నాడు దేశాన్ని ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలిన శాతకర్ణి చక్రవర్తికి నేనే రాజధానిని. సిరులు పండే భూములు నా సొంతం. ఆరుగాలం శ్రమించే రైతన్నలు నా బిడ్డలు. వారు నా కీర్తి ప్రతిష్ఠలను ఇనుమడిపజేశారు. అందుకే.. ఆనాడు దేశానికే ధాన్యాగారంగా నిలిచాను. అంతకు పూర్వమే ప్రఖ్యాత బౌద్ధారామంగా వినుతికెక్కాను. పాడిపంటలతో, పచ్చటి వనాలతో, ప్రశాంతమైన బౌద్ధారామాలతో, శాంతి నగరంగా.. అమర లింగేశ్వరుడి ఆవాసంగా.. నిత్యం నా రైతు బిడ్డల స్వేదంతో తడుస్తూ.. అమ్మదనంలోని కమ్మదనాన్ని ఆస్వాదిస్తూ.. దిగులూ విచారమూ లేకుండా హాయిగా సాగిపోతున్న నా జీవితాన్ని నేడు నడిరోడ్డుకీడ్చారు. నా బిడ్డల్ని బజారున పడేశారు. నాకు ఎనలేని శోకాన్ని కలిగిస్తున్నారు. మహామహా చక్రవర్తులకే రాజధానిగా సరిపోయిన నేను.. ఈ పాలకులకు సరిపోనా? నన్నెందుకు ఇంతలా క్షోభ పెడుతున్నారు? నా బిడ్డల మీద ఎందుకు అంత పగ పెంచుకున్నారు? నా బిడ్డలు నన్ను మించిన త్యాగమూర్తులే..! రాష్ట్రాభిమానంతో వేల ఎకరాలు ధారాదత్తం చేసేశారు. చంద్రబాబుపై నమ్మకంతో చిల్లిగవ్వ కూడా తీసుకోకుండా ఉన్నదంతా ఊడ్చిమరీ ఇచ్చేశారు. మరి వారి త్యాగాలకు ఫలితం ఇదేనా? జగనన్నా.. నా బిడ్డలపై నీకెందుకన్నా అంత కక్ష..!
నాటి చక్రవర్తుల పాలనలో ఒక వెలుగు వెలిగిన నేను.. నేటి ప్రజాస్వామ్య భారతంలో పూర్తిగా మరుగున పడిపోయాను. గత వైభవాన్ని తలచుకుని కాలం వెళ్లదీస్తూ వచ్చాను. సరిగ్గా అలాంటి తరుణంలో.. నా మానస పుత్రుడు చంద్రబాబు.. నన్ను గుర్తించాడు. మోడువారిన నా మోములో ఆశల పూలు విరబూయించాడు. నా గత వైభవాన్ని మరో సారి గుర్తు తెచ్చాడు. ప్రపంచమంతా నా పేరు మారుమోగించాడు. నాకు మరో శాతకర్ణిలా కనిపించాడు. అందుకే.. ఆయన అడిగీ అడగ్గానే నా బిడ్డలు వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చేశారు. ఆ రోజున నా ఆనందానికి అవధులు లేవు.
Must Read ;- చంద్రబాబు అసామాన్య యత్నం.. రైతన్నల త్యాగ ఫలం.. అమరావతి
నా అభివృద్ధికి చేయూతనిస్తానన్న ప్రధాని చేయిచ్చినప్పుడు ఆందోళనకు గురయ్యా. అయినా నా ముద్దుబిడ్డ చంద్రబాబు అధైర్యపడలేదు. తన మేధస్సునే పెట్టుబడిగా పెట్టి.. అభివృద్ధి పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూశాడు. వేల కోట్ల రూపాయల పనులు, భారీ నిర్మాణాలను నిరాటంకంగా సాగించాడు. నా నేలపై వెలుస్తున్న అందమైన భారీ నిర్మాణాలను చూసి మురిసిపోయా. దేశదేశాల నుంచి వస్తున్న పర్యాటకులను చూస్తూ మైమరచిపోయా. గత వైభవానికి దగ్గరలో ఉన్నాననుకుంటూ పొంగిపోయా. అంతలోనే రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిపోయింది. ఐదేళ్లు అంత బాగా పాలించిన నా బిడ్డను ప్రజలు ఎందుకు అంతలా ఓడించారో నాకైతే ఇప్పటికీ అర్థం కావడంలేదు. నా ప్రాంత వాసులు కూడా ఓడించడం నాకు మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది.
కొత్త పాలకుడు కూడా నా అభివృద్ధిని కొనసాగిస్తాడనే అనుకున్నా. కానీ, ఎక్కడో భయం. అతడి గురించి ఎన్నెన్నో కథలు విన్నా. భారీ అవినీతి కుంభకోణాలకు పాల్పడ్డాడని, 16 నెలల పాటు జైళ్లో కూడా ఉండివచ్చాడని విని భయపడ్డా. అయినా నా జోలికి రాడులే అని భావించా. కానీ.. నా ఆశలన్నీ అడియాసలు చేస్తూ.. అధికారం చేపట్టిన తొలిరోజు నుంచే నా పగ తీర్చుకోవడం ప్రారంభించాడు. చంద్రబాబుకు భూములిచ్చారని నా బిడ్డలను వేధింపులకు గురిచేశాడు. నా ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి మొత్తాన్నీ ఆపేయించాడు. పచ్చని పంటపొలాలతో అలరారుతున్న నన్ను.. మోడువార్చేశాడు. ఎందుకిలా చేస్తున్నాడు? నాపై, నా బిడ్డలపై ఎందుకు కక్షగట్టాడు? ఎంతగా ఆలోచించినా.. నాకైతే ఇప్పటికీ అర్థం కావడంలేదు. చంద్రబాబు మీద ఉన్న కోపాన్ని నాపై చూపిస్తున్నాడా? ఏమో..!
యావద్దేశాన్న పాలించిన నాటి చక్రవర్తులకే రాజధానిగా వెలిగిన నేను.. నేటి మా అవినీతి చక్రవర్తికి రాజధానిగా పనికి రావడంలేదా? అర్థం కావడంలేదు. నా బిడ్డల దీక్ష 365వ రోజుకు చేరిన సందర్భాంగానైనా నా ప్రశ్నలకు సమాధానం చెప్పరూ..!
Also Read ;- ‘ఒకే రాష్ట్రం ఒకేరాజధాని’ : మహాపాదయాత్రకు భారీ స్పందన