ఏపీలో కోవిడ్ పాజిటివ్ కేసులు గణనీయంగా తగ్గినా బ్లాక్ ఫంగస్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి.గత వారంలో సగటున 14 వేలు కరోనా కేసులు నమోదు కాగా,నిన్న 7,900లకు తగ్గాయి.20 రోజులుగా ఏపీలో కర్ఫ్యూ విధించడంతో జన సంచారం తగ్గిపోయింది.వ్యాపారాలు కూడా ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకే అనుమతించడంతో జనసంచారం తగ్గిపోయింది.దీంతో కరోనా కేసులు గణనీయంగా తగ్గాయని వైద్యాధికారులు చెబుతున్నారు.అయితే నేటికీ ఏపీలో లక్షా 63 వేల కరోనా పాజిటివ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి.రాబోయే వారం రోజుల్లో కరోనా రోజువారీ పాజిటివ్ కేసులు 2 వేలకు తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు.ఇదే జరిగితే జూన్ 15 నాటికి ఏపీలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 20వేలకు దిగిరానున్నాయి.
తగ్గిన టెస్టులు..
ఏపీలో కరోనా టెస్టులు కూడా భారీగా తగ్గించారు.మే నెల 28 వరకు సగటున రోజుకు లక్ష టెస్టులు నిర్వహించిన ప్రభుత్వం నిన్న కేవలం 65 వేల టెస్టులు మాత్రమే చేశారు.ఓ వైపు వ్యాక్సికేషన్ కార్యక్రమం కొనసాగిస్తూ,కర్ఫ్యూతో కట్టడి చేయడంతో కోవిడ్ కేసులు భారీగా తగ్గాయి.దీంతో కరోనా టెస్టులు కూడా తగ్గించినట్టు వైద్యాధికారులు చెబుతున్నారు.అయితే పట్టణాల్లో తగ్గిన కరోనా కేసులు గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. మొత్తం కేసుల్లో 80 శాతం గ్రామీణ ప్రాంతాల్లోనే నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.పట్టణ ప్రజల్లో అవగాహన పెరగడంతో వారు అనేక జాగ్రత్తలు పాటిస్తున్నారని,గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ జనం గుంపులుగా చేరుతున్నారని అధికారులు చెబుతున్నారు.దీంతో గ్రామీణ ప్రాంతాల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని తెలుస్తోంది.
ఆందోళన కలిగిస్తున్న బ్లాక్ ఫంగస్ కేసులు
ఏపీలో బ్లాక్ ఫంగస్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.ప్రభుత్వం అధికారికంగానే ఏపీలో 923 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయని ప్రకటించింది.అయితే చాలా మంది బ్లాక్ ఫంగస్ బాధితులు వైద్యం కోసం హైదరాబాద్లోని పలు ఆసుపత్రులను ఆశ్రయించారు.ఏపీలో 2 వేల వరకు బ్లాక్ ఫంగస్ కేసులు ఉండవచ్చని ఒక అంచనా. కాగా బ్లాక్ ఫంగస్ కోసం వినియోగించే మందుల కొరత తీవ్రంగా ఉంది. దీంతో బ్లాక్ ఫంగస్కు వాడే మందులు బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు.దీంతో పేదలు బ్లాక్ ఫంగస్కు వైద్యం చేయించుకోలేక నానా తంటాలు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బ్లాక్ ఫంగస్ రోగులకు మందులు సరఫరా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.











