ఐదు రోజులుగా నిలిపి ఉంచిన ఎమ్మెల్సీల ఫైల్పై గవర్నర్ బిష్వభూషన్ హరిచందన్ ఎట్టకేలకు సంతకం చేశారు. లేళ్ల అప్పిరెడ్డి, తోట త్రిమూర్తులుపై క్రిమినల్ కేసులున్నాయని ఫైల్ నిలిపి వేసిన గవర్నర్, సీఎం వివరణతో మెత్తబడినట్టు తెలుస్తోంది. దీంతో మోషేన్ రాజు, రమేష్ యాదవ్, లేళ్ల అప్పిరెడ్డి, తోట త్రిమూర్తులను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమిస్తూ పంపిన ఫైల్ క్లియర్ అయింది. నిన్న సీఎం జగన్మోహన్ రెడ్డి, గవర్నర్ బిష్వభూషన్ హరిచందన్ను కలసి ఇద్దరు ఎమ్మెల్సీల క్రిమినల్ కేసులపై వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో వెంటనే గవర్నర్ ఫైల్ పై సంతకం చేశారు. దీంతో ఆ నలుగురిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నుకున్నట్టయింది.
ఆచితూచి వ్యవహరిస్తున్నారు..
ప్రభుత్వం నుంచి వచ్చే ఫైళ్లను గవర్నర్ కార్యాలయం ఏ రోజుకు ఆ రోజు క్లియర్ చేస్తూ ఉంటుంది. అయితే కొన్ని ఫైళ్ల విషయంలో మాత్రం చాలా వివరాలు తెప్పించుకుంటున్నారు. గతంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకానికి ముగ్గురు పేర్లతో ప్రభుత్వం జాబితా పంపింది. అయితే అందులో విశ్రాంత ఐఏఎస్ అధికారి శామ్యూల్ వైపు ప్రభుత్వం మొగ్గు చూపినట్టు ప్రచారం జరిగింది. అయితే శ్యామూల్ రికార్డులు పరిశీలించిన గవర్నర్ ఆయన పేరు తిరుస్కరించారు. చివరకు మాజీ సీఎస్ నీలం సాహ్ని పేరు ఖరారు చేశారు. తాజాగా నామినేటెడ్ పదవుల విషయంలోనూ నలుగురి అభ్యర్ధుల గురించి పరిశీలించి ఫైల్ నిలిపివేసినట్టు తెలిసింది. ఆ తరవాత సీఎం వివరణ ఇవ్వడంతో గవర్నర్ సంతకం చేశారనే ప్రచారం సాగుతోంది.
Must Read ;- నీలం సాహ్నినియామకంపై హైకోర్టు నోటీసులు