( విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
అనుకోని అతిధిగా విశాఖ తీరానికి కొట్టుకు వచ్చిన “ ఎం వి మా” నౌక సందర్శకులను ఎంతో అలరిస్తోంది. ఇది కొద్ది రోజులు మాత్రమే అనుకున్నా.. శాశ్వతంగా విశాఖ తీరంలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశాఖ తెన్నేటి పార్క్ తీరానికి కొట్టుకు వచ్చిన బంగ్లాదేశ్కు చెందిన నౌక మరో నెల రోజులకుపైగా విశాఖ తీరంలోనే ఉంటుందని అంచనా వేశారు.
నౌకను మళ్లీ సముద్రంలోకి పంపేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా నౌకలో ఉన్న చమురు మొత్తాన్ని తోడి మరో ప్రాంతానికి తరలించారు. ఇందుకోసం లక్షలాది రూపాయలను నౌక యాజమాన్యం ఖర్చు చేసింది. దాన్ని సురక్షితంగా సముద్రంలోకి పంపే ప్రక్రియ కోసం ముంబైకి చెందిన కన్సల్టెంట్ కంపెనీతో చర్చలు జరిపింది. దాని కోసం మరో రూ.5, 6 కోట్లు ఖర్చు అయ్యే అవకాశం ఉందని తేలడంతో యజమాన్యం రెస్క్యూ పనులకు బ్రేక్ వేయాలని భావిస్తున్నట్టు పర్యాటక శాఖ అధికారులకు సమాచారం అందింది.
పర్యాటక కేంద్రంగా మార్చాలని…
ఇప్పటికే విశాఖ సాగర తీరంలో టి యు 142, కురుసుర మ్యూజియం ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. అదే విధంగా బంగ్లాదేశ్ నౌకను సందర్శకులకు వీలుగా మార్చడం వల్ల ప్రయోజనం ఉంటుందని భావించిన అధికారులు ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. నౌక తీరానికి కొట్టుకు వచ్చినప్పటి నుంచి పెద్ద సంఖ్యలో సందర్శకులు నిత్యం దీన్ని చూసేందుకు తెన్నేటి పార్క్ వద్దకు వస్తున్నారు. దీన్ని శాశ్వతంగా సందర్శనా ప్రాంతంగా మార్చడం వల్ల పర్యాటక అభివృద్ధితో పాటు ఆదాయం కూడా వస్తుందనే ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లగా, ఆయన సీఎం వైఎస్ జగన్ ముందు ప్రతిపాదన ఉంచారు. సీఎం సానుకూలంగా స్పందించడంతో యాజమాన్యంతో చర్చలు జరిపి కొలిక్కి తీసుకురావాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. నౌక లోపలి భాగాలు సందర్శనార్థం, పై భాగాన్ని ఆతిథ్య సేవలకు వినియోగించేలా మార్పులు చేయాలని భావిస్తున్నారు. నౌక యాజమాన్యం దీనిని ఎంతోకొంత ధరకు విక్రయించడం, దానిని మ్యూజియంగా మార్చే ప్రక్రియలన్నీ సజావుగా పూర్తయితే… విశాఖ పర్యాటక సిగలో మరొక ఆకర్షణ గా నిలువనుంది.











