అందాలు ఆరబోసే తారలైనా ఏదో ఒక రోజు తల్లికాక తప్పదు. అలాంటి తారలు రేపు మాపో బిడ్డలకు జన్మనివ్వబోతున్నవారు చాలా మందే ఉన్నారు. కానీ గర్భిణులుగా ఉన్న వీరు ఫొటో చేయడం మాత్రం విమర్శలకు తావిస్తోంది. ముఖ్యంగా క్రికెటర్ విరాట్ కొహ్లి భార్య అనుష్కాశర్మ ఫొటో షూట్ ఈ మధ్య బాగా వైరల్ అయ్యింది. ఈ ఫొటో చూసి ఈ దంపతుల అభిమానులు ఫిదా అయ్యారు గానీ ఇలాంటి ఫొటోలను నెట్టింట వైరల్ చేయడం అవసరమా అన్న విమర్శలు కూడా వచ్చాయి.
తల్లిదండ్రులు కావడం జీవితాలను మార్చే అనుభవంగా ఈ తారలు పేర్కొంటున్నారు. 2020లో కరోనా పుణ్యమా ఏమోగానీ 2021లో మాత్రం చాలామంది తారలు తల్లులు కాబోతున్నారు. అనుష్కాశర్మ నుంచి కరీనా కపూర్ వరకూ ఈ ఏడాది మొదటి బిడ్డో, రెండో బిడ్డకో జన్మనివ్వడానికి సిద్దంగా ఉన్నారు. ఆ శుభవార్త కోసం వారి అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు. వీరిని చూస్తుంటే గర్భిణిగా కనిపించడానికి సిగ్గుపడే రోజులు పోయాయనే అనిపిస్తోంది. కేవలం ఫొటో షూట్ లే కాదు ఏకంగా డాక్యుమెంట్లు చేయడానికి కూడా వీరు వెనకాడటం లేదు. ఆ ధైర్యానికి వీరిని మెచ్చుకుని తారాల్సిందే.
ఇన్ స్టాగ్రామ్ లో అనుష్క
కొహ్లి సతీమణి, బాలీవుడ్ నటి అనుష్కా శర్మ ఇన్ స్టాగ్రామ్ లో ఇలాంటి ఫొటోలను షేర్ చేశారు. ఈ ఫొటోలను వోగ్ మ్యాగ్ జైన్ కు ప్రత్యేకంగా ఇచ్చారు. బిడ్డ విషయంలో తమ ప్లానింగ్ ఏమిటో కూడా ఆమె వివరించింది. ఇషా డియోల్ ఫొటోలు కూడా గ్రీస్ నుంచి విడుదలయ్యాయి. ఇషా, భరత్ కలిసి మరీ ఈ ఫొటో షూట్ చేశారు. వీరిద్దరూ గ్రీస్ లోని శాంటోరినిలో ఇలా ఫొటోలు దిగారు. ఇది ఓ మధుర జ్ఞాపకంగా వారు పేర్కొన్నారు. మరో బాలీవుడ్ నటి కల్కీ కొచ్లిన్ 2020 జనవరిలో మొదటి బిడ్డకు జన్మనిచ్చింది.
ఆ ప్రసవానికి ముందు ఆమె గర్భిణిగా ఉన్న కొన్ని ఫొటోలను షేర్ చేశారు. ముఖ్యంగా బికినీలో ఉన్న ఫొటోలవి. శ్వేతా సాల్వే ఫొటోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. బ్లూమింగ్ పేరుతో వీటిని షేర్ చేశారు. ఇక నటాషా స్టాంకోవిక్ ఫొటోలు కూడా ఆకట్టుకుంటున్నాయి. గత కొంత కాలంగా హార్ధిక్ పాండ్యా, నటాషా స్టాంకోవిక్ ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. వీరికి ఓ కొడుకు కూడా పుట్టాడు. ఆ సమయంలోనే వీరు ఫొటో షూట్ చేశారు. తమ జీవితాల్లోకి కొత్త సభ్యులను స్వాగతిస్తున్నామని వీరు పేర్కొన్నారు.