అకాల వర్షాలు, ఈదురుగాలులు, వడగళ్ల కారణంగా పంట నష్టపోయిన రైతులకు చంద్రబాబు భరోసా కల్పించారు. వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు ఇవాళ సాయంత్రంలోగా పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. పంట నష్టాన్ని వెంటనే అంచనా వేసి, నష్టపోయిన ప్రతి రైతుకూ పరిహారం అందేలా చూడాలని స్పష్టం చేశారు. పిడుగుపాటు కారణంగా చనిపోయిన 10 మంది బాధితుల కుటుంబాలకు కూడా తక్షణమే పరిహారం అందించాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజులుగా కురిసిన అకాల వర్షాలపై చంద్రబాబు సమీక్షించారు. వర్ష ప్రభావిత జిల్లాల్లో పంట, ప్రాణ నష్టం గురించి అధికారులను అడిగి సీఎం వివరాలు తెలుసుకున్నారు. జిల్లాల్లో పరిస్థితులను కలెక్టర్లు వివరించారు.
రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఇంకా వర్ష సూచన ఉన్నందున కలెక్టర్లు, అధికారులు ప్రజలను అలర్ట్ చేయాలన్నారు చంద్రబాబు. ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పిడుగులు పడే సమయాల్లో ప్రజల సెల్ ఫోన్లకు అలర్ట్ మెసేజ్లు పంపాలన్నారు. మెసేజ్ వెళ్లని పరిస్థితుల్లో దగ్గరగా ఉన్న అధికారులు వెళ్లి అప్రమత్తం చేయాలని సూచించారు. విపత్తుల సమయాల్లో అధికారులు మానవత్వంతో వ్యవహరించాలన్నారు. పిడుగులు పడి చనిపోయిన పశువులకు కూడా పరిహారం వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. ప్రాథమిక అంచనా ప్రకారం వర్షాలతో రాష్ట్రంలో 2,224హెక్టార్లలో వరి, మొక్కజొన్న దెబ్బతిన్నట్లు అధికారులు వివరించారు.
అత్యధికంగా పశ్చిమగోదావరి జిల్లాలోని 15 మండలాల్లో 1,033 హెక్టార్లు, నంద్యాల జిల్లాలో 641, కాకినాడ జిల్లాలో 530, శ్రీసత్యసాయి జిల్లాలో 20 హెక్టార్లలో వరి పంటకు నష్టం వాటిల్లినట్లు అధికారులు చెప్పారు. అలాగే అరటి, బొప్పాయి, మామిడి, తదితర ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లినట్లు తెలిపారు. కృష్ణా, ఏలూరు, కాకినాడ, ఎన్టీఆర్, తిరుపతి, నంద్యాల, పశ్చిమగోదావరి జిల్లాల్లో మొత్తం 138 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లినట్లు వివరించారు. పిడుగుపాటుకు తిరుపతి జిల్లాలో నలుగురు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున, ఏలూరు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందినట్లు చెప్పారు.
ధాన్యం కొనుగోళ్లపై ఆదేశాలు –
రబీ సీజన్లో 30లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు పౌర సరఫరాల శాఖ ప్రత్యేక కార్యదర్శి సౌరబ్గౌర్ సీఎం చంద్రబాబుకు తెలిపారు. ఇప్పటికే 13లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. వర్షాలకు రంగు మారిన ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. ఇదే అంశంపై మాట్లాడిన సీఎం చంద్రబాబు..రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కొనుగోలు చేయాల్సిందేనని గట్టిగా చెప్పారు. అవసరమైతే కేంద్రంతో మాట్లాడి కొనుగోలుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఏ ఒక్క రైతు నుంచి కూడా ధాన్యం కొనలేదన్న మాట రాకూడదని స్పష్టం చేశారు.
కాగా, రాబోయే రోజుల్లో కూడా RTGSలోని అవేర్ విభాగం, విపత్తు నిర్వహణ సంస్థ నుంచి ఎప్పటికప్పుడు వాతావరణంపై ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తుంటామని చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద మంచి యంత్రాంగం, సాంకేతికత ఉందని, వీటిని సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు. వర్షాలకు పలు జిల్లాల్లో దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించడంలో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది చేసిన కృషిని సీఎం అభినందించారు.