దర్శకుడు, రచయిత నంద్యాల రవి కన్నుమూశారు. ఆయన కరోనా పాజిటివ్ తో ఆస్పత్రి పాలైన సంగతి తెలిసిందే. గతంలో ఈయన ‘లక్ష్మీరావే మా ఇంటికి’సినిమాకి దర్శకత్వం వహించారు. ప్రస్తుతం సప్తగిరి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. కరోనాతో ఆస్పత్రి పాలైనప్పుడు దాదాపు 7 లక్షరూపాయల వరకూ ఆస్పత్రి బిల్లు అయ్యింది. హీరో సప్తగిరి లక్ష రూపాయల ఆర్థిక సహాయం కూడా చేశారు. కోలుకుంటున్నాడు అనుకుంటున్న నంద్యాల రవి ఇలా ఆకస్మికంగా కన్నుమూయంతో సినీ పరిశ్రమ దిగ్బ్రాంతికి లోనైంది.
రచయితగా సత్తా చాటారు
“నేనూ సీతామహాలక్ష్మీ, పందెం, అసాధ్యుడు” వంటి చిత్రాలతో రచయితగా తన సత్తా చాటుకుని… “లక్ష్మీ రావే మా ఇంటికి” చిత్రంతో దర్శకుడిగా మారారు నంద్యాల రవి.. తన తదుపరి చిత్రానికి దర్శకత్వం వహించేందుకు సన్నాహాలు చేసుకుంటూనే.. రచయితగా వస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ దూసుకుపోతున్న యువ ప్రతిభాశాలి నంద్యాల రవి (42)ని కరోనా కాటేసింది. చికిత్స పొందుతూ ఆసుపత్రిలో ఈరోజు ఉదయం 9.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. రవికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.
రవి స్వస్థలం పాలకొల్లు సమీపంలోని సరిపల్లి (గణపవరం పక్కన). రవి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటుండగా అతనికి పలువురు ఆర్ధిక సాయం అందించారు. ఇక కోలుకుని ఇంటికి వచ్చేస్తున్నాడనగా.. కరోనా అతడ్ని బలి తీసుకుంది. రవి అకాల మరణం పట్ల ప్రముఖ నిర్మాతలు వల్లూరిపల్లి రమేష్ బాబు, కె.కె.రాధామోహన్, బెక్కెం వేణుగోపాల్.. ప్రముఖ దర్శకులు విజయ్ కుమార్ కొండా, ప్రముఖ నటులు సప్తగిరి, ధన్ రాజ్ తదితరులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. విజయ్ కుమార్ కొండా-రాజ్ తరుణ్ కలయికలో రీసెంట్ గా వచ్చిన ‘ఒరేయ్ బుజ్జిగా, పవర్ ప్లే’ చిత్రాలకు రవి రచయితగా పని చేశారు.