ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త రాజకీయ పార్టీ పుట్టుకు రాబోతోంది. సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ ‘జై భారత్ నేషనల్ పార్టీ’ పేరుతో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా తీసుకొచ్చేందుకు పుట్టిందే జై భారత్ నేషనల్ పార్టీ అని శుక్రవారం ప్రెస్ మీట్ పెట్టి లక్ష్మీ నారాయణ చెప్పారు. ఎవరూ అవినీతికి పాల్పడలేని వ్యవస్థను తీసుకొచ్చేందుకే పార్టీ స్థాపించానని, అభివృద్ధితో అవసరాలు తీర్చేందుకు.. బానిసత్వాన్ని రూపుమాపేందుకు ఈ పార్టీ పుట్టుకొస్తోందని లక్ష్మీనారాయణ తెలిపారు.
అయితే, లక్ష్మీ నారాయణ ఈ పార్టీ కోసం గత ఏడాదిగా ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పోయిన సంవత్సరంలోనే ఆయన ఈ పార్టీని రిజిస్ట్రేషన్ చేయించినట్లు తెలుస్తోంది. అయితే, ఏడాదిగా ఆయన ఎవరికి తెలియకుండా పోలీస్ మార్క్ స్కెచ్ వేసినట్లు ప్లాన్ చేస్తున్నట్లుగా కూడా సమాచారం. ప్రస్తుతం ఉన్న పార్టీలకు భిన్నంగా కొత్త లక్ష్యాలతో పార్టీ ఉంటుందని లక్ష్మీ నారాయణ చెబుతున్నారు. ఇలా ప్రెస్ మీట్ లో ఆయన చెప్పిన వివరాల ప్రకారం అయితే.. సాధారణంగా కాకుండా వినూత్న రీతిలో పార్టీ నిర్మాణం ఉండనున్నట్లు తెలుస్తోంది. కొందరు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో కూడిన వేదిక పార్టీగా మారుతుందని అంటున్నారు. దాంట్లో వారిదే ముఖ్య పాత్ర ఉంటుందని తెలుస్తోంది.
అయితే, లక్ష్మీనారాయణ ప్రకటించిన జై భారత్ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ ఓట్లపైన ఎక్కువ ప్రభావం చూపుతుందనే అంశంపై చర్చ మొదలైంది. ఎవరికి మేలు చేసే అవకాశం ఉందని కూడా అనుకుంటున్నారు. అయితే, వచ్చే ఎన్నికలు ఇంకో 3 నెలల్లోనే రానున్నాయి. ఇప్పటికే ప్రధానంగా రాష్ట్రంలో రెండు పార్టీల మధ్యే పోరు నడుస్తుంది. జగన్ ను గద్దె దింపేయడమా? చంద్రబాబుకు అధికారం అప్పగించడమా? ఈ రెండింటి మధ్యే రాజకీయం అంతా ఉంది. లక్ష్మీ నారాయణ ఒక ఐపీఎస్ అధికారిగా వ్యక్తిగతంగా మంచి క్రెడిబిలిటీ సంపాదించినప్పటికీ.. రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన పార్టీ ఎలాంటి ప్రభావమూ చూపకపోయే అవకాశం ఉంది. కానీ, లక్ష్మీ నారాయణ పోటీ చేసే విశాఖ స్థానంలో మాత్రం ప్రభావం ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో ఆయన తన మద్దతును ఎవరికి ఇస్తారు? అసలు ఇస్తారా లేదా అనే దానిపై కూడా స్పష్టత లేదు. ఒకవేళ పార్టీ ఎవరికీ సపోర్ట్ చేయకుండా ఉంటే వచ్చే మూడు నెలల్లో ఆయన పార్టీ వల్ల ప్రభావం ఏమీ ఉండకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
తొలుత మహారాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ అధికారి అయిన లక్ష్మీ నారాయణ.. సీబీఐలో జాయింట్ డైరెక్టర్ స్థాయికి వెళ్లారు. ఆ స్థాయిలో పెద్ద కేసులను డీల్ చేసి పెద్ద పేరు సంపాదించుకున్నారు. ఓబుళాపురం మైనింగ్ కేసులో గాలి జనార్ధన్ రెడ్డిని, అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్ ను అరెస్టు చేసి బాగా ఫేమస్ అయ్యారు. గత ఎన్నికలకు ముందు ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి.. రాజకీయాల్లోకి వచ్చారు. 2019లో జనసేన పార్టీ నుంచి విశాఖ ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు. తన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాలు చేస్తున్నారన్న కారణంగా జనసేనకు రాజీనామా చేశారు. కొంతకాలం రైతులు, ప్రజా సంఘాల్లో బాగా తిరిగారు. కొద్ది రోజుల క్రితం వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచే పోటీ చేస్తానని చెప్పారు. తాజాగా జై భారత్ నేషనల్ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.











