తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏపీ ప్రజలు తనకు వినతులు చేస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యల మీద ఏపీ సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) వరుసబెట్టి సెటైర్లు సంధిస్తున్న తీరు కలకలం రేపేదేనని చెప్పాలి. ఎందుకంటే.. తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్కు లోపాయికారీగా మంచి సంబంధాలున్నాయని అన్ని రాజకీయ పార్టీలు చెబుతున్నాయి. ఈ కారణంగానే ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదాలు మొదలై సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేసినా.. ఏపీ సీఎం జగన్ మాత్రం పెద్దగా స్పందించలేదన్న వాదనలు లేకపోలేదు. తెలంగాణ రాజధాని హైదరాబాద్లో ఉన్న తన ఆస్తులు, వ్యాపారాలను కాపాడుకునేందుకే కేసీఆర్పై జగన్ పెద్దగా ఆరోపణలు చేయరన్న వాదనలూ ఉన్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో జగన్ కేబినెట్ లో కీలక మంత్రిగా ఉన్న పేర్ని నాని.. కేసీఆర్ను ఉద్దేశించిన సంచలన వ్యాఖ్యలు చేయడం, అది కూడా వరుసబెట్టి సెటైర్లు సంధిస్తున్న తీరు చూస్తుంటే.. జగన్కు తెలియకుండానే నాని ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లుగా విశ్లేషణలు సాగుతున్నాయి.
అయినా నాని ఏమన్నారంటే..?
ఇటీవలి టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా ఏపీలో పార్టీ పెట్టమని కోరుతున్నారంటూ కేసీఆర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై మంత్రి పేర్ని నాని గురువారం నాటి రియాక్షన్ రెండు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. తాము కూడా పార్టీ పెట్టమనే కోరుతున్నామని చెబుతూనే.. రెండు రాష్ట్రాల్లో ఒకటే పార్టీ.. రెండు రాష్ట్రాల్లో కలిపేస్తూ కేబినెట్ లో తీర్మానం చేస్తే సరి పోతుందని.. తమ నాయకుడు సైతం రాష్ట్రం కలిసే ఉండాలని కోరుకున్నారంటూ పేర్ని నాని వ్యాఖ్యానించారు. ఇక, తాజాగా.. శుక్రవారం నాడు కేసీఆర్ను గుర్తు చేసుకుని మరీ మరోమారు ఆయనపై నాని సెటైర్లు వేశారు. నదీ జలాల వినియోగం విషయంలో కేసీఆర్ మాట తప్పారని నాని పేర్కొన్నారు. దిండి, పాలమూరు వంటి ప్రాజెక్టుల్లో తాగునీరు పేరుతో సాగుకు నీళ్లు మళ్ళించారని చెప్పుకొచ్చారు. ఏపీకి కేటాయించిన నీళ్లకు అదనంగా చెంచాడు నీళ్లు కూడా వాడమని ఎప్పుడో చెప్పామని నాని గుర్తు చేసారు. రెండు రాష్ట్రాల మధ్య సఖ్యత విషయంలో హైదరాబాద్ నుంచి విజయవాడ కు ఎంత దూరమో విజయవాడ నుంచి హైదరాబాద్ కు అంతే దూరం అంటూ కీలక వ్యాఖ్య చేసారు. అంతటితో ఆగని నాని.. తెలంగాణలోని రాజకీయాల పైన స్పందించారు. రాజకీయ శూన్యత వల్లే తెలంగాణలో కొత్త పార్టీలు పుట్టుకు వస్తున్నాయన్నారు. అదే సమయంలో 151 స్థానాలు వచ్చిన తర్వాత ఏపీలో శూన్యత ఎక్కడ ఉంటుందంటూ ప్రశ్నించారు. తమ ప్రభుత్వ సంక్షేమ పథకాల వల్ల ప్రజల మనసుల్లో శూన్యత లేదని వ్యాఖ్యానించారు.
టీఆర్ఎస్ స్పందిస్తే బ్యాండే
మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు ఇప్పటిదాకా స్పందించలేదనే చెప్పాలి. గురువారం నాటి వ్యాఖ్యలపై పెద్దగా స్పందించాల్సిన అవసరం లేకున్నా.. శుక్రవారం నాటి నాని వ్యాఖ్యలపై మాత్రం టీఆర్ఎస్ నేతలు తప్పనిసరిగానే స్పందిస్తారన్న వాదనలు వినిపిస్తున్నాయి. టీఆర్ఎస్ నేతలు స్పందిస్తే గనుక.. నాని వ్యాఖ్యలు మరింత దుమారం రేపడం ఖాయమన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే.. జగన్ కూడా ఎంట్రీ ఇవ్వక తప్పదని, మంత్రి పేర్ని నానికి వార్నింగులూ తప్పదన్న విశ్లేషణలు సాగుతున్నాయి. ఇప్పటికే తన సోదరి వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడంతో కేసీఆర్కు ఏం చెప్పాలో తెలియక సతమతమవుతున్న తరుణంలో ఇలా కొత్తగా వివాదాలు ఎందుకు సృష్టిస్తున్నారని జగన్.. నానికి చీవాట్లు పెట్టడ ఖాయమేనని తెలుస్తోంది.