ఏపీలో వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు గతంలో ఎప్పుడూ లేనట్లుగా నెలవారీ వేతనాలు కూడా చాలా ఆలస్యంగా ఇస్తున్న, పరిస్థితి నిజంగానే ఆందోళన కలిగించేదే. అయితే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం చేస్తున్న ఖర్చులపై పీఏసీ చైర్మన్ గా ఉన్న టీడీపీ నేత, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశశ్.. రూ.41 వేల కోట్ల ఖర్చుకు అసలు లెక్కాపత్రమే లేదని సంచలన ఆరోపణలు చేశారు. అదే విషయాన్ని గవర్నర్ కు ఫిర్యాదు కూడా చేశారు. దీనిపై ఇప్పుడు పెద్ద రచ్చే జరుగుతోంది. ఇలాంటి కీలక సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ.. ఏపీ ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ ఓ లేఖ రాసింది. ఎఫ్ఆర్బీఎం పరిమితికి మించి ఏకంగా రూ.17 వేల కోట్లకు పైగా అప్పులు చేయడంతో పాటుగా ఆ నిధులను జగన్ సర్కారు ఖర్చు చేసిన వైనాన్ని కేంద్రం ప్రశ్నించింది. దీనిపై సంజాయిషీ ఇవ్వాలన్న రీతిలో కేంద్రం రాసిన లేఖ ఇప్పుడు ఏపీ అధికార యంత్రాంగంలో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది.
చంద్రబాబు, కేసీఆర్ లు ఇలా చేయలేదే
దేశంలోని ఏ రాష్ట్రమైనా అప్పు చేయాలంటే ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్ మెంట్ (ఎఫ్ఆర్బీఎం) నిబంధనలను పాటించాల్సిందే. ఓ రకంగా చెప్పాలంటే.. ఈ నిబంధనలు ఏ రాష్ట్రానికి ఎంతమేర అప్పు చేసుకోవచ్చని చెబుతాయి. అందుకే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఏ రూపంగా అప్పు తీసుకోవాలనుకున్నా.. తప్పనిసరిగా కేంద్రం అనుమతి తీసుకోవాల్సిందే. అదే సమయంలో ఎఫ్ఆర్బీఎం పరిమితిని కూడా ఎప్పటికప్పుడు కేంద్రానికి గుర్తు చేస్తూ.. తన పరిస్థితిని తెలియజేస్తూ ఆ పరిమితిని పెంచుకోవాల్సి ఉంటుంది. అయితే ఆయా రాష్ట్రాలు చెప్పే కారణాలను పరిశీలించే కేంద్రం.. ఆయా రాష్ట్రాలకు ఎఫ్ఆర్బీఎం పరిమితిని ఏ మేర పెంచాలి? అసలు పెంచాల్సిన అవసరం ఉందా? అన్న అంశాలను పరిశీలించి కేంద్రం ఆదేశాలు జారీ చేస్తుంది. అటు ఏపీలో గత ప్రభుత్వాన్ని నడిపిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అయినా, ఇటు తెలంగాణ సీఎంగా ఉన్న కేసీఆర్ అయినా ఇవే నిబంధనలను పాటిస్తూనే సాగారు. సాగుతున్నారు కూడా.
ఏం సమాధానం చెబుతారో?
ఇలాంటి పరిస్థితుల్లో ఏపీలోని జగన్ సర్కారు కేంద్ర ప్రభుత్వం కళ్లుగప్పి ఎఫ్ఆర్బీఎం పరిమితిని మించి ఏకంగా రూ.17 వేల కోట్లకు పైగా అప్పు తీసుకోవడం, ఆ నిధులను ఖర్చు కూడా చేసేయడం అంటే మాటలు కాదు కదా. ఈ విషయాన్ని గుర్తించిన వెంటనే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నేరుగా ఏపీ ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాసింది. ఇలా ఎఫ్ఆర్బీఎం పరిమితిని మించి అప్పు ఎలా చేశారు? ఆ నిధులను ఎలా ఖర్చు చేశారు? అసలు ఈ విషయంలో వాస్తవమెంత? తక్షణమే నివేదిక రూపంలో సమాధానం ఇవ్వాలని ఆ లేఖలో కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఇలా ఎఫ్ఆర్బీఎం పరిమితిని మించి ఇప్పటిదాకా ఏ ఒక్క రాష్ట్రం కూడా అప్పు చేయలేదని, అంతేకాకుండా కేంద్రానికి తెలియకుండా ఈ తరహా వ్యవహారాలు ఇప్పటిదాకా సాగలేదని కూడా సదరు లేఖలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జగన్ సర్కారుకు అక్షింతలు వేసింది. మరి ఈ లేఖకు జగన్ సర్కారు ఏ రీతిన సమాధానం ఇస్తుందో చూడాలి. ఇలా తన అనుమతి లేకుండా అప్పు తీసుకుని మరీ ఖర్చు చేసిన నిధులను ఈ ఆర్థిక సంవత్సరానికి చెందిన నిధుల్లో సర్దుబాటు చేసుకుంటామని కేంద్రం చెప్పడం గమనార్హం.
Must Read ;- అప్పు ప్లీజ్.. జగన్ అభ్యర్థనకు కేంద్రం నో