తెలుగు రాష్ట్రాల్లో పెనుసంచలనం సృష్టించిన హైదరాబాద్ అమ్నీషియా పబ్ మైనర్ రేప్ కేసు నిందితులను ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పెద్దలు కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ ఆరోపించారు.
మైనర్ బాలికపై అత్యాచారం ఘటనకు కారణమైన పబ్ నిర్వాహకులపై కేసులు ఎందుకు పెట్టలేదని, ఆ పబ్ను ఎందుకు మూసివేయించలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 18 ఏళ్లలోపు వయసున్న వారిని పబ్లోకి అనుమతించడం నేరం కాదా అని నిలదీశారు. అత్యాచారం కేసులో ఏపీ సలహాదారుగా ఉన్న వ్యక్తి కుమారుడు, తెలంగాణ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ కొడుకు, హోంమంత్రి మనవడు సహా బడా బాబుల పిల్లలున్న క్రమంలో టీఆర్ఎస్ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం తమ వారిని కాపాడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయని పేర్కొన్నారు.
ఏపీ సీఎం జగన్ తక్షణమే తన ప్రభుత్వంలో సలహాదారుగా ఉన్న వ్యక్తిని తొలగించాలని, తెలంగాణ సీఎం కూడా వక్ఫ్బోర్డు చైర్మన్గా వ్యవహరిస్తున్న వ్యక్తిని ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండు చేశారు. వారు పదవుల్లోంచి దిగిపోవడానికి నిరాకరిస్తే ప్రభుత్వమే డిస్మిస్ చేసినట్టు ప్రకటించాలని సూచించారు. ఇవన్నీ చేయకుండా నిందితులను కాపాడేందుకు సీపీ ఆనంద్ వంటి వారిని ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు.
గతంలో ఉపముఖ్యమంత్రిగా ఉన్న కోనేరు రంగారావు మనవడిని కాపాడిన పోలీసులు నేడు హోంమంత్రి మనవడిని కాపాడుతున్నారంటూ గురువారం మీడియాకు విడుదల చేసిన వీడియోలో వ్యాఖ్యానించారు. ఇటువంటి వారు అధికారులుగా ఉంటే న్యాయం జరుగదని పేర్కొన్నారు.
ప్రభుత్వాలే నిందితులను కాపాడే ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలంటే అత్యాచార ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండు చేశారు.











