మెగాస్టార్ చిరంజీవిని అందరూ పెద్దన్న అన్నారు.. నేనా పాత్ర పోషించను అని మెగాస్టార్ జవాబిచ్చారు. కానీ ఆయనను పెద్దన్నను చేయడంలో మాత్రం జగన్ మార్కులు కొట్టేశారు. దీని వెనకున్న మతలబు ఏమిటా అని అందరూ చర్చించుకుంటున్నారు. సినిమా రంగ సమస్యల విషయమై ఈరోజు టాలీవుడ్ బృందం బయలుదేరి వెళ్లి సీఎం జగన్ ను కలిసి చర్చించిన సంగతి తెలిసిందే. ఇక్కడ చిరంజీవికే పెద్ద పీట వేశారు. ఆ క్రెడిట్ అంతా చిరంజీవిదే అని అంతా ఆయన ఖాతాలోనే వేసేశారు.
ఇటు ఫిలిం ఛాంబర్ ను కానీ, అటు నిర్మాతల మండలిని కానీ పిలవకుండా కేవలం మెగాస్టార్ తో పాటు కొంత మంది హీరోల సమక్షంలోనే సీఎం జగన్ చిత్ర పరిశ్రమకు వరాల మూట ఇచ్చి పంపారు. ఛాంబర్ నూ, నిర్మాతలనూ ఇన్వాల్వ్ చేసి ఉంటే బాగుండేదని నటుడు ఆర్. నారాయణ మూర్తి ప్రస్తావించారు కూడా. దానికి పేర్ని నాని తనదైన రీతిలో స్పందించారు. సిఫార్సుల కమిటీలో వారంతా ఉన్నందున వారిని పిలవలేదని సమర్థించారు.
జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు రాలేదో?
తమ కుటుంబం హీరోల తరఫున చిరంజీవి వెళుతున్నట్లు అల్లు అరవింద్ ప్రకటించారు. అక్కినేని నాగార్జున కూడా వెళ్లక పోవడం కొంత ఆశ్చర్యం కలిగించింది.ఇక ట్రిపుల్ ఆర్ బృందం తరఫున రాజమౌళి వెళ్లినట్లు కనిపిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ వెళ్లనున్నట్లు వార్తలు వచ్చినా ఆయన మాత్రం ఈ భేటీకి దూరంగా ఉన్నారు. హీరోల్లో మహేశ్ బాబు, ప్రభాస్ లు మాత్రమే హాజరయ్యారు. సీఎంతో చిరంజీవి భేటీ కావడానికి గత కొంతకాలంగా ఎంతో ప్రయత్నించినా ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు. ఆ తర్వాత ఉన్నట్టుండి ఏకంగా సీఎం జగన్ తన ఇంటికి విందుకు చిరంజీవిని ఆహ్వానించారు.
ఈ ఆహ్వానం వెనక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. సినిమా రంగ సమస్యలకు బదులు రాజకీయ పరమైన భేటీగా అందరూ భావించారు. దీనిపై మా అధ్యక్షుడు మంచు విష్ణు కూడా స్పందించారు. అది సినిమా రంగ సమస్యపై జరిగిన భేటీ కాదన్నట్లుగా మాట్లాడారు. పోనీ ఈరోజు మా అధ్యక్షుడి హోదాలో మంచు విష్ణుకు ఆహ్వానం అందిందా అంటే అదీ లేదు. చిరంజీవికి ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వడం ఇప్పుడు చిత్ర పరిశ్రమంలోనే కాదు సామాన్య ప్రజానీకంలో కూడా పెద్ద చర్చనీయాంశమవుతోంది.
ఓ సామాజిక వర్గం అభిమానాన్ని పొందడంలో భాగంగా ఇదో వ్యూహమంటూ జనం వ్యాఖ్యానిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించినా మెగాస్టార్ ను మాత్రం జగన్ దగ్గరకు తీస్తున్నారన్న భావన కలుగుతోంది. అసలు ఈ వ్యవహారాన్నంతటినీ రాజకీయ పరమైన కోణంలో కాకుండా చిత్ర పరిశ్రమ సంక్షేమం కోసమేనని సరిపెట్టుకుందామనుకున్నా మరి ఇది ఇంతకాలం ఏమైంది అన్న ప్రశ్న కూడా కలుగుతోంది. దీనికి కాలమే సమాధానం చెప్పాలి. ఈరోజు జరిగిన భేటీ చిత్ర పరిశ్రమకు మాత్రం కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.











