ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయి ఏడేళ్లు కావస్తోంది. ఈ నేపథ్యంలో విభజన హామీలు, ప్రత్యేక హోదా సాధన సమితి గుంటూరులో సమావేశం నిర్వహించింది. వివిధ పార్టీల నాయకులు చలసాని శ్రీనివాస్, సీపీఐ, సీపీఎం నేతలు రామకృష్ణ, మధు, టీడీపీ నేతలు నక్కా ఆనంద్ బాబు, ఆలపాటి రాజా హాజరయ్యారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఎంతో నష్టపోయిందని అన్నారు. కేసులు, ఇతర ఒత్తిళ్లకు తలొగ్గి ప్రత్యేక హోదాపై జగన్ మౌనంగా ఉన్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా సాధిస్తేనే ఏపీ కి న్యాయం జరుగుతుందని, ఇందుకోసం ప్రతిఒక్కరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు.
కేంద్రం కక్షకట్టింది
ఆంధ్రా మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం ఏడేళ్లుగా పోరాటం సాగుతోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపీపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రత్యేక హోదా సాధించడంలో వైఎస్ జగన్ విఫలమయ్యారని, కేసుల భయంతో కేంద్రంతో రాజీపడుతున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదాను సాధించి, ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టకోవాలని చలసాని అన్నారు.
వైసీపీ లొంగింది
బీజేపీ ప్రభుత్వానికి వైసీపీ లొంగిపోయిందని, అందుకే ప్రత్యేక హోదాపై ఒత్తిడి చేయడం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. విభజన హామీలు అమలు చేయడంలో బీజేపీ విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం ప్రత్యేక హోదాపై ఉద్యమించకపోతే.. బీజేపీకి లొంగిపోయినట్టుగానే భావించాల్సి వస్తోందని ఆయన అన్నారు. ఏపీ అన్నిరంగాల్లో వెనుకబడిపోయిందని, ఉద్యోగాల కల్పనకు బహుళ జాతి కంపెనీలు ముందుకురాని పరిస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్రంతో జగన్ కుమ్మక్కు
సీఎం జగన్ కేంద్రంతో కుమ్మక్కై ప్రత్యేకహోదా అంశాన్ని గాలికి వదిలేశారని టీడీపీ నాయకులు నక్కా ఆనంద్ బాబు విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా తెస్తానని అధికారంలోకి వచ్చిన జగన్ ఏం సాధించారని నిలదీశారు. కేసులకు భయపడే జగన్ ప్రభుత్వం వెనకడుగు వేస్తోందని ఆరోపించారు. ప్రత్యేక హోదా సాధించడంలో జగన్ పూర్తిగా విఫలమయ్యారని, ప్రజా సంఘాలు, ఇతర పార్టీల నాయకులు కలిసి ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు.