ఏపీ లో పోలీసుల తీరు రోజురోజుకీ దారుణంగా తయారవుతోంది.నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన పోలీసులు అధికార పార్టీ జీతగాళ్లగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫిర్యాదు చేసేందుకు వెళ్ళిన టిడిపి కార్యకర్త పై ఓ ఎస్సై వ్యవహరించిన తీరే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. టిడిపి కార్యకర్తను ఒక ఎస్సై బూతులు తిడుతూ, కితక బాదిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న రంగడు హద్దులు మీరీ ప్రవర్తించిన తీరు పోలీస్ శాఖకే మచ్చగా మారింది. మండలంలోని సంజీవరాయునిపల్లెకు చెందిన ఒక టిడిపి కార్యకర్త ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కి వెళ్ళగా అతనిపై ఎస్సై చెలరేగిపోయాడు. అతనిని చూడగానే ఆగ్రహంతో ఊగిపోయి బూతులు తిడుతూ, ఎడా పెడా వాయించేశాడు. బాధితుడిని చితకబాదుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వాస్తవానికి పద్మావతమ్మ అనే మహిళ దివ్యాంగుల కోటాలో పింఛను అందుకుంటున్నారు. కాగా, ఆమె టీడీపీ మద్దతురాలన్న కారణంతో పింఛను తొలగించాలంటూ స్థానిక వైసీపీ నేత దామోదర్రెడ్డి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై విచారించిన గ్రామ సచివాలయ కార్యదర్శి ఆమెకు అన్ని అర్హతలు ఉన్నట్టు నిర్ధారించడంతో పద్మావతమ్మ పింఛను కొనసాగుతోంది. అయితే తన తల్లి పింఛనను తొలగించేందుకు దామోదర్రెడ్డి ప్రయత్నించినట్టు తెలియడంతో పద్మావతమ్మ కుమారుడు దామోదర్ రెడ్డి ఇంటికి వెళ్లి నిలదీశాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో వేణు తాగి తన ఇంటి వద్ద గొడవ చేస్తున్నాడంటూ దామోదర్రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దామోదర్ రెడ్డి ఫిర్యాదు మేరకు ఆయన ఇంటి వద్దకు వచ్చిన పోలీసులు వేణును మందలించి అక్కడి నుంచి పంపించేశారు.
మరుసటి రోజు దామోదర్ రెడ్డి వ్యవహారం పై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వేణు కొంతమంది స్నేహితులతో కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్లాడు.అయితే వేణును చూసిన వెంటనే ఎస్సై రంగడు చెలరేగిపోయాడు.అకారణంగా దుర్భాషలాడుతూ వేణును చితకబాదాడు. ఈ ఉదంతాన్ని అక్కడే ఉన్న కొందరు సెల్ ఫోన్ లో చిత్రీకరించడంతో ఎస్సై భాగవతం బట్టబైలయ్యింది. ఎస్సై దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు అలర్ట్ అయ్యారు. ఈ ఘటణ పై స్పందించిన ఎస్పీ రాహుల్దేవ్ సింగ్ విచారణ జరిపేందుకు పెనుకొండ డీఎస్పీ రమ్యను నియమించారు.
ఇక వేణుపై ఎస్సై రంగడు దాడిచేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంపై టీడీపీ నేత నారా లోకేశ్ స్పందించారు. ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన బాధితుడిపై చేయిచేసుకోవడమేనా రాజారెడ్డి రాజ్యాంగంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే? అని ట్వీట్ ద్వారా నిలదీశారు. వేణుపై దాడికి పాల్పడిన వైసీపీ నేతలు, ఎస్సైపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.