విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించే విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కు తగ్గేలా లేదు. గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపాలంటూ కేంద్రానికి లేఖ రాశారు. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ స్పందించారు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించినా ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడతామని ఠాకూర్ స్పష్టం చేశారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తే లాభాల్లోకి వస్తుందని, లేదంటే నష్టాలు పెరిగిపోయి మూత వేయడం తప్పదని ఆయన జయదేవ్ కు రాసిన లేఖలో వెల్లడించారు.
అనేక అనుమానాలు…
విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తేనే లాభాలు వస్తాయంటూ కేంద్రం ప్రకటించడం విడ్డూరంగా ఉందని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఎద్దేవా చేశారు. ప్రభుత్వం చేతిలో ఉండగా ఆ పని చేసి చూపలేరా అని ఆయన ప్రశ్నించారు. ప్రైవేటు చేతుల్లోకి వెళ్లగానే స్టీల్ ప్లాంటు లాభాల్లోకి వస్తుందని చెప్పడం అంటే 5 కోట్ల ఆంధ్రులను మోసం చేయడమేనన్నారు. 32 మంది ప్రాణత్యాగాలతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణను అడ్డుకుని తీరతామని ఆయన ప్రకటించారు. 20 వేల మందికి ప్రత్యక్షంగా లక్ష మంది కార్మికులకు పరోక్షంగా ఉపాది కల్పిస్తున్న స్టీల్ ప్లాంటును ప్రైవేటుకు అప్పగిస్తే వారి జీవనం దుర్బరంగా మారుతుందని ఎంపీ గల్లా జయదేవ్ ఆందోళన వ్యక్తం చేశారు.
Must Read ;- ముందుగా విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల అమ్మకం.. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి ప్రకటన











