‘దేశమును ప్రేమించుమన్నా .. మంచియన్నది పెంచుమన్నా’ అంటూ వందేళ్ల క్రితం నీవు వల్లించిన మాటలు నేటికీ మా మెదళ్లలో కదులుతున్నా.. మా ప్రభుత్వాలు , మంత్రులు ఇచ్చిన హామీలు మాత్రం గాలిమూటలు , నీటి మాటలు అవుతున్నాయి. అవి మా ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణికి , ప్రజాప్రతినిధుల చపలత్వానికి నిలువుటద్దాలుగా నిలుస్తున్నాయి. అందుకు మా జాతిని మన్నించుమా.. ఓ మహాకవి.
మ్యూజియం ముచ్చటే లేదు.. ఆడిటోరియం మాటే లేదు
‘అభ్యుదయ కవి , ఆధునిక వైతాళికుడు అటువంటి గురజాడ నడయాడిన నేలలో అడుగిడడం మహా భాగ్యం .. ఆయన నివసించిన ఇల్లు పరమ పావన పుణ్యక్షేత్రం.. ఆయన వాడిన వస్తువులను దర్శించడం గత జన్మ సుకృతం .. ఆయన ఇంటిని మ్యూజియంగా మారుస్తాం , ఆయన వాడిన వస్తువులను అందులో ప్రదర్శనకు ఉస్తాం’ , గురజాడ పేరున జిల్లా కేంద్ర గ్రంధాలయ ఆవరణలో ఓపెన్ ఆడిటోరియం నిర్మిస్తాం అంటూ గత కాంగ్రెస్ , తెలుగుదేశం ప్రభుత్వాలు , అప్పటి మంత్రులు, ప్రజాప్రతినిధులు ఢంకా బజాయించారు.
ఆయా ప్రభుత్వాలు మారిపోయాయి తప్ప హామీలు అమలు కాలేదు. కొన్ని దశాబ్దాలుగా ప్రతీయేటా గురజాడ జయంతి, వర్ధంతి వస్తునే ఉన్నాయి. ఈలోగా 2015 నవంబర్ 30న ఆయన శత వర్ధంతిని కూడా ఆర్భాటంగా నిర్వహించారు. ఈ అన్ని సందర్భాలలో మంత్రులు , ప్రజాప్రతినిధులు, వారికి తోడుగా ఉన్నతాధికారులు హామీలు ఇస్తునే ఉన్నారు.
ఆ హామీలు ఒకదానికి , ఒకటి తోడవుతూ గురజాడ కవితల్లా వినసొంపుగా ఉంటున్నాయి. ఆయన రచనల్లా పేరుకుపోతున్నాయి. వేరొకవైపు ఆయన నివసించిన గృహం శిధిలమైపోతోంది. ఆయన వాడిన వస్తువులు స్వరూపం కోల్పోతున్నాయి. ప్రభుత్వాలకు, ప్రజాప్రతినిధులకు అవి గుర్తుకు రావు. ఎందుకంటే వాటివల్ల ఓట్లు పడవు. ఏ ఎండకా గొడుగు పట్టే చందంగా తయారైన అధికారులకు హామీల అమలుపై శ్రద్ధే ఉండదు. వెరసి భావితరాలకు గురజాడ భవనం ఒక పురాతన శిధిలంగా, ఆయన వాడిన వస్తువులు కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
ముగ్గురు ఉప ముఖ్యమంత్రులు వస్తున్నారని ..
గురజాడ జయంతి రోజైన సెప్టెంబర్ 21న విజయనగరం జిల్లాకు యాదృచ్చికంగా ముగ్గురు ఉప ముఖ్యమంత్రులు ఆళ్ల నాని , ధర్మాన కృష్ణదాస్ , పాముల పుష్పశ్రీవాణి వస్తున్నారని, వారు కచ్చితంగా గురజాడను గుర్తు చేసుకుంటారని , గతంలో ఇచ్చిన హామీలకు ఒక స్వరూపం కల్పిస్తారని జిల్లా ప్రజలు ఆశించారు. అనుకున్నట్టే ముగ్గురు ఉపముఖ్యమంత్రులు , వారికి తోడుగా ఇంకో మంత్రి సీదిరి అప్పలరాజు విజయనగరం జిల్లాలోని పార్వతీపురం వచ్చారు.
అందరూ ఊహించనట్టే అక్కడ అధికారికంగా నిర్వహించిన గురజాడ జయంతి ఉత్సవంలో పాల్గొన్నారు. యథాతథంగా గురజాడ అభ్యుదయ కవి , గొప్ప సంఘసంస్కర్త , దేశభక్తిని ప్రేరేపించిన యుగకర్త అని కోనియాడారు తప్ప గత హామీల ప్రస్తావనా లేదు , కొత్తగా చెప్పిందీ ఏమీ లేకపోవడంతో జిల్లా ప్రజలు ముక్కున వేలేసుకున్నారు.
కలెక్టర్ గారు కొత్త హామీ
జిల్లా కేంద్రంలో సోమవారం జరిగిన గురజాడ జయంతి ఉత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డా. హరిజవహర్ లాల్ ఉన్న హామీలకు తోడుగా కొత్తగా గురజాడ ఇంటికి వెళ్లే కూడలిలో ఏర్పాటు చేసివున్న కాంస్యవిగ్రహం ఉన్న ప్రదేశ కూడలికి గురజాడ పేరుపెడతామని హామీ ఇచ్చారు. ‘మొదటిదానికి లేనిది కడదానికి ఎందుకన్నట్టు ..’ స్థానికులు గుసగుసలు వ్యక్తం చేస్తున్నారు.
ఆనాడు
దేశమంటే మట్టి కాదోయ్ ..
దేశమంటే మనుషులోయ్ అనే నీవు
నేడుంటే
రాజకీయమంటే హామీలు గుప్పించడమేనోయ్..
ఆనక వాటిని మరచిపోడమేనోయ్ …
అనుండేవాడివి .. ఓ గురజాడా. నీకిదే మా కన్నీటి నివాళి











