టాలీవుడ్ లో నిందితులకు సిట్ క్లీన్ చిట్ ఇచ్చేసింది. కొండను తవ్వితే చిట్టెలుకలే దొరికాయి. ‘షిట్! ఇదేం దర్యాప్తు?’ అనుకున్నారు సామాన్య జనం. పెద్ద ఎలుకలు ఏ కలుగులో దూరాయో తెలియదు.
డ్రగ్స్ కేసులో దర్యాప్తును ఎదుర్కొన్న సినీ ప్రముఖులంతా తాము అనుకున్నట్టుగానే జరిగింది. అందుకే ‘డామిట్ కేసు అడ్డం తిరిగింది’ లాంటి డైలాగులేమీ వారి నోటి నుంచి రాలేదు. సినిమాల్లో తప్ప బయట డ్రగ్స్ అంటే ఏమిటో మన సినిమా వారికి ఏం తెలుసు.. జనం ఆడిపోసుకోవడం తప్ప. డ్రగ్స్ కేసులో నాలుగేళ్ల క్రితం రోజుకో సినీ ప్రముఖుడి పేరు తెరపైకి రావడం, జనం కళ్లప్పగించి టీవీ వైపే చూడటం.. భలే మజాగా ఉందిలే. ఎప్పుడు ఎవరి పేరు బయటికి వస్తుందోనని వణికిపోవడం సినీ జనాల వంతైంది. 2017 నాటి ప్రకంపనాలను ఎవరూ మరచిపోలేదు.
అసలు హీరో అకున్ సబర్వాలే
దర్యాప్తు అధికారి అకున్ సబర్వాల్ సినిమా స్టయిల్ లో ఈ కేసు దర్యాప్తును చేపట్టి హీరో అనిపించుకున్నారు. హీరోలు మాత్రం ఆయన వద్ద బారులు తీరారు. అకున్ అయ్యగారు నీతినిజాయితీలకు మారు పేరన్నమాట కూడా మార్మోగింది. ఇంకేముంది సినిమా వారి జాతకాలన్నీ బయటపడి పోతున్నాయి అని అంతా అనుకున్నారు. గత ఏడాది సుశాంత్ మరణం తర్వాత కూడా బాలీవుడ్ లోనూ అదే పరిస్థితి. బాలీవుడ్ సంగతిని పక్కన పెట్టి మన టాలీవుడ్ లోకి వచ్చేద్దాం. ఈ కేసుకు సంబంధించి సిట్ చార్జి షీట్ దాఖలు చేసింది.
తమకు ఏమీ కాదన్న ధీమాతోనే సినీ ప్రముఖులంతా ఉన్నారు. ముందు అధికారులకు సహకరిద్దాం.. ఆ తర్వాత మన సంగతి మనం చూసుకుందాం అన్న తరహాలోనే సినీ నటులు కూడా అప్పట్లో వారికి సహకరించారు. తీరా ఇప్పుడు ఛార్జి షీటు రావడం, అందులో వారి పేర్లు రాకపోవడం చూసి ఎవరూ పెద్దగా ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే తెరవెనక ఏంజరిగిందో తెలిసి ఉండటం కావచ్చు లేదా వారికి ఏ పాపమూ తెలియక పోవచ్చు. అందరూ మిస్టర్ క్లీన్ లేనని నిరూపించుకున్నారు. సిట్ సమర్పించిన ఛార్జి సీటుకు కోర్టు కూడా ఆమోదం తెలిపింది.
మొత్తం 12 కేసులను ఎక్సయిజ్ శాఖ నమోదు చేసింది. 30 మందిని అదుపులోకి తీసుకుంటే వారిలో 27 మందిని అధికారులు విచారించారు. మొత్తం 60 మంది దాకా ఈ కేసులో ఉన్నారు. నమోదైన 12 కేసుల్లో 8 కేసుల్లో మాత్రమే ఛార్జిషీటు దాఖలు చేశారు. 11మంది సినీ ప్రముఖులకు మాత్రం ఎక్సైజ్ అధికారులు క్లీన్ చిట్ ఇచ్చారు. కాబట్టి ఇక్కడి దాకా అంతా సాఫీగా సాగిపోయింది. ఇంతకీ ఆ సినీ ప్రముఖుల పేర్లు కూడా అప్రస్తుతమేమో. ఎందుకంటే వారికి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు కదా.
ఎక్సయిజ్.. అనవసర ఎక్సర్ సైజ్
ఎక్సయిజ్ శాఖ ఈ కేసులో అనవసర ఎక్సర్ సైజ్ చేసిందేమో. ఆరోపణలే కాబట్టి మేము దర్యాప్తు చేశాం అని వారనవచ్చు. అలాంటప్పుడు వారి పేర్లను మీడియాకు ఎందుకు ఎక్కించాల్సి వచ్చిందో. తమని అల్లరిపాలు చేసినందుకు ఆ శాఖ మీద ప్రతీకారం తీర్చుకునే సాహసాన్ని మన సినీ ప్రముఖులు కూడా చేయకపోవచ్చు. అసలిక్కడ డగ్ర్ ఎక్కడున్నాయి? అవి ఎలా ఉంటాయి? వాటిని తీసుకుంటే ఎలాంటి మజా వస్తుంది? లాంటి ప్రశ్నలు కూడా మన వారి నుంచి వస్తున్నాయి.
సాధారణంగా డ్రగ్స్ కేసులను జాతీయ స్తాయిలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో దర్యాప్తు చేస్తుంది. రాష్ట్రాలకు వచ్చేసరికి ఈ బాధ్యత ఎక్సయిజ్ శాఖ చేతుల్లో ఉంటుంది. అకున్ సబర్వాల్ ఈ కేసులో కీలకంగా వ్యవహరించినపుడు కేవలం సినిమా వాళ్లకే పరిమితం కాకుండా అనేక పాఠశాలలు, కాలేజీలకు కూడా నోటీసులు జారీ చేశారు. ఆయన పని ఆయన చేశారు. దాని ఫలితం ఎలా ఉంటుందో మాత్రం కాలమే నిర్ణయిస్తుంది. మొత్తానికి డ్రగ్స్ కథ కంచికి చేరింది.. నిందితులు ఇంటికి చేరారు అంటే బాగుంటుందేమో.
-హేమసుందర్
Must Read ;- టాలీవుడ్ డ్రగ్స్ మూలాలు ఎక్కడ ఉన్నాయి?











