ఏపీ హైకోర్టు ఇవాళ కీలక వ్యాఖ్యలు చేసింది. విశాఖలో చంద్రబాబు పర్యటనకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్న కేసును ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. చంద్రబాబునాయుడి పర్యటనను అడ్డుకోవడాన్ని అఫిడవిట్లో పేర్కొంటూ ప్రభుత్వానిది మతిలేని చర్య అని న్యాయవాది పేర్కొనడాన్ని, ప్రభుత్వ తరపు న్యాయవాది తప్పుపట్టారు. ఈ సమయంలో ధర్మాసనం కల్పించుకుని వేలకోట్లు ఖర్చుచేసిన రాజధానిని తరలించడం మతిలేని చర్యకాదా అని ప్రశ్నించింది.
దీంతో ఖంగుతిన్న న్యాయవాది, కేసు రాజధాని గురించి కాదని, నేను జడ్జినికాదు, మీరు న్యాయవాది కాదని వ్యాఖ్యానించారని తెలుస్తోంది. నేరచరితులు రాజకీయాల్లోకి వస్తున్నారని, ఇది ఎంత మాత్రం శ్రేయస్కరం కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
పోలీసుల చర్యను తప్పుపట్టిన హైకోర్టు
ఈ ఏడాది జనవరిలో విశాఖ పర్యటనకు వెళ్లిన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడిని ఎయిర్ పోర్టు బయటకు రాగానే పోలీసులు నిలిపివేశారు. పర్యటనకు అనుమతి లేదని విశాఖలో గొడవలు జరిగే అవకాశం ఉందని పోలీసులు అక్కడికక్కడే నోటీసులు జారీ చేశారు. దీనిపై చంద్రబాబునాయుడు హైకోర్టును ఆశ్రయించారు. కేసును విచారించిన హైకోర్టు పోలీసుల తీరును తప్పుపట్టింది. తాజాగా ఈ కేసు విచారణలో రాజధాని తరలింపు అంశం కూడా ధర్మాసనం తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది.
Must Read ;- విశాఖలో.. మంత్రి ‘కన్న’.. ఎంపీ మిన్న..!