సుకుమార్ దర్శకత్వంలో బన్నీ కథానాయకుడిగా ‘పుష్ప’ సినిమా రూపొందుతోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే కథ ఇది. అందువలన కథ అంతా కూడా దట్టమైన అడవి నేపథ్యంలోనే సాగనుంది. అడవి నేపథ్యంలోని సన్నివేశాలను మారేడుమిల్లి – రంపచోడవరం పరిధిలోని ప్రదేశాల్లో చిత్రీకరిస్తున్నారు. కథాపరంగా మారేడుమిల్లి అడవుల్లో ఒక భారీ సెట్ కూడా వేశారు. అక్కడ కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించిన తరువాత, ఆ షెడ్యూల్ పూర్తికావడంతో సినిమా టీమ్ హైదరాబాద్ కి తిరిగి వచ్చేసింది.
ఇక ఇప్పుడు మారేడుమిల్లిలోని అదే సెట్లోకి చరణ్ దిగిపోయినట్టుగా చెబుతున్నారు. ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రీకరణ చివరిదశకు చేరుకోవడంతో, చరణ్ ‘ఆచార్య’ సినిమా షూటింగులోకి దిగిపోయాడట. చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ రూపొందుతోంది. దేవాదాయ భూములు .. వాటి చుట్టూ అల్లుకున్న రౌడీయిజం – రాజకీయం గురించి ఈ కథ నడుస్తుందని అంటున్నారు. అలాంటి దుష్టశక్తుల దూకుడికి అడ్డుకట్టవేసే పౌరుషం కలిగిన పౌరుడిగా చిరంజీవి కనిపిస్తాడని చెబుతున్నారు. చిరంజీవి సరసన కాజల్ నటిస్తుండగా, ఈ ఇద్దరి కాంబినేషన్లోని కొన్ని కీలకమైన సన్నివేశాలను ఇటీవల చిత్రీకరించారు.
ఇక ఈ సినిమాలో చరణ్ ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నాడు. ఫారెస్టు నేపథ్యంలోనే ఈ పాత్ర నడుస్తుంది. అంటే అడవుల్లో ఒక డెన్ వంటి ప్రదేశంలో ఆయన ఉంటాడన్నమాట. ఇందుకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరంచడం కోసమే ‘పుష్ప’ సెట్ ను తీసుకున్నారన్న మాట. ఈ సెట్ ను కాస్త అటు ఇటుగా మార్చేసి చేస్తున్నట్టుగా చెబుతున్నారు. పూజా హెగ్డే కూడా ఈ షూట్ లో పాల్గొంటోందని అంటున్నారు. ఈ సినిమాలో చరణ్ జోడీగా అలరించనున్నది ఈ బ్యూటీనే. ఈ జంటపై ఓ మెలోడీ సాంగును కూడా చిత్రీకరించనున్నారు. మే 13వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.











