరున్న బ్రాండ్లను రాష్ట్రంలో విక్రయించడాన్ని నిలిపివేయడంతో ఆదాయం తగ్గింది. కొన్నాళ్ల తరువాత మద్యం ధరలు తగ్గించడంతో పాటు కింగ్ ఫిషర్ లాంటి బ్రాండ్లను ప్రభుత్వం ఏపీలోకి అనుమతించక తప్పని పరిస్థితి తలెత్తింది. ధరలు పెరిగితే మద్యపాన నిషేధం అమలని చెప్పిన ప్రభుత్వం.. మద్యం ధరలు తగ్గిస్తే.. మద్యపానాన్ని ప్రోత్సహించినట్టే కదా అనే విమర్శలూ వచ్చాయి. తాజాగా ఇసుక పాలసీ విషయంలో పారదర్శకత కోసమే ప్రైవేటుకి అప్పగించామని చెబుతున్న ప్రభుత్వం..రానున్న కాలంలో ఆ పారదర్శక విధానాలను ఎలా అమలు చేస్తుందో చూడాలి.











