నూతన వ్యవసాయ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త ఆందోళనలకు జాతీయ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. అందులో భాగంగానే తెలంగాణలోనూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టి తమ పార్టీ రైతుల పక్షం అని చెప్పడానికి ప్రయత్నం చేసింది. ఈక్రమంలోనే ఏఐసిసి పిలుపులో భాగంగా సోమవారం హైదరాబాద్లోని రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసి నూతన వ్యవసాయ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ ఏఐసిసి ఇంఛార్జీ మాణిక్కం ఠాకూర్, కాంగ్రెస్ ముఖ్య నాయకులు వినతిపత్రం ఇవ్వాలని రాజ్భవన్కు కార్యకర్తలతో ర్యాలీగా బయలు దేరారు. ర్యాలీగా రాజ్భవన్కు వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ కు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు మాణిక్కం ఠాకూర్ దూకుడును తెలంగాణ పోలీసులు ఇలా బ్రేక్ వేశారు.
కాంగ్రెస్ దూకుడుకు అడ్డుకట్ట
వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా ర్యాలీని చేపట్టి అటు బిజెపి, ఇటు టిాఆర్ఎస్ ప్రభుత్వాలకు ఇరుకునపెట్టాలని కాంగ్రెస్ పార్టీ అనుకున్నది. ఇందులో భాగంగానే వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్కు వినతిపత్రం ఇవ్వాలని కోరుతూ తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జీ మాణిక్కం ఠాకూర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు రాజ్ భవన్ ర్యాలీని చేపట్టారు. ఈ ర్యాలీని విజయవంతంగా చేపట్టి రైతుల పక్షాన పోరాడేది కాంగ్రెస్ పార్టీయే అనే భావనను ప్రజల్లోకి బలంగా తీసుకోళ్లాలని అనుకున్నారు. దీనికోసం ఏఐసిసి ఇంఛార్జీ మాణిక్కం ఠాకూర్ తన టీమ్ తో కలిసి ఆందోళన చేపట్టారు. అయితే వీరి ప్రయత్నాన్ని రాజ్ భవన్ వర్గాలు, తెలంగాణ పోలీసులు అడ్డుకట్ట వేశాయి.
చాలా రోజుల తరువాత కాంగ్రెస్ పార్టీ భారీస్థాయిలో ఓ నిరసన కార్యక్రమాన్ని మళ్లీప్పుడు చేపట్టింది. ఇందులో భాగంగానే గవర్నర్ ను కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు పోలీసులను కోరారు. కరోనా కారణంగా అనుమతి లేదని రాజ్భవన్ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో తమ వినతిపత్రాన్ని తీసుకునేందుకు ఒక అధికారిని రాజ్ భవన్ నుంచి బయటికి పంపించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. అయితే వినతి పత్రాన్ని మెయిల్లో పంపాలని కాంగ్రెస్ నేతలకు రాజ్భవన్ వర్గాలు పేర్కొన్నాయి. రాజ్భవన్ పక్కనే ఉన్న దిల్ఖుష్ గెస్ట్ హౌజ్లో కాంగ్రెస్ నేతలు కొద్దిసేపు సమావేశమై రాజ్భవన్ వైపుగా వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. అనుమతిలేనందున పోలీసులు కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసి గోషామహాల్ పోలీసు స్టేషన్కు తరలించినట్లు సమాచారం.
అక్టోబర్ 2న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన..
ఈ సందర్భంగా పిసిసి ఛీఫ్ మీడియాతో మాట్లాడారు. కరోనా కారణం చూపి గవర్నర్ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని పిసిసి అధ్యక్షులు ఉత్తమ్కుమార్ రెడ్డి మండిపడ్డారు. సీఎం కెసిఆర్తో భేటీకి ఎలాంటి కరొనా అడ్డు రావడం లేదా? అని ప్రశ్నించారు. దేశంలో నరేంద్రమోదీ ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రైతులను కేసీఆర్- మోడీ ప్రభుత్వాలు ఇబ్బందులు పెడుతున్నాయని విమర్శించారు. వ్యవసాయ బిల్లు పై రాష్ట్రపతికి గవర్నర్ ద్వారా వినతిపత్రం ఇవ్వాలని గవర్నర్ను కోరుతున్నామని చెప్పారు. వ్యవసాయ బిల్లుల వల్ల వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోతుందన్నారు. పార్లమెంట్ లో ఏకపక్షంగా మూడు బిల్లులను అప్రజాస్వామికంగా బిజెపి పాస్ చేయించిందని ఆయన మండిపడ్డారు. అక్టోబర్ 2న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడ్తామని ఆయన పేర్కొన్నారు. బీజేపీ అనుబంధ పార్టీలు బిల్లును వ్యతిరేకించినా పార్లమెంట్లో బిల్లును బిజెపి పాస్ చేయించిందని తెలిపారు. రాజ్యసభలో బీజేపీకి బలం లేకున్నా అప్రజాస్వామికంగా బిల్లులు పాస్ చేయించిందని ఉత్తమ్ విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం ప్రైవేట్- కార్పొరేట్ సంస్థలకు తొత్తుగా మారిందని ఆరోపించారు. వర్షాల వల్ల జరిగిన పంట నష్టానికి ఒక్క రూపాయి కూడా రైతులకు కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. వ్యవసాయ బిల్లుల వెనుక అనేక కుట్రలు ఉన్నాయని ఉత్తమ్ ఘాటుగా విమర్శించారు.
అరెస్టయిన నేతలు..
పోలీసులు అరెస్టు చేసిన వారిలో రాష్ట్ర కాంగ్రెస్ ఇంఛార్జీ మాణిక్కం టాకూర్పీ, పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ముఖ్యనాయకులు పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే సీతక్క, దామోదర రాజనర్సింహా, సంపత్కుమార్, అనిల్కుమార్ యాదవ్, దాసోజు శ్రావణ్, శ్రీధర్బాబు, చిన్నారెడ్డి, ఇందిరా శోభన్, నేరళ్ళ శారదతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.