యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తున్న తరుణంలో భారత ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది. అది ఏంటంటే కేంద్రం ద్వారా కరోనా టీకాను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు వెల్లడించింది. ముందుగా 30 కోట్ల మంది ప్రాధాన్య వర్గాలకు కొవిడ్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు కేంద్రం సిద్ధం అయినట్లు ప్రకటించింది. ఇదిలా ఉంటే కొన్ని రాజకీయ పార్టీలు తమ ప్రభుత్వం పగ్గాలు చేపడితే రాష్ట్ర ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ అందజేస్తామని తెలిపిన హామీలకు కేంద్రం ప్రకటించిన వార్తతో చెక్ పెడుతున్నట్లు తెలుస్తోంది.
కొవిడ్ -19 నివారణకు టీకా పూర్తి స్థాయిలో సిద్ధం కాగానే కేంద్ర ప్రభుత్వమే వాటిని సేకరించి ప్రాధాన్య వర్గాలకు ఉచితంగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా కొవిడ్ టీకా కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ప్రాథమిక దశలో 30 కోట్ల మంది ప్రాధాన్య లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియను ప్రారంభించినట్లు తెలిపారు. దీని గురించి కేంద్రం రూ.50 వేల కోట్లను కేటాయించనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నప్పటికీ ఆర్థిక శాఖ నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు.
ఇది నిజమైతే అది అబద్ధమే..
మరి కేంద్ర సంబంధిత వర్గాలే స్వయంగా సుమారు 30 కోట్ల మంది భారతీయులకు ఉచితంగా టీకాను అందజేస్తామని తెలియజేయడంతో ఎన్నికల మ్యానిఫెస్టోలో ‘మా పార్టీ గెలిస్తే అందరికీ ఉచితంగా టీకా’ అని స్వయంగా నిర్మలాసీతారామనే బీహార్ లో ప్రకటించారు. అంటే ఇప్పుడు ఆ హామీలు అన్ని అబద్ధాలు అనేగా అర్థం.
కేవలం ఎన్నికల్లో గెలిచేందుకు ముందు మంత్రంగా ఈ సూత్రాన్ని వాడేసినట్లు స్పష్టంగా తెలిసిపోతుంది. మరి దీని గురించి మన ఆర్థిక మంత్రి గారు ఏం చెబుతారో వేచి చూడాల్సిందే. కేవలం బీహార్ లో మాత్రమే కాకుండా మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి కూడా దాదాపు ఇదే తరహా హామీలను ఇచ్చారు. మరి ఇప్పుడు వీరందరు కేంద్ర హామీపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
అయితే ఇది అంతా భాజపా డ్రామానా…?
ఎన్నికల్లో గెలిస్తే రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ వేయిస్తామని స్వయంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామనే మాట్లాడం అనేది పెద్ద డ్రామా అని స్పష్టం అవుతుంది. కేవలం ఎన్నికల్లో గెలిచేందుకు భాజపా ఆడుతున్న నాటకాలు అని తెలుస్తోంది. కేంద్రమే ఉచితంగా దేశ ప్రజలకు టీకా వేయిస్తామని ప్రకటించిన తరువాత మళ్లీ వీళ్లు కొత్తగా మేము మాత్రమే ఉచితంగా ఇస్తామని చెప్పడం ఇప్పుడు ప్రతిపక్ష పార్టీల చేతికి చిక్కినట్లే అయ్యింది.
అవన్నీ అబద్ధాలే అనమాట..
టీకా విషయంలోనే బోర్లాపడ్డ భాజపా మిగతా విషయాల గురించైనా నిజాలు చెప్పిందో లేదో. ఎన్నికల్లో గెలిస్తే 19 లక్షల ఉద్యోగాలు కూడా నోటి మాటలు మాత్రమే అనే భావన ప్రజల్లో ఇప్పటికే వచ్చేసినట్లు తెలుస్తోంది. మరి వీటి గురించి ప్రజలకు భాజపా ఏమని సమాధానం చెబుతుందో చూడాలి.