ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వినాయక చవితి ఉత్సవాలు ఈ ఏడాది గతంలో ఎన్నడూ ఎరగనంత కనిష్ఠ స్థాయిలో జరగబోతున్నాయి. కొవిడ్ వాతావరణం నేపథ్యంలో జనం గుమికూడకుండా, ప్రమాదం పొడసూపకుండా జాగ్రత్తలు తీసుకోవడం వేరు. కానీ.. అసలు చవితి ఉత్సవాలను నిర్వహించే అవకాశమే లేకుండా ఆంక్షలను విధించడం వేరు. జగన్మోహన్ రెడ్డి తీసుకున్న తాజా నిర్ణయం ప్రజలను విస్తుపోయేలా చేస్తోంది. వినాయక చవితి వేడుకలను కేవలం ఇళ్లలో విగ్రహాలు పెట్టుకుని మాత్రమే చేసుకోవాలని జగన్ ఆదేశించేశారు. బహిరంగంగా విగ్రహాలు ఏర్పాటు చేయడం, పందిళ్లు వేయడం, నిమజ్జనయాత్రలు ఇత్యాది వేడుకలకు సంబంధించిన అన్నింటినీ ఈ ఏడాది నిషేధించారు. ఇదంతా కూడా కొవిడ్ వ్యాప్తిని అరికట్టడానికి తీసుకుంటున్న చర్యలుగానే ప్రభుత్వం పేర్కొంటుండడం విశేషం. రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూను ఇంకా కొంతకాలంపాటు కొనసాగించాలని సీఎం ఆదేశించడాన్ని సానుకూలంగానే అర్థం చేసుకోవచ్చు. కానీ.. చవితి ఉత్సవాలపై విధించిన నిషేధాజ్ఞలు మాత్రం ప్రజలకు ఆవేదన కలిగిస్తున్నాయి.
సెంటిమెంట్ను చిదిమేశారే
వినాయక చవితి అంటే కులమతాలకు అతీతంగా అందరూ కలిసి జరుపుకునే అరుదైన పండుగ. ఏ కాలనీలో జరిగే ఉత్సవాల్లో అయినా హిందువులతో పాటు, ముస్లిములు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటూనే ఉంటారు. జనం గుంపులుగా పాల్గొనడం అనేది ఇప్పటి పరిస్థితుల్లో సాధ్యం కాని సంగతి.. జరగకూడని సంగతి అయినప్పటికీ.. ఒక పందిరి వేసి వినాయకుడిని ప్రతిష్టించి జనం లేకుండా అయినా సరే.. పూజలు చేసి వేడుక చేసుకోవడం ప్రతిచోటా ప్రజలకు ఒక సెంటిమెంట్ గా మారిపోయిన విషయం. అలాంటిది పూర్తి నిషేధం అనేది ప్రజలకు బాధగా ఉంది. వినాయకచవితి ఉత్సవాలు నిర్వహిస్తే.. పబ్లిక్ స్థలాల్లో ఏర్పాటుచేసే పందిర్ల వద్ద వాలంటీర్లు, పోలీసులతో నియంత్రణకు కొన్ని ఏర్పాట్లు చేస్తే జనం ఎక్కువ రాకుండా చేయడం చాలా చిన్న పని. అలాంటి జాగ్రత్తలకు సంబంధించిన ఏర్పాట్ల గురించి ఆలోచించకుండా.. ఏకంగా ఉత్సావాలనే రద్దు చేయాలని సీఎం జగన్ నిర్ణయించడం ప్రజలకు అర్థం కావడం లేదు.
మరి పాఠశాలలు తెరిచారుగా..
వినాయకుడి ఉత్సవాలకు మాత్రం కొవిడ్ పేరు చెప్పి ఆంక్షలు పెడుతున్న ప్రభుత్వం.. ఇతర విషయాల్లో ఏం జాగ్రత్తలు పాటిస్తోందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆలయాల్లో భక్తుల సందర్శనలు ఆగడం లేదు, చర్చిల్లో ఆదివారం ప్రార్థనలు ఆగడం లేదు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు చిన్న కార్యక్రమం నిర్వహిస్తే.. కొవిడ్ అతిక్రమణ కేసులు పెడుతున్నారు. అదే సమయంలో అధికార పార్టీ వారు.. వందల మందితో గుంపులుగా నిర్వహిస్తున్న కార్యక్రమాలు కూడా ఆగడం లేదు. వీటన్నింటినీ మించి.. మూడో వేవ్ కరోనా వ్యాపిస్తే.. పిల్లల ప్రాణాలకే ఎక్కువ ముప్పు అనే ప్రచారం చాలా కాలంగా ఉండగా.. పిల్లలు ఇళ్లలోనే కూర్చుని చదువుకునే ప్రత్యామ్నాయ ఏర్పాటు, ఆన్లైన్ తరగతుల నిర్వహణకు పుష్కలంగా అవకాశం ఉండగా.. ప్రభుత్వం వారి ప్రాణాలను పణంగా పెడుతూ.. పాఠశాలలను పునఃప్రారంభించేసింది. ఇన్నింటి విషయంలో ప్రజల ప్రాణాలు ఏమైపోతాయో పట్టించుకోకుండా ఉన్న ప్రభుత్వం.. వినాయక చవితి ఉత్సవాల విషయంలో కనీస ఏర్పాట్లో చక్కగా నియంత్రణకు అవకాశం ఉండగా.. పూర్తిస్థాయి నిషేధం కత్తివేటు వేయడం ప్రజలకు బాధ కలిగిస్తోంది.
Must Read ;- జగన్ ఇంటి పక్కనే ‘నాడు-నేడు’ ఇలా!