ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ నిరాకరణ మొదలైపోయింది. ఇన్నాళ్లూ వారి తెరవెనుక మద్దతుతో ఇష్టమొచ్చినట్లుగా వ్యవహరించి, ప్రజల్ని పట్టి పీడించిన జగన్కు తాజాగా రెండు ఝలక్లు తగిలాయి. కేవలం మూడు రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం రెండు ఝలక్లు ఇవ్వడంతో జగన్మోహన్ రెడ్డి షాక్ అయ్యారు. ఆ రెండు ఝలక్లలో ఒకటి నాగార్జున సాగర్ డ్రామా కాగా, ఇంకోటి అమరావతి రాజధాని వ్యవహారం. దురుద్దేశంతో జగన్ ప్రభుత్వం చేసిన సాగర్ డ్రామాకు కేంద్ర ప్రభుత్వం రెండు రోజుల్లోనే ఫుల్ స్టాప్ పెట్టింది. అటు విశాఖపట్నానికి కాపురం మార్చుతానని విర్రవీగుతున్న జగన్కు కూడా కేంద్రం భారీ షాక్ ఇచ్చింది.
నాగార్జున సాగర్ సగం డ్యాంను పోలీసులతో ఆక్రమణకు యత్నించిన జగన్ సర్కారు ఆడిన రసవత్తర డ్రామా ఘోరంగా విఫలమైంది. వందల సంఖ్యలో రాత్రికి రాత్రి పోలీసుల్ని మోహరించి వారిని వెనక్కి పిలిచే ప్రసక్తే లేదని, మేమేం తప్పు చేయడం లేదు.. సాగర్ నీరు మా హక్కు అని ప్రగల్భాలు పలికిన జగన్ సర్కారుకు కేంద్రం ఇచ్చిన ఝలక్ చెంపపెట్టులాంటిదే. అసలు రిజర్వాయర్ లో సరిపడినంత నీళ్లు లేవని తెలిసి కూడా, కృష్ణా బోర్డుకు కనీస సమాచారం ఇవ్వకుండా అర్ధరాత్రి దండయాత్ర చేశారు. తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్కు లబ్ధి చేకూర్చడం కోసమే ఇలా చేశారని విమర్శలు వచ్చాయి. ఏపీ సర్కార్ తీరును కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా తీవ్రంగా తప్పుబట్టారు. జలశక్తి శాఖ కార్యదర్శి నీటి విడుదలను ఆపేయించారు. మొత్తానికి పోలీసు బలగాలను ఏపీ సర్కారు వాపసు తీసుకోక తప్పలేదు.
అటు అమరావతి విషయంలోనూ జగన్ కి ఎదురుదెబ్బే తగిలింది. యూపీకి చెందిన ఎంపీ జావెద్ అలీఖాన్ సోమవారం రాజ్యసభలో ఓ ప్రశ్న అడగ్గా, దానికి కేంద్రం చెప్పిన సమాధానంలో అమరావతి విషయం కూడా ఉంది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయమంత్రి కౌశల్ కిశోర్ సమాధానం చెప్తూ.. పట్టణ స్థానిక సంస్థలు, రాష్ట్రాలు వివిధ పథకాల ద్వారా చేపట్టే పనులకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహకరిస్తుందని.. మన దేశంలోని 28 రాష్ట్రాల్లో 26 రాష్ట్రాల రాజధానులకు అప్రూవ్డ్ మాస్టర్ప్లాన్ లు ఉన్నాయని చెప్పారు. వాటిలో ఏపీ రాజధాని అమరావతి, తెలంగాణ రాజధాని హైదరాబాద్ కూడా ఉన్నాయి. ఇక్కడ రాష్ట్రంలో మూడు రాజధానులు అంటూ విశాఖకు తరలిపోతానని ప్యాలెస్ సిద్ధం చేసుకొని రెడీగా ఉన్న జగన్ కు తాజాగా కేంద్ర ప్రభుత్వ సమాధానంతో రాష్ట్ర ప్రజల ముందు పరువు పోయినట్లయింది.
ఎవరేమి అనుకున్న నాకేటి సిగ్గు అన్న చందంగా.. జగన్ ప్రవర్తన మాత్రం మారడం లేదు. మూడు రాజధానుల అంశాన్ని కేంద్రం ఎక్కడా గుర్తించనేలేదు. ప్రతిచోటా అమరావతినే ఉటంకిస్తోంది. అయినా జగన్ తన తుగ్లగ్ ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారు. కొద్ది రోజుల క్రితం విశాఖలో భవనాలను ఆయా శాఖలకు కేటాయిస్తూ సర్కారు జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. రుషికొండ నిర్మాణాల్లో ఓ భవంతిని జగన్ కాపురం కోసం రెడీ చేశారు. డిసెంబరు 8 లేదా 9 తేదీల్లో విశాఖపట్నానికి సీఎం తరలుతారని జగన్ అనుకూల మీడియానే వార్తలు రాసింది. దీనికి ఇంకో నాలుగు రోజులే ఉన్నప్పటికీ దానిపై వార్తలు ఏమీ రావడం లేదు. తాజాగా కేంద్రం సమాధానంతో జగన్ పునరాలోచనలో పడ్డారా? లేక తన ఇష్టప్రకారమే విశాఖ రుషికొండ ప్యాలెస్లో కొలువుదీరతారా అనేది వేచి చూడాలి.