వైసీపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన వాలంటీర్ల వ్యవస్థ నేను పెనుభారంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ చొప్పున 2.5 లక్షల మందిని నియమించారు. నెలకు రూ.5 వేల కనీస వేతనంతో వాలంటీర్లను తీసుకున్నారు. 95 శాతం మంది వైసీపీ వారికే వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చామని ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి బహిరంగంగా ప్రకటించుకున్నారు. అయితే ఆ వ్యవస్థే ఇప్పుడు వైసీపీ నేతలకు కొత్త తలనొప్పులు తెచ్చేలా కనిపిస్తోంది. ఇప్పటికే వాలంటీర్లకు నెలకు రూ.5 వేల చొప్పున ప్రతినెలా రూ.125 కోట్లు జీతాలు చెల్లిస్తున్నారు. ఏటా ప్రభుత్వంపై వాలంటీర్ల వ్యవస్థ వల్ల రూ.1800 కోట్ల భారం పడింది. ప్రారంభంలో పెద్దగా పని ఉండదని ఎగబడి వాలంటీర్గా జాయిన్ అయిన వారు నేడు పనిభారంతో కుంగిపోతున్నారు. ప్రభుత్వం ఇచ్చే రూ.5 వేలకు ఇన్ని పనులు చేయలేమని గుంటూరు జిల్లాలో వాలంటీర్లు ఉద్యమ బాట పట్టారు. తమ పార్టీకి చెందిన వాలంటీర్లే ఉద్యమబాట పట్టడంతో వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి.
రూ.12 వేలు చేయాల్సిందే..
కేవలం రేషన్ సరఫరా చేసేవారికి నెలకు రూ.21 వేలు ఇస్తున్న ప్రభుత్వం, అన్నీ పనులు చేయించుకుంటూ తమకు నెలకు రూ.5 వేలు మాత్రమే ఇస్తూ వెట్టిచాకిరీ చేయిస్తోందని వాలంటీర్లు గుంటూరులో ఆందోళనకు దిగారు. తమ జీతం కనీసం రూ.12 వేలకు పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన వాలంటీర్లు ఆదివారం బీఆర్ స్టేడియం వద్ద సమావేశమై జీతాలు పెంచే వరకూ పోరాటం సాగించాలని నిర్ణయించారు. తమ పోరాటాన్ని అన్ని జిల్లాలకు విస్తరించాలని నిర్ణయించారు. ఫిబ్రవరి నెలాఖరు వరకు నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని, అప్పటికీ ప్రభుత్వం దిగిరాకుంటే వచ్చే నెల నుంచి విధులు బహిష్కరించాలని నిర్ణయించారు. వాలంటీర్ల నిర్ణయంపై వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. రేషన్ డోర్ డెలివరీ చేసే వారికి సహకరించాలని సత్తెనపల్లిలో వాలంటీర్లకు ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆదేశించారు. అయితే రేషన్ డోర్ డెలివరీకి తమకు సంబంధం లేదని వాలంటీర్లు తేల్చి చెప్పారు. దీంతో వైసీపీ ఎమ్మెల్యే ఖంగుతిన్నారు.
ప్రభుత్వానికి పెనుభారం తప్పదా?
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన వాలంటీర్ల వ్యవస్థ పెనుభారంగా మారనుంది. ఇప్పటికే ప్రభుత్వం ఏటా రూ.1800 కోట్లు ఖర్చు చేస్తోంది. వారి జీతాలు రూ.12 వేలకు పెంచితే ఇక ఏటా ప్రభుత్వంపై రూ.4500 కోట్ల పెనుభారం పడనుంది. అందుకే ప్రభుత్వం ఆందోళనకు దిగుతున్న వాలంటీర్ల గొంతు నొక్కాలని చూస్తుందనే విమర్శలు వస్తున్నాయి. ఆందోళనకు దిగుతున్న వాలంటీర్లను గుర్తించి వెంటనే తొలగించాలని లేదంటే వారి ఉద్యమం రాష్ట్ర వ్యాప్తం అయ్యే ప్రమాదం ఉందని ప్రభుత్వం గుర్తించింది. అందుకే ఆందోళన చేస్తున్న వాలంటీర్లకు ఆ ప్రాంతంలోని స్థానిక వైసీపీ నేతలతో చెప్పిచూస్తున్నారు. వినకపోతే వేటు తప్పదని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో ఇప్పటికే పలు జిల్లాల్లో 12000 మంది వాలంటీర్లు వారి ఉద్యోగాలు వదిలేసుకుని వేరే పని వెతుక్కుంటున్నారు. ఇక ఏ అవకాశం లేని వారు మాత్రమే వాలంటీరుగా పనిచేయడానికి ముందుకు వస్తున్నారని తెలుస్తోంది.
ప్రతిదానికీ వాలంటీరే దిక్కా..
ఏపీ ప్రభుత్వం ప్రతి పనికీ వాలంటీర్లను ఉపయోగించుకుంటోంది. ప్రతి 50 కుంటుంబాలకు ఒక వాలంటీరును నియమించిన ప్రభుత్వం ఆ ప్రాంతంలో ఎవరికి ఏ పని వచ్చినా వాలంటీరును కలవాలని చెబుతోంది. దీంతో వాలంటీర్లకు పనిభారం పెరిగిపోయింది. ఇక రేషన్ డోర్ డెలివరీలోనూ వాలంటీర్ల సేవలు ఉపయోగించుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. వాలంటీరుకు కేటాయించిన ప్రాంతంలో రేషన్ సరఫరా చేసేప్పుడు అందుబాటులో ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో వాలంటీర్లు రేషన్ డోర్ డెలివరీలో బియ్యం మూటలు మోయాల్సి వస్తోంది. దీంతో కొందరు వాలంటీర్లు రేషన్ డోర్ డెలివరీ కార్యక్రమానికి దూరంగా ఉంటున్నారు. అలాంటి వారిని గుర్తించి చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం పావులు కదుపుతోంది. వాలంటీర్ల తేనె తుట్టెను కదిలిస్తే ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తప్పేలా లేదు. అందుకే వాలంటీర్ల ఆందోళనపై నిఘా వర్గాలు కూడా ఓ కన్నేసి ఉంచాయని తెలుస్తోంది.
Also Read: విజయసాయి రెడ్డి.. వెంకయ్యనాయుడుని ఎంత మాట అన్నారు..!











