ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. జన్మతః నిష్టాగరిష్ఠుడైన క్రిస్టియను. కానీ.. హిందూ, ఇస్లాం విశ్వాసాలను కూడా పాటిస్తారు. చాలా సహజంగా, ప్రతి రాజకీయ నాయకుడూ కూడా.. అన్ని మతాల పట్ల తమ సమానమైన ఆదరాభిమానాల్ని అవకాశం వచ్చినప్పడెల్లా ప్రకటించుకుంటూ ఉంటారు. ప్రత్యేకించి మన భారత దేశంలో ఏ మతానికి చెందిన ఏ పుణ్యక్షేత్రానికి వెళ్లినా.. అక్కడ ఇతర మతస్తులు కూడా ప్రార్థనలు, పూజాదికాలు నిర్వహించడం చాలా సహజంగా కనిపిస్తూ ఉంటుంది. ఇతర మతాల, విశ్వాసాల పట్ల కూడా ద్వేషరహితమైన సద్భావన మన జాతి మూలాల్లోనే ఉంది. ఆ రకంగా చూసినప్పుడు స్వతహాగా క్రిస్టియను అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి హిందూ మత విశ్వాసాలను పాటించడం సబబుగానే, మంచి పరిణామంగానే కనిపిస్తుంది.
విశ్వాసాలను నమ్ముతున్నారా, వ్యక్తులను నమ్ముతున్నారా.. అనేది వేరే సంగతి. విశాఖపట్నంలో కొలువు తీరి ఉండే శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి కి కూడా జగన్మోహన్ రెడ్డి భక్తుడు. భక్తిని మించిన అనుబంధం కూడా వారిద్దరి మధ్య ఉన్నదని ఎరిగిన వారు అంటుంటారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి.. సదరు స్వరూపానందేంద్ర స్వామి.. యజ్ఞాలు, హోమాలు, పూజాదికాలు అనేకం స్వయంగా చేయించారని.. అంటుంటారు. దానికి తగ్గట్టుగానే.. సీఎం కాగానే ముఖ్యమంత్రి వెళ్లి సాగిలపడి మొక్కి తన భక్తి ప్రపత్తులను కూడా చాటుకున్నారు. ఇదే ఆధ్యాత్మిక స్వామికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా భక్తులు. ఆయన ఇంకా ఘనంగా.. రెండెకరాల భూమిని రెండు రూపాయలకు స్వామివారికి విక్రయించి.. తన భక్తికి నిదర్శనంగా ప్రభుత్వం ఖర్చుతో మొక్కు చెల్లించుకున్నారు.
అంత ఘనమైన మొక్కు చెల్లించిన కేసీఆర్ కంటె తన లోని భక్తి మరింత ఘాటైనదని ప్రపంచానికి చాటాలని జగన్మోహన రెడ్డికి అనిపించిందో ఏమో గానీ.. ఆయన ప్రభుత్వం కొత్తగా ఒక ఉత్తర్వులు ఇచ్చింది.
ఈనెల 18వ తేదీన స్వరూపానందేంద్ర జన్మదినం. ఆ జన్మదినాన్ని ఆయన భక్తులు చాలా ఘనంగానే జరుపుకుంటారు కావొచ్చు. భక్తులకు ఉండగల స్థాయీతాహతులను బట్టి.. వారి వారి పరిధిలో ఉండే దేవాలయాల్లో ఘనంగా పూజాపునస్కారాలు కూడా ఆయన పేరిట నిర్వహింపజేస్తారు. ఆయన పేరిట అన్నదానాలు, వస్త్రదానాలు గట్రా సాగించినా అతిశయోక్తి లేదు. కానీ జగన్ మరింత ఘనంగా మొక్కు చెల్లించదలచుకున్నారు.
స్వరూపానందేంద్ర జన్మదిన వేడుకల్ని అధికారికంగా నిర్వహించాలంటూ దేవాదాయ శాఖ చాలా దేవాలయాలకు మెమో జారీ చేసింది. ఈ మేరకు దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ కె.రామచంద్రమోహన్ ఆదేశాలు జారీచేశారు. శ్రీకాకుళంలోని అరసవిల్లి సూర్యదేవాలయం, ద్వారకా తిరుమల, రామతీర్థం, సింహాచలం, కనకమహాలక్ష్మి, అన్నవరం, అంతర్వేది, మావుళ్లమ్మ దేవస్థానం ఈవోలకు ఆయన ఈ మెమో పంపినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ నెల 9న శారదాపీఠం మేనేజర్ లేఖ రాశారని, దానికి స్పందించి ఆయా ఆలయాలకు కమిషనర్ మెమో పంపారని తెలుస్తోంది.
రాష్ట్రంలో చిన్నా చితకా స్వాములందరూ కలిపి వందల సంఖ్యలో ఉంటారు. వారి వారి భక్తుల నుంచి చందాలు, దందాలు, ఆదరణ, ఇలాంటి వ్యవహారాలన్నీ ఇబ్బడి ముబ్బడిగా ఉంటాయి గనుక.. వారికి ‘మేనేజర్లు’ కూడా ఉంటారు. తమ తమ స్వాములకు అదనపు యశశ్చందికలు కట్టబెట్టడానికి వారంతా ప్రభుత్వానికి లేఖ రాసేస్తే.. వారి వారి మఠాలు, ముఠాలు ఉన్న పరిధిలో ఉండే దేవాదాయ శాఖ ఆలయాలన్నింటిలో వారి జన్మదినాలకు, పెళ్లిరోజులకు ప్రత్యేక పూజలు నిర్వహించాలని ఉన్నతాధికారులు ఆదేశించేస్తారా? అనేది ప్రశ్న.
ఇది జగన్ భక్తికి నిదర్శనమా..
జగన్మోహన్ రెడ్డి స్వయంగా స్వరూపానందేంద్ర భక్తుడు గనుక.. ఆయనను సంతృప్తి పరచడానికి అధికారులు ఇలాంటి మెమో ఇచ్చారా? లేదా, ఆయన నుంచి అందిన ప్రచ్ఛన్న ఆదేశాలమేరకే మెమోలు విడుదలయ్యాయా? అనేది స్పష్టత లేదు. ఒకవేళ జగన్ కే గనుక.. ఆ రీతిగా స్వరూపానందకు మొక్కు చెల్లించుకోవాలని అనిపించి ఉంటే.. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులను హోరెత్తించి.. ఊరూరా ప్రత్యేకపూజలు, నిరతాన్నదానాలు నిర్వహించి ఉండవచ్చు. అలా చేయకుండా ప్రభుత్వ పరంగా.. దేవాదాయ శాఖ ఆధీనంలోని ఆలయాల్లో.. ఒక మఠం నిర్వహిస్తున్న స్వరూపానంద జన్మదినానికి ప్రత్యేక పూజలంటూ, ఆలయాల్లో వేడుకలు జరపాలంటూ ఆదేశాలివ్వడం అతిభక్తికి నిదర్శనంగా ఉంది.
స్వామి అనిపించుకోవడానికి ప్రాథమిక లక్షణం నిష్కామ కర్మాచరణ. ఆయన మేనేజరు లేఖ రాయడం ఏమిటో దేవాదాయ శాఖ ఉత్తర్వులు ఏమిటో అంతా అయోమయంగా ఉంది.











