తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు మావోయిస్టుల కదలికలు లేవనే చెప్పాలి. 15 ఏళ్ల క్రితం దాకా తెలుగు నేలపై తమదైన శైలిలో సత్తా చాటిన మావోయిస్టులు క్రమేణా తెర మరుగైపోయారు. అయితే ఏపీలోని మన్యం ప్రాంతంలో అప్పుడప్పుడు మావోల చప్పుళ్లు వినిపిస్తున్నా… అవన్నీ పొరుగు రాష్ట్రాలకు చెందినవే. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఏపీలో మావోయిస్టులు మళ్లీ తమ ఉనికిని చాటుకునే యత్నం చేస్తున్నారని తెలుస్తోంది. అది కూడా జగన్ సర్కారు అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా క్రమేణా మావోయిస్టులు ఏపీపై దృష్టి సారిస్తున్నట్లుగా తెలుస్తోంది. జగన్ కేబినెట్ లోని ఇద్దరు మంత్రులకు బుల్లెట్ ప్రూఫ్ కార్లను సమకూర్చడంతో ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది. మన్యంలోని విలువైన ఖనిజాల తవ్వకానికి జగన్ సర్కారు వడివడిగా అడుగులు వేస్తున్న క్రమంలో మావోయిస్టులు… జగన్ కేబినెట్ లోని మంత్రులను టార్గెట్ చేసుకున్నట్లుగా నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ అనుమానాలతోనే ఇద్దరు మంత్రులకు ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ కార్లు అందుబాటులోకి వచ్చాయి.
మన్యంలో ఖనిజాల తవ్వకాలే కారణమా?
విశాఖ జిల్లాలో ప్రత్యేకించి మన్యం ఏరియాలో విలువైన ఖనిజాల తవ్వకంపై గిరిజనం చేస్తున్న పోరాటాలకు మద్దతు పలికిన మావోయిస్టులు చంద్రబాబు హయాంలో ఆ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను హత్య చేశారు. ఆ తర్వాత మళ్లీ రాష్ట్రంలో మావోల అలజడి అంతగా కనిపించలేదు. అయితే ఇప్పుడు జగన్ కేబినెట్ లో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసల కన్నబాబుకు ఇదివరకే బుల్లెట్ ప్రూఫ్ కారును అధికారులు ఏర్పాటు చేశారు. తాజాగా అదే జిల్లాకు చెందిన రామచంద్రాపురం ఎమ్మెల్యే, జగన్ కేబినెట్ లో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు కూడా తాజాగా బుల్లెట్ ప్రూఫ్ కారును కేటాయించారు. నిత్యం మన్యం ప్రాంతాల్లో సంచరిస్తున్న కారణంగానే వీరిద్దరికీ ప్రభుత్వం బుల్లెట్ ప్రూఫ్ కార్లను ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
మరింత మందికి బుల్లెట్ ప్రూఫ్ కార్లు
ఏపీలో జగన్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయింది. ఈ రెండేళ్లలో ప్రభుత్వం అభివృద్ధి కంటే సంక్షేమానికే ఎక్కువ ప్రాధాన్యమిచ్చింది. దీంతో ప్రభుత్వం అభివృద్ధి చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం అభివృద్ధి అజెండాను తెరపైకి తెస్తోంది. మారుమూల ఏజెన్సీ ప్రాంతాలకు సైతం అభివృద్ధి ఫలాలు అందాలనే ఉద్దేశంతో శ్రమిస్తున్న కేబినెట్ మంత్రులకు మావోయిస్టుల ముప్పు పెరుగుతున్నట్లు నిఘా నివేదికలు చెప్తున్నాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇద్దరు మంత్రులకు బుల్లెట్ ప్రూఫ్ కార్లను ఇచ్చింది. మున్ముందు మన్యం ప్రాంతంలో పర్యటించే మంత్రులు, కీలక ఎమ్మెల్యేలకు కూడా బుల్లెట్ ప్రూఫ్ కార్లు, మావోయిస్టుల దాడుల నుంచి తప్పించుకునేందుకు అవసరమైన మరింత భద్రతను కల్పించనున్నట్లుగా సమాచారం.