హీరో రాజ్ తరుణ్ కొంత కాలంగా హిట్లకు దూరమై పోయాడు. తాజాగా ఓ సినిమా శ్రీకారం చుట్టుకుంది. విజయ్ కుమార్ కొండా దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. వనమాలి క్రియేషన్స్ నిర్మించే ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకుంది. థ్రిల్లర్ మూవీగా ఈ సినిమా తెరకెక్కబోతోంది. హైదరాబాద్ కోకాపేటలో పూజా కార్యక్రమాలతో ఈ రోజు షూటింగ్ ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు క్లాప్ కొట్టగా ప్రముఖ నిర్మాత గోపినాథ్ ఆచంట కెమెరా స్విచాన్ చేశారు. మొదటి సన్నివేశాన్ని దేవుడి చిత్రపటాలపై చిత్రీకరించారు. స్క్రిప్ట్ను కె.ఎస్. రామారావు చేతుల మీదుగా దర్శకుడు విజయ్ కుమార్ అందుకున్నారు.
దర్శకుడు విజయ్ కుమార్ కొండా ఈ సినిమా విశేషాలు చెబుతూ గుండె జారి గల్లంతయ్యిందే, ఒక లైలా కోసం, ఒరేయ్ బుజ్జిగా సినిమాలకు పూర్తి భిన్నంగా ఈ సినిమా ఉంటుందని వివరించారు. వైవిధ్యమైన థ్రిల్లర్ కాన్సెప్ట్ తో దీన్ని తెరకెక్కించబోతున్నట్లు చెప్పారు. తనకు కూడా ఓ మంచి సినిమా దొరికిందని రాజ్ తరుణ్ అన్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పలమర్తి అనంత్ సాయి మాట్లాడుతూ నేటి నుంచి కంటిన్యూగా షూటింగ్ ఉంటుందని చెప్పారు. ఇందులో ఇంకా హేమల్ ఇంగ్లే, పూర్ణ, మధు నందన్, అజయ్, కోటా శ్రీనివాసరావు, రాజా రవీంద్ర, ధన్రాజ్, కేదరి శంకర్, టిల్లు వేణు, భూపాల్, అప్పాజీ, రవివర్మ, సంధ్య జనక్ తదితరులు నటిస్తున్నారు. కథ-మాటలు: నంధ్యాల రవి, సంగీతం: అనూప్ రూబెన్స్. మహిదర్, దేవేష్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.