గన్నవరం నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య ముదిరిన విభేదాలు.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పరిష్కారం అయినట్టుగా భావించాలి. ప్రధానంగా నియోజకవర్గంలో ఒకరిమీద ఒకరు కత్తులు దూసుకుంటున్న ఇద్దరు నాయకులు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఆయనతో ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు ఇద్దరినీ జగన్ పిలిపించి మాట్లాడారు. ప్రత్యేకంగా భేటీ లాంటిది జరగకపోయినప్పటికీ.. వారిని బయటే కలిసి.. వారిద్దరి చేతులు కలిపి.. అంటే కరచాలనం చేయించి.. ఇద్దరూ కలిసి పనిచేసుకోవాలని హితవు చెప్పేశారు. ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సహకరించాలని యార్లగడ్డతో ముఖతః అనేశారు.
ఈ సందర్భంగా జగన్ స్వయంగా యార్లగడ్డ వెంకట్రావు చేతిని పట్టుకుని.. ఆ చేతిని వంశీతో కలిపించి.. సయోధ్య కుదిర్చిన అభిప్రాయం కలిగించారు. జగన్ సమక్షంలోనూ యార్లగడ్డ తన అసంతృప్తిని చూచాయగా బయటపెట్టారు. ఆ సమయంలో జగన్ యార్లగడ్డ బొజ్జను రెండుచేతులతోను నిమిరి.. చిరునవ్వుతో ఆయనను బుజ్జగిస్తూ కలిసి పనిచేసుకోవాల్సిందిగా హితవు చెప్పారు. ఈ ఇద్దరు నాయకులతో పాటు సీఎం వద్దకు వెళ్లిన వారిలో నియోజకవర్గంలో ఇరువర్గాలకు చెందిన నాయకులతో పాటు, దేవినేని అవినాశ్ కూడా ఉన్నారు.
చేతులు కలిపారు.. మనసులు కలుస్తాయా?
వల్లభనేని మీద యార్లగడ్డ ఏ రేంజిలో విరుచుకుపడుతూ వచ్చారో అందరికీ తెలుసు. వంశీ అద్దెనాయకుడంటూ ఘాటుగా చేసిన వ్యాఖ్యలు కూడా ప్రజలకు తెలుసు. ఆ దెబ్బకు ఏకంగా రాజకీయ సన్యాసమే తీసుకోవాలని వంశీ సిద్ధమవుతున్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి. ఆనేపథ్యంలోనే రాజీ చర్చల ఎపిసోడ్ నడిచింది.
జగన్ సమక్షంలో ఇరు వర్గాల నేతలు కలుస్తున్నారు.. ఆయన పంచాయతీ చేస్తారు అనగానే.. అందరూ ఊహించింది వేరు. జగన్ ఇద్దరినీ విడిగా కూర్చోబెట్టుకుని సుద్దులు చెబుతారని.. తరచూ అలుగుతున్న వెంకట్రావుకు ఏదో ఒక హామీ ఇస్తారని, తద్వారా ఊరడిస్తారని, మళ్లీ అసంతృప్తి రేగకుండా చేస్తారని అంతా భావించారు.
కానీ ఊహించినట్లుగా కాకుండా.. ఇద్దరు నాయకుల్నీ బయటే, అందరి మధ్యలోనే కలిసిన జగన్ సింపుల్ గా ఇద్దరితో కరచాలనం చేయించి.. విభేదాల ఎపిసోడ్ కు తెరదించేశారు. జగన్ చేతులు కలిపారు సరే.. ఇన్నాళ్లుగా కత్తులు దూసుకుంటున్న ఈ ఇద్దరు నాయకుల మధ్య ఈ చిన్న ‘షేక్ హ్యాండ్’ వల్ల మనసులు కలుస్తాయా? అనేది నియోజకవర్గ ప్రజల్లో మాత్రం ప్రశ్నార్థకంగానే ఉంది.