అమరావతి రాజధానిపై ప్రభుత్వంలో కదలిక వచ్చింది. రాజధానిలో ఇప్పటికే 75 శాతం పూర్తయిన భవనాలను వెంటనే పూర్తి చేయాలని 9 మంది సీనియర్ అధికారులతో నియమించిన కమిటీ నిర్ణయించింది. శాసన రాజధానికి అవసరమైన భవనాలను వెంటనే పూర్తి చేసేందుకు రూ. 2112 కోట్లు అవసరం అవుతాయని కమిటీ ప్రాథమిక అంచనాకు వచ్చింది. ఇప్పటికే ఉన్న రూ. 302 కోట్ల బకాయిలు కూడా చెల్లించాల్సి ఉంది. రాజధాని అమరావతిలో అసంపూర్తిగా నిలిచిపోయిన భవనాలపై చర్చించేందుకు సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ అధ్యక్షతన నియమించిన కమిటీ సచివాలయంలో భేటీ అయింది. రాజధానిలో అసంపూర్తిగా నిలిచిపోయిన భవనాలను ఎలా పూర్తిచేయాలనే దానిపై సుదీర్ఘంగా చర్చించారు. ఇప్పటికే 75 శాతంపైగా పూర్తయిన భవనాలను వెంటనే పూర్తిచేయాలని కమిటీ నిర్ణయానికి వచ్చింది. ఈ నిర్ణయాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి వద్ద ఉంచనున్నారు. అక్కడ నుంచి వచ్చే ఆదేశాల మేరకు అధికారుల కమిటీ తుది నిర్ణయం ప్రకటించనుంది.
మూడు రాజధానులకే ఫిక్స్ అయ్యారా..
ఏపీ ప్రభుత్వం మూడు రాజధానులకే ఫిక్స్ అయినట్టు కనిపిస్తోంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉద్యమం ఊపందుకున్న క్రమంలో మరలా అమరావతి రాజధాని ఉద్యమాన్ని రెచ్చగొట్టేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. మూడు రాజధానుల ప్రకటన చేసినప్పటి నుంచి అమరావతిలో నిర్మించిన భవనాలపై ఉలుకూ పలుకూ లేకుండా ఉన్న ప్రభుత్వం ఒక్కసారిగా రాజధానిపై ప్రేమను ఒలకబోస్తోంది. శాసనరాజధానికి అవసరమైన భవనాలను పూర్తి చేసి, అమరావతిలో మేము కూడా అభివృద్ధి చేశామని చెప్పుకోవడం ఒక ఎత్తయితే, మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్న వారిని రెచ్చగొట్టి, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశాన్ని పక్కదోవ పట్టించేందుకే మరలా రాజధాని అంశాన్ని తెరమేదకు తెచ్చారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
రాజధానిలో మిగిలిన భవనాలు అమ్మేస్తారా?
అమరావతి రాజధానిలో 75 శాతం పూర్తయిన భవనాలను మాత్రమే పూర్తి చేయాలని ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోంది. అంతకంటే తక్కవ నిర్మాణం చేసిన భవనాలను అమ్మే ప్రయత్నాలను తెరమీదకు తెచ్చేందుకే ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోందనే విమర్శలు వస్తున్నాయి. మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ 93 కేసులు హైకోర్టులో పెండింగ్ లో ఉన్నాయి. వీటిలో ఇంకా ఎలాంటి తీర్పు రాక ముందే ఏపీ ప్రభుత్వం అమరావతిని ఎగ్జిక్యూటివ్ రాజధానిగా అభివృద్ధి చేస్తామని చెప్పడం కూడా కోర్టు ఉల్లంఘన కిందకే వస్తుంది. మూడు రాజధానులను రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. హైకోర్టులో త్వరలో అనుకూల తీర్పు వస్తుందని వారు భావిస్తున్నారు. ఒక వేళ అనుకూలంగా తీర్పు లేకుండా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారు. అయితే హైకోర్టులో తీర్పు వచ్చిన మరుక్షణమే రాజధానిని విశాఖకు తరలించేందుకు ఏపీ ప్రభుత్వం చురుగ్గా విశాఖలో ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే అమరావతిలో ఎగ్జిక్యూటివ్ రాజధానికి అవసరం అయిన భనానాలు పూర్తి చేస్తామంటూ ఓ కమిటీని నియమించింది. దీనిపై అనేక విమర్శలు, అనుమానాలు వస్తున్నాయి.
దీనికి కూడా అప్పులే..
రాజధానిలో 75 శాతం పూర్తి చేసిన భవనాలను పూర్తి చేసేందుకు కూడా అప్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిర్మాణంలో ఉన్న ఆ భవనాలనే బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలు తెచ్చుకునే ప్రయత్నం చేయాలని సీఎస్ ఆదిత్యనాధ్ దాస్ అధికారులను ఆదేశించారని తెలుస్తోంది. ఇదే నిజమైతే అమరావతి రాజధానికి ఏపీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేసేందుకు సిద్దంగా లేదని స్పష్టం అవుతోంది. రాజధాని భూములు, భవనాలు తాకట్టు పెట్టి అసంపూర్తిగా ఉన్న భవనాలు పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు స్పష్టం అవుతోంది. ఒక వేళ రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు రాకుంటే ఇక అంతే సంగతులు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వానికి రుణాలు ఇచ్చేందుకు జాతీయ బ్యాంకులు కూడా ముందుకు రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అమరావతిలో మిగిలిపోయిన భవనాలు పూర్తి చేసేందుకు అప్పులు పుడతాయని భావించడం కొంచెం విడ్డూరంగానే కనిపిస్తోంది.
Must Read ;- విశాఖ రాజధానికి.. మోడీ సర్కార్ జై అంటున్నట్టేనా?











