విశాఖలోని వాల్తేరు క్లబ్ యాజమాన్య హక్కుల వ్యవహారం మరోసారి వార్తల్లో నిలిచింది. నారాయణ శెట్టి అనే వ్యక్తి నుంచి 31 ఎకరాలు లీజుకు తీసుకుని 1885లో ప్రారంభమైన వాల్తేరు క్లబ్ కు చాలా చరిత్రే ఉంది. లీజుకు భూములు తీసుకున్న వాల్తేరు క్లబ్ నిర్వాహకులు 1961లో అనకాపల్లి సెటిల్ మెంట్ అధికారి నుంచి రఫ్ పట్టా పొందారు. అప్పటి నుంచి వాల్తేరు క్లబ్ భూములపై వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. విశాఖలో ప్రభుత్వ భూముల కబ్జాను నిగ్గు తేల్చేందుకు వైసీపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా వాల్తేరు క్లబ్ నిర్వాహకులకు, విశాఖ కార్పొరేషన్ అధికారులకు సిట్ నోటీసులు జారీ చేసింది. భూ యాజమాన్య హక్కులను నిర్ధరించే ఆధారాలతో హాజరు కావాలని సిట్ నోటీసులు జారీ చేసింది.
అసలు వాల్తేరు క్లబ్ గొడవేంటి
ఎప్పుడో బ్రిటీష్ పాలకుల కాలంలో రైల్వే అధికారుల కోసం ఏర్పాటు చేసుకున్న వాల్తేరు క్లబ్ క్రమేణా నగరంలో కలసి పోయింది. ప్రస్తుతం వాల్తేరు క్లబ్ కు 31 ఎకరాల భూమి ఉంది. దీని విలువ వందల కోట్లకు చేరడంతో యాజమాన్య హక్కులపై రగడ మొదలైంది. విశాఖ టౌన్ సర్వే నెంబరు 1012, 1016, 1018, 1021ల్లో 31 ఎకరాల భూములను నారాయణశెట్టి అనే వ్యక్తి నుంచి 1895మే 16న వాల్తేరు క్లబ్ నిర్వాహకులు లీజుకు తీసుకున్నారు. 1961లో అనకాపల్లి సహాయ సెటిల్ మెంట్ అధికారి క్లబ్ నిర్వాహకులకు రప్ పట్టా జారీ చేశారు. విశాఖ సెటిల్ మెంట్ కోర్టు ఇచ్చిన పట్టాను రద్దు చేసి ఎస్టేట్ అబాలిషన్ యాక్టు సెక్షన్ 20 కింద భూమిని స్వాధీనం చేసుకుంటున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై పిటీషన్ వేసుకోవాలని వాల్తేర్ క్లబ్ కు రెవెన్యూ కమిషనర్ 1990లో ఆదేశాలు జారీ చేశారు. అయినా క్లబ్ నిర్వాహకులు ఎటువంటి పిటిషన్ వేయలేదు.
దీంతో క్లబ్ భూములు ప్రభుత్వానికి చెందుతాయని అధికారులు వాదిస్తున్నారు. 2013లో ప్రభుత్వం క్లబ్ నిర్వాహకులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఎస్టేట్ అబాలిషన్ చట్టం ప్రకారం లీజును రద్దు చేసి భూములు స్వాధీనం చేసుకోవాలని 2012లో అప్పటి కలెక్టర్ ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. 2013లో భూ స్వాధీనం కోసం వాల్తేరు క్లబ్ కు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే 16 ఎకరాలను విశాఖ కార్పొరేషన్ స్వాధీనం చేసుకుంది. స్వాధీనం చేసుకున్న భూమికి పరిహారం చెల్లించింది. ప్రభుత్వ భూమి అని, పరిహారం వెనక్కు ఇవ్వాలని మరలా నోటీసులు జారీ చేసింది. దీనిపై హైకోర్టులో కేసు నడుస్తోంది.
లీజు ముగిసింది, యజమాని ఏమయ్యారు?
వాల్తేరు క్లబ్ ఏర్పాటు చేసేందుకు నారాయణశెట్టి అనే వ్యక్తి నుంచి 31 ఎకరాలు లీజుకు తీసుకున్నారని తెలుస్తోంది. లీజు ఎన్ని సంవత్సరాలకు తీసుకున్నారనే విషయం స్పష్టం కాలేదు. లీజు గడువు ముగిసినాక భూమి యజమానికి చెందుతుంది. కానీ లీజుకు ఇచ్చిన వారు ఎవరూ క్లయిమ్ చేయలేదని తెలుస్తోంది. దీంతో క్లబ్ నిర్వాహకులు భూమిని స్వాధీనం చేసుకునేందుకు రెవెన్యూ చట్టాల్లోని లొసుగులను వినియోగించుకున్నారని తెలుస్తోంది. ఎవరైనా 14 సంవత్సరాలు భూమిని అనుభవిస్తే అది వారికే చెందుతుందని, అయితే 14 సంవత్సరాలు వరుసగా వారి వినియోగంలో ఉన్నట్టు ఆధారాలు చూపితే పట్టాలు కూడా మంజూరు చేస్తున్నారు. వాల్తేరు క్లబ్ విషయంలో కూడా ఇదే జరిగింది. అసలు భూ యజమాని లేకపోవడంతో ఆ భూమి కోసం క్లబ్ నిర్వాహకులు, విశాఖ కార్పొరేషన్ అధికారులు భూమి కోసం కోర్టుల్లో పోరాడుతున్నారని తెలుస్తోంది. దీనిపై హైకోర్టులో కేసు నడుస్తోంది, వాల్తేరు క్లబ్ భూముల యాజమాన్య హక్కు విషయంలో కోర్టు తీర్పు కీలకంగా మారింది.