పోలవరం ప్రాజెక్టు ఏపీ జీవనాడి. ఈ ప్రాజెక్టు కోసం తవ్విన కుడికాలువ నేడు కొందరికి కాసులు కురిపిస్తోంది. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయ్యేలోగా కృష్ణా డెల్టాలోని 12 లక్షల ఎకరాలకు రెండు పంటలకు సాగునీరందించాలనే ఉద్దేశంలో టీడీపీ ప్రభుత్వం పట్టిసీమ ప్రాజెక్టును చేపట్టింది. 178 కిలోమీటర్ల పోలవరం కుడి కాలువను పూర్తి చేసి ప్రకాశం బ్యారేజీ ఎగువ ప్రాంతంలో కృష్ణా నదిలో కలిపారు. గత ఐదేళ్లుగా పట్టిసీమ జలాలు కృష్ణా డెల్టా రైతుల పాలిట వరంగా మారాయనే చెప్పాలి. 2015 నుంచి వరుసగా నాలుగు సంవత్సరాలు కృష్ణా డెల్టా రైతులు పట్టిసీమ నీటితో ఏటా రెండు పంటలు పండించుకోగలితారు. ఈ ఏడాది కృష్ణా నది ఎగువ ప్రాంతం నుంచి వరద పోటెత్తుతోంది. అందుకే ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే 20 రోజుల పాటు పట్టిసీమ పంపులను నడిపి తరువాత ఆపివేశారు. తాజాగా కృష్ణా నదిలో వరద కొనసాగుతున్నా పట్టిసీమలో 3 పంపులను నడుపుతున్నారని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇటీవల ప్రభుత్వమే అధికారికంగా తెలిపింది.
ఎవరి కోసం..
నేటికీ నాగార్జునసాగర్ నుంచి 36 వేల క్యూసెక్కుల వరద జలాలను ప్రకాశం బ్యారేజీకి వదులుతున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద కూడా గేట్లు ఎత్తి వరద జలాలను సముద్రంలోకి వదులుతున్నారు. ఎగువ ప్రాంతం నుంచి వరద జలాలు వస్తున్నా మూడు రోజుల కిందట పట్టిసీమ ఎత్తిపోతల పంపులను పనిచేయించడం ప్రారంభించారు. ఇదంతా ఎవరి కోసం అని అనుమానం రావచ్చు. ఎందుకంటే కృష్ణాలో నీటి ఎద్దడి లేదు. ఇప్పటికీ వరద జలాలను సముద్రంలోకి వదిలేస్తున్నారు. మరి పోలవరం కుడి కాలువ కింద ఎలాంటి ఆయకట్టు లేదు. ఇలాంటి సమయంలో పట్టిసీమ ఎత్తిపోతల పంపులను ఎందుకు ఆన్ చేశారనే అనుమానాలు రాకమానవు. పోలవరం కుడి కాలువలో కొందరు అక్రమార్కులు పెద్ద ఎత్తున చేపల సాగు చేపట్టారని తెలుస్తోంది. వారి కోసమే పట్టిసీమ పంపులు ఆన్ చేసి నీరు వదులుతున్నారనే అనుమానాలు బలపడుతున్నాయి.
కాలువలో చేపల సాగు ఏంటి?
పోలవరం కాలువలో కొన్ని ప్రాంతాలు చేపల సాగుకు అనుకూలంగా ఉన్నాయి. కాలువ వెడల్పు, లోతు ఎక్కువగా ఉండటంతోపాటు ఎప్పటికప్పుడు ప్రెష్ నీరు వచ్చి పోతూ ఉండటంతో అక్రమార్కులు చేపల సాగుపై దృష్టి సారించారని తెలుస్తోంది. దీనిపై అధికారులు కూడా నోరుమెదపడం లేదు. అంటే పోలవరం కుడి కాలువలో చేపల పెంపకం వారికి తెలియకుండా జరగుతుందని భావించలేం.
ఖర్చు ప్రభుత్వానికి.. ఆదాయం అక్రమార్కులకు
పట్టిసీమ ఎత్తిపోతల పంపులు నడపడానికి పెద్ద ఎత్తున విద్యుత్ అవసరం ఉంటుంది. దీనికి గాను ఏపీ ప్రభుత్వం భారీగా విద్యుత్ సంస్థలకు బిల్లులు చెల్లిస్తోంది. పోలవరం కుడి కాలువలో కనీసం ఏడు నెలల పాటు నీరు ఉండేలా చూసుకుంటూ అక్రమార్కులు చేపలు పెంచుకుంటున్నారు. అంటే కరెంటు ఖర్చులు ప్రభుత్వానికి, ఆదాయం మాత్రం అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లిపోతోందని రైతులు విమర్శిస్తున్నారు.











